పాలు కల్తీ చేస్తే మరణ శిక్ష - ఫుడ్ సేఫ్టీ అధికారుల హెచ్చరికలు
విజయవాడలో పాల బూత్లపై ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్థక అధికారులు దాడులు - 6 పాల బూత్ల నుంచి పాల శాంపిల్స్ సేకరణ - లేబరేటరీ నుంచి మూడు రోజుల్లో రానున్న రిజల్డ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 1:56 PM IST
Food Safety Officials Raid Milk Booths in Vijayawada : రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పలు ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్థక అధికారులు దాడులు నిర్వహించారు. పాల బూత్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. పాలు కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, మరణ శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందని అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చారు.
విజయవాడలోని పాల బూత్లపై ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్థక అధికారులు దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్థక అధికారులు మాట్లాడారు. విజయవాడలోని 6 పాల బూత్లపై తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. 6 పాల బూత్ల నుంచి పాల శాంపిల్స్ సేకరించామన్నారు. లేబరేటరీ నుంచి మూడు రోజుల్లో రిజల్ట్ వస్తుందని తెలిపారు. పాలు కల్తీ చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్లాస్టిక్ కానీ, అల్యూమినియం డబ్బాల్లో కానీ పాలను నిల్వ చేయవద్దు. కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను నిల్వ చేయాలని అధికారులు సూచించారు.
అయితే ఫుడ్ సేఫ్టీ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. నిరంతరం దాడులు నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాలలో కల్తీ చేస్తే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. పాల కల్తీ మామూలు నేరం కాదు మర్డర్ చేసిన నేరం కన్నా పెద్ద నేరంగా పరిగణించబడుతుందన్నారు. కృష్ణలంక సెంటర్, వన్ టౌన్, పంట కాలవ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదంపాడు ప్రాంతాలలో లూజ్ మిల్క్ అమ్మే వారిపై దాడులు నిర్వహించామని అధికారులు వెల్లడించారు.
"ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఫుడ్ సేఫ్టీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ పాల విక్రయ కేంద్రాల్లో దాడులు నిర్వహిస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి వివిధ సెంటర్లో తనిఖీ చేశాం. శాంపిళ్ల సేకరించి, టెస్ట్ల కోసం ల్యాబ్ పంపిస్తాం. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా ఫుడ్ సేఫ్టీ అధికారులకు గానీ పోలీసులకు సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటాం." - ఫుడ్ సేఫ్టీ అధికారులు
అయోడిన్ వేస్తే పాలు నీలిరంగులోకి : పాలు చాలా చిక్కగా ఉండటానికి పిండి పదార్థాలు కలుపుతారన్నారు. పిండి పదార్థాలు కలిపారని అనుమానం వస్తే పాలలో అయోడిన్ వేస్తే పాలు మొత్తం కూడా నీలిరంగులోకి మారుతాయని తెలిపారు. పాలు చేతుల మధ్య నలిపితే ఉంటే పిండి బయట పడే అవకాశం ఉంటుందన్నారు.
పాలు చిక్కదనం, వెన్నశాతం అధికంగా చూపించడం కోసం వెజిటేబుల్ ఆయిల్స్ కూడా కలుపుతారన్నారు. వెజిటేబుల్స్ ఆయిల్ కలిపితే పాలు చాలా జిడ్డుగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. పాలు టెస్ట్ చేసినప్పుడు ఏదైనా చేదు కనుక అనిపిస్తే ఖచ్చితంగా దాంట్లో వెజిటేబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నట్లుగా భావించాలని అధికారులు తెలిపారు.
వారం రోజులుగా ఫ్రీజర్లో 'మాంసాహారం' - అధికారుల తనిఖీల్లో భారీగా నాన్వెజ్ సీజ్
ప్రసాదం నుంచి పాలు, పప్పులు అన్నీ కల్తీయే - పట్టుబడితే విధించే శిక్షలు ఏంటో తెలుసా?

