ఎమర్జెన్సీ నా జీవితాన్ని మార్చింది - 18 నెలలు జైల్లో పెట్టారు : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి - నవలలు, జీవిత చరిత్రలు, కథల పుస్తకాలు ఆధ్యాత్మికం, విప్లవ సాహిత్యంతో పాటు విద్యార్థుల చదువులకు అవసరమైన పుస్తకాల ప్రదర్శన

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 11:39 AM IST
36 Book Festival In Vijayawada: కథలు, నవలలు, కామిక్ పుస్తకాలు ఓ వైపు, సెల్ఫ్ డెవలప్మెంట్, పోటీ పరీక్షలు, విషయ పరిజ్ఞానం పెంచే బుక్స్, తాళపత్ర గ్రంథాలు మరోవైపు. అన్నీ ఒకేచోట పుస్తక ప్రియులను అలరిస్తున్నాయి. విజయవాడ పుస్తక మహోత్సవం లక్షలాది పుస్తకాలతో రారమ్మని ఆహ్వానిస్తోంది. ఇష్టమైన పుస్తకాలను కొనేందుకు తరలివచ్చిన వారితో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కళకళలాడింది.
తాళపత్ర గ్రంథాల కోసం ప్రత్యేక స్టాల్: విజయవాడలోని బుక్ ఫెస్ట్ పుస్తక ప్రియులకు వరంలా మారింది. 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో 240 కి పైగా స్టాళ్లలో లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంచారు. నవలలు, జీవిత చరిత్రలు, కథల పుస్తకాలు ఆధ్యాత్మికం, విప్లవ సాహిత్యంతో పాటు విద్యార్థుల చదువులకు అవసరమైన పుస్తకాలు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఈగల్ టీం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. ఏపీ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ప్రదర్శించిన తాళపత్ర గ్రంథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం వేలాది మంది పుస్తక ప్రియులు తరలిరాడంతో పండుగ వాతావరణం నెలకొంది. యువత పెద్ద ఎత్తున పుస్తకాలను కొని తీసుకెళ్లారు.
ముక్కలైన స్వాతంత్య్రం: సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా ఉండే రచనలు పెరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పుస్తక మహోత్సవంలో భాగంగా బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆంగ్లంలో రచించి తెలుగులోకి అనువదించిన 'ముక్కలైన స్వాతంత్య్రం', 'మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం' పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. పుస్తక పఠనం ఆవశ్యకతను వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన రోజే దేశం ముక్కలైన రోజు కావడం విషాదకరమని రాంమాధవ్ విచారం వ్యక్తం చేశారు. ఆనాటి పరిణామాలు యువతకు తెలియజేయాలన్న ప్రధాని మోదీ కోరిక మేరకు తాను ఈ రచనలు చేసినట్లు తెలిపారు. మతానికి భాషతో సంబంధం లేదని ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అభిప్రాయపడ్డారు. పుస్తక మహోత్సవంలో భాగంగా ఉర్దూ పుస్తక ప్రదర్శన స్టాల్ను ఆయన ప్రారంభించారు. పుస్తక మహోత్సవానికి విశేష స్పందన వస్తోందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలను కొని చదవాలని కోరారు.
సభలు, సమావేశాలకు వెళ్లినప్పుడు శాలువాలు, పుష్పగుచ్ఛాలు, పూల మాలలు ఇస్తున్నారు. వీటివల్ల ప్రయోజనం లేదు. పుస్తక మహోత్సవంలో పుస్తకాలు ఇవ్వడం బాగుంది. ఇదే సంప్రదాయం అన్ని సభల్లోనూ రావాలి. వంద ఊర్లు తిరిగినా తెలుసుకోలేని విషయాలు ఒక్క పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. అందుకే పుస్తకం హస్తభూషణం అంటారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు, సేవాలయాలు, దేవాలయాలు ఉండాలి. వీటి ఏర్పాటుకు సేవా సంఘాలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలి - వెంకయ్యనాయుడు ,మాజీ ఉపరాష్ట్రపతి
రాజ్యాంగ స్ఫూర్తిని గ్రహించండం ముఖ్యం: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజాస్వామ్య జీవన విధానానికి పునాది లాంటిదని దాన్ని పట్టుకుని తిరిగినా పూజించినా ఫలితం లేదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గ్రహించి ఆచరించినప్పుడే ఫలితం దక్కుతుందన్నారు. ప్రజలు తమ హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకుని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఎవరి పని వారు సవ్యంగా చేయడమే నిజమైన దేశ భక్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుల్లో సత్యానికి దగ్గరగా సంచలనానికి దూరంగా ఉండి ప్రజలకు జ్ఞానాన్ని అందించే పుస్తకాలు చాలా తక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.కానీ ముక్కలైన స్వాతంత్య్రం, మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం పుస్తకాల్లో మంచి సుగుణాలు కనిపించాయన్నారు.
అందుకే నేను రాజకీయాల వైపు చూశాను;వెంకయ్యనాయుడు: రాంమాధవ్ దేశ విభజన ముందు జరిగిన పరిణామాలు, మత మార్పిళ్లు, జిన్నా ప్రవర్తనలో మార్పులు, ముస్లిం లీగ్ ఏర్పాటు, మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చడం, వంటి అనేక అంశాలను కూలంకషంగా వివరించడం బాగుందని వెంకయ్యనాయుడు తెలిపారు. మత ప్రాతిపదికన దేశం విడిపోయినా ఎందరో ముస్లింలు దేశంలోనే ఉన్నారని వారంతా నా దృష్టిలో జాతీయవాదులేనని ఉద్ఘాటించారు. ముక్కలైన స్వాతంత్య్రం, మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం పుస్తకాలను అందరూ చదవాలని వెంకయ్య నాయుడు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ రూపంలో ప్రజలను ఇబ్బంది పెట్టిందని, ఆ పరిణామం నా జీవితాన్నే మార్చిందని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న తనను 18 నెలలు జైల్లో పెట్టారన్నారు. దీంతో తాను రాజకీయాల వైపు చూశానని చెప్పారు. దేశంలోనే రెండో అత్యున్నత పదవిని నిర్వర్తించినప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
పండగ వేళ పశ్చిమ బైపాస్ ఎక్కేస్తున్నారా? - జాగ్రత్త! ప్రమాదాలు జరగొచ్చు
సిరులు కురిపిస్తున్న 'వట్టివేరు' సాగు - లీటరు నూనె రూ.28 వేలు

