రూ.8 కోట్ల విలువైన భూమికి రూ.90 లక్షలేనా! - చేర్యాల నిర్వాసితుల ఆవేదన
70 ఏళ్లుగా అసైన్డ్ భూములు సాగుచేస్తున్న చేర్యాల రైతులు - పరిశ్రమల స్థాపనకు భూములను టీజీఐఐసీకి కేటాయించిన ప్రభుత్వం - బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధర ఇస్తున్నారని రైతుల ఆవేదన

Published : February 27, 2026 at 9:48 AM IST
|Updated : February 27, 2026 at 10:52 AM IST
Assigned Lands issue in Sangareddy : సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో 741 సర్వే నంబర్ భూములను 70 ఏళ్ల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ సర్వే నంబరులోని 121 ఎకరాలను పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించింది. ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం సరిపోదని, బహిరంగ మార్కెట్ విలువకు అనుగుణంగా భూముల ధరను నిర్ణయించడంతో పాటు కుటుంబానికో ఉద్యోగం, ప్లాట్ కేటాయించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
తగిన పరిహారం చెల్లించండి : సంగారెడ్డి జిల్లా చేర్యాలలో 70 ఏళ్ల కిందట ఇందిరమ్మ ప్రభుత్వం సాగుచేసుకుని జీవించేందుకు ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేసింది. అప్పటి నుంచి గ్రామంలోని దళితులు, గిరిజనులు, నిరుపేదలు వీటిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. బోర్లు పడిన చోట రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పారిశ్రామీకరణ, పెరిగిన భూమి విలువ దృష్ట్యా ప్రభుత్వం భూములను టీజీఐఐసీకి కేటాయించింది. ఏళ్లుగా భూమినే నమ్ముకున్న తమను ఉన్నఫలంగా ఎంతో కొంత పరిహారం ఇచ్చి వెళ్లమనడం సరికాదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్లు పలుకుతున్న భూములకు రూ.90 లక్షలు ఇచ్చి చేతులు దులుపేసుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎకరాకు రూ.రెండున్నర కోట్లు చెల్లించాలని నిర్వాసిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
"70 ఏళ్లుగా ఈ భూమి మా సాగులో ఉంది. అది తప్పితే మాకు పాస్బుక్లు కూడా వేరేవి లేవు. ఇప్పుడు వాళ్లు (అధికారులు) వచ్చి ఎంతో కొంత ఇచ్చి భూములను తీసుకుంటామని చెబుతున్నారు. 741 సర్వేనంబర్లో మా రైతులందరికీ 120 ఎకరాల భూమి ఉంది. ఒక్కో రైతుకు ఉద్యోగం, 250 ప్లాటు గజాలు, రూ.2 కోట్ల 50 లక్షలు ఇస్తామంటేనే భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మా డిమాండ్. లేకుంటే మేం ఇవ్వలేం. ఈ భూములు తీసుకోవడానికి సర్వేలో తక్కువగా చూపిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేమంతా పేదవాళ్లం. మేం బతికేందుకు ఉన్న ఏకైక ఆధారం అది ఒక్కటే. మీరు ఒప్పుకుంటేనే ఈ భూములు అప్పగిస్తాం. లేకుంటే లేదని పై అధికారులు చెప్పారు"- రైతులు
భూ సర్వేలపై రైతుల అనుమానం : అధికారులు చేసిన భూ సర్వేలపైనా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూమిని తక్కువగా చేసి చూపించారని ఆరోపిస్తున్నారు. పైగా తుది నోటిఫికేషన్ జారీ చేసి, రైతుల వారీగా జాబితా ప్రకటించినప్పటికీ ఇది అందుబాటులో లేదంటున్నారు. రైతులు అంగీకరిస్తేనే భూములు సేకరిస్తామని, నిబంధనలకు అనుగుణంగానే సర్వే చేపట్టామని కంది తహసీల్దార్ రవికూమార్ స్పష్టం చేశారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేస్తే రైతుల సమక్షంలో మళ్లీ సర్వే చేస్తామని తెలిపారు. ఏళ్లుగా సాగుచేస్తున్న ఈ భూములే తమ జీవనాధారమని, బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా ధరను కేటాయించాలని రైతులు కోరుతున్నారు.
"741 సర్వే నంబర్లో 121 ఎకరాల 16 గుంటలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రామసభ పెట్టి గ్రామస్థులతో ఈ విషయంపై చర్చించడం జరిగింది. వాళ్లు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఎకరానికి రూ.2 కోట్ల వరకు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించడం జరగుతుందని తెలిపాము. ఇంతవరకు మా వద్దకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీనికి కూడా వారు అంగీకరించడం జరిగింది. ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరిస్తాం"- రవికుమార్, కంది తహసీల్దార్
650 ఇళ్ల కూల్చివేత - 2 వేల కుటుంబాలు రోడ్డు పాలు : భూదాన్ భూముల్లో ఎవరిని కదిపినా కన్నీళ్లే
ఐడీపీఎల్ భూముల వ్యవహారం - వారు ఇవ్వలేదు, టీజీఐఐసీ తీసుకోలేదు

