భావి తరాలకు బంగారు భవిష్యత్తు - పాఠశాల విద్యకు బడ్జెట్లో రూ.32,308 కోట్లు కేటాయింపు
పాఠశాల విద్య, ఉన్నత విద్యకు బడ్జెట్లో 11శాతం నిధులు కేటాయింపు - పాఠశాలల మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధికి రూ.1,500 కోట్లు - ఉన్నత విద్యాశాఖకు రూ.2,567 కోట్లు కేటాయింపులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 3:57 PM IST
School Education Budget 2026 : బడ్జెట్లో రాష్ట్రభవిష్యత్కు మార్గం వేసిన ఆర్ధికమంత్రి భావితరాల భవిష్యత్ నిర్మాణమే లక్ష్యంగా పాఠశాల విద్యకు భారీ ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీపడే నైపుణ్యాలతో సిద్ధమయ్యేలా పాఠశాల విద్యాశాఖకు 32వేల 308 కోట్ల రూపాయలు కేటాయించారు.
విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు : ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. నెల్సన్ మండేలా చెప్పిన ఈ మాటలే స్ఫూర్తిగా పాఠశాల విద్య, ఉన్నత విద్యకు బడ్జెట్లో 11శాతం నిధులు కేటాయించారు. వైఎస్సార్సీపీ పాలనలో విద్యా వ్యవస్థ వెనుకబాటుకు గురైందని సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.
తొందరపాటు నిర్ణయంతో వేయి పాఠశాలల్ని CBSE విధానానికి మార్చడం వల్ల సుమారు 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారని చెప్పారు. అమలు సాధ్యాసాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా ప్రతిపాదించిన ఐబీ పాఠ్య ప్రణాళిక వల్ల ప్రజాధనం వృథా అయిందన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో పరిపాలనా వైఫల్యం కారణంగా 7వేల 876కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. జూన్ 2024 నుంచి కూటమి ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర సంస్కరణలను ప్రారంభించిందని కేశవ్ తెలిపారు.
విద్యను పరిపాలనా బాధ్యతగా కాకుండా, నైతిక కట్టుబాటుగా పరిగణిస్తూ కేటాయింపులు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్ చెప్పారు. పాఠశాల విద్యకు 32వేల 308 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ లక్ష్యసాధన దిశగా దృష్టి సారిస్తోందని పయ్యావుల కేశవ్ ప్రశంసించారు.
పాఠశాల విద్యలో కేటాయింపులు ఇలా :
- తల్లికి వందనం- రూ.9,668 కోట్లు
- ఉపకారవేతనాలు- రూ.3,836 కోట్లు
- సమగ్ర శిక్ష అభియాన్- రూ.2,946 కోట్లు
- ఉన్నత విద్య- రూ.2,566 కోట్లు
- మధ్యాహ్న భోజన పథకం- రూ.2,161 కోట్లు
- మన బడి మన భవిష్యత్తు- రూ.1,500 కోట్లు
- స్కిల్ డెవలప్మెంట్- రూ.1,232 కోట్లు
బడ్జెట్లో కేటాయింపులు ఇలా :
- పాఠశాల విద్య రూ.32308 కోట్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రూ.27719 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.23650 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.22941 కోట్లు
- వైద్యారోగ్యం రూ.19306 కోట్లు
- నీటివనరులు రూ.18224 కోట్లు
- పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ రూ.14539 కోట్లు
- ఇంధన రంగం రూ.13934 కోట్లు
- రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు రూ.13546 కోట్లు
- వ్యవసాయ రంగం రూ.11745 కోట్లు
- సాంఘిక సంక్షేమం రూ.11118 కోట్లు
- ఈడబ్ల్యుఎస్ సంక్షేమం రూ.10699కోట్లు
- తల్లికి వందనం రూ.9668 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులు రూ.9906 కోట్లు
- అన్నదాత సుఖీభవ రూ.6600 కోట్లు
- పోలవరం ప్రాజెక్టు రూ.6105 కోట్లు
- అమరావతి రూ.6000 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమం రూ.4582 కోట్లు
- వీబీజీ రామ్జీ రూ.8365 కోట్లు
- గృహనిర్మాణం రూ.5451 కోట్లు
- ఎన్టీఆర్ వైద్య సేవ రూ.4000 కోట్లు
- జల్జీవన్ మిషన్ రూ.4000 కోట్లు
- ఉపకార వేతనాలు రూ.3836 కోట్లు
- ఉన్నత విద్య రూ.2566 కోట్లు
- మధ్యాహ్న భోజన పథకం రూ.2161 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి రూ.1232 కోట్లు
- దీపం 2.O రూ.2601 కోట్లు
- స్త్రీశక్తి రూ.1420 కోట్లు
- స్వచ్ఛభారత్ మిషన్ రూ.1037 కోట్లు
- ఆయుష్మాన్ భారత్ రూ.838 కోట్లు
- ఆటోడ్రైవర్లకు సాయం రూ.450 కోట్లు
రూ.9.74 లక్షల కోట్లు అప్పు : మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్లు అప్పుగా మిగిల్చి వెళ్లిందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కూటమి సర్కారు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాము అప్పుగా తెచ్చిన ప్రతి రూపాయీ ఉత్పాదకత వ్యయంలోకి వెళ్తుందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడితే సమర్థ పాలన విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేశవ్ వెల్లడించారు.
రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ - ఏఏ శాఖకు ఏంతెంత కేటాయించారంటే?
వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న - ఎంత కేటాయించారంటే!

