చిన్నపాటి నిర్లక్ష్యమే నిప్పురవ్వై - శ్మశానంలా మారిన సూర్యశ్రీ ఫైర్వర్క్స్ ప్రాంగణం
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 20 మంది సజీవ దహనం- మరో 10 మందికి తీవ్ర గాయాలు - కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పెను విషాదం-పేలుడు ధాటికి చెల్లాచెదురైన శరీర భాగాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 8:05 AM IST
|Updated : March 1, 2026 at 2:28 PM IST
Firecracker Manufacturing Unit Explosion Reasons in Kakinada District : భూకంపం వచ్చిందా అనేంత కుదుపులు. రెండు గంటల పాటు ఢమఢమలాడే భీకర శబ్దాలు. దట్టంగా కమ్ముకున్న పొగలు. తునాతునకలై ఎగిపడ్డ శరీరభాగాలు. ఏ అవయవం ఎవరిదో గుర్తించలేని పరిస్థితులు. ఇదీ కాకినాడ జిల్లా వేట్లపాలెం విస్ఫోటం మిగిల్చిన పెను విషాదం. వెలుగులు పంచే బాణసంచా 20 మంది బతుకుల్ని అధకారం చేసింది. మరో పది మందిని గాయపరిచింది. చిన్నపాటి నిర్లక్ష్యమే నిప్పురవ్వై ఇంతటి ఘెరానికి దారితీసింది.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం సమయం శనివారం మధ్యాహ్నం రెండు గంటలు ఉన్నట్టుంది పెను విస్పోటం సంభవించింది. దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించింది. ఒక్కసారిగా భీతిల్లిన ప్రజలు, తేరుకుని చూస్తే, సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో ఢమఢమా అంటూ శబ్దాలు. దాదాపు రెండు గంటలపాటు క్రాకర్స్ పేలుతూనే ఉన్నాయి. వాటితో పాటే మాంసపుముద్దలూ ఎటుకటే ఎగిరిపడ్డాయి. పచ్చని పొలాల మధ్య ఉండే సూర్యశ్రీ ఫైర్వర్క్స్ ప్రాంగణం పేలుళ్లు ఆగాక శ్మశానంలా మారింది. బాణసంచా తయారీ కేంద్రం నేలమట్టమైంది.
కార్మికులు బయటకు రాలేక కాలిపోయారు: వేట్లపాలెంలో కొన్నేళ్లుగా సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పేరిట బాణాసంచా తయారీ సాగుతోంది. రోజూలాగే కార్మికులు టపాసులు తయారీలో నిమగ్నం అయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద మొత్తంలో టపాసులు నిల్వ ఉండడంతో విస్ఫోటం ఆగలేదు. కార్మికులు బయటకు రాలేక కాలిపోయారు. 10 మంది పురుషులు, 10 మంది స్త్రీలు సజీవ దహనం అయ్యారు. కొందరివి కాళ్లుంటే చేతులు లేవు, చేతులుంటే కాళ్లు లేవు. కొన్ని శరీరభాగాలే మిగిలాయి. పెను విస్ఫోటం నుంచి 10 మంది గాయాలతో బయటపడ్డారు.
పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు పంటకాల్వల్లో చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఓ మహిళ పుర్రె పేలిపోయింది. ఇంకొకరు శవమై 50 మీటర్ల దూరంలోని పంట కాల్వలో పడ్డారు. మాంసపుముద్దల్లా మిగిలిన మృతుల శరీర భాగాలు, ఒక్క చోటకు చేర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. పేలుళ్ల ధాటికి వేట్లపాలెం సమీపంలోని జొన్నలదొడ్డిలో పెంకుటిల్లు పైకప్పు ధ్వంసమైంది. కొన్ని ఇళ్లలో ఫాల్ సీలింగ్ కూడా ఊడిపడ్డాయి. పలు నివాసాల్లో అద్దాలు, తలుపులు పగిలిపోయాయి.
తప్పుడు విధానంలో సల్ఫర్ వినియోగించడం: చిన్నసాటి నిర్లక్ష్యం వేట్లపాలెంలో భారీ ప్రమాద ఘటనకు కారణమైనట్లు తెలుస్తోంది. చిచ్చుబుడ్డీల్లో మందును దట్టించిన క్రమంలో ఇనుప దిమ్మతో మోదడంతో నిప్పు రవ్వలు రేగి పక్కనున్న బాణసంచా ముడిసరుకులో పడింది. క్షణాల్లో మంటలు వ్యాపించడం, అక్కడే భారీగా నిల్వలున్న బాంబులన్నీ ఒక్కసారి పేలడంతో భారీ విస్పోటం సంభవించింది. సల్ఫర్ తప్పుడు విధానంలో వినియోగించడం కూడా ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.
తయారీ కేంద్రంలో షెడ్లు ఇరుకుగా ఉండటం ఇద్దరు ముగ్గురు పనిచేసే చోట పది మంది కూర్చొని తయారు చేయడం మంటలు చెలరేగి పేలుళ్లు జరిగినప్పుడు ఆ షెడ్ల నుంచి బయటకు రాలేక అక్కడే సజీవ దహనమైపోయారు. పేలుడు తీవ్రత కారణంగానే శరీరాలు చిద్రమైపోయాయని పోలీసులు చెబుతున్నారు. బాణసంచాలో సల్ఫర్ తప్పుడు విధానంలో ఉపయోగించడంతో పేలుడు చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ రసాయనాలు, మందుగుండు సామగ్రి నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు తీసుకువెళ్లారని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాతనే పేలుడుకు కారణాలు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశం ఉంది.
వేట్లపాలెంలో ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యజమాని అడబాల అర్జున్, సోదరుడు వీరబాబు అలియాస్ నాని పరారీలో ఉండగా, వీరి తండ్రి అడబాల శ్రీనివాసరావు (55) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగతా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి అప్పగించే ప్రక్రియ శనివారం రాత్రి ప్రారంభించారు. శ్రీనివాసరావు మృతదేహం తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులెవరూ రాలేదు. ఆ సంస్థ యజమానులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు - 21కి చేరిన మృతుల సంఖ్య
కాకినాడ పేలుడు ఘటన - మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం: సీఎం చంద్రబాబు

