అమరావతి రైతుల స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం - వారి పిల్లలకే మొదట ప్రాధాన్యం
అమరావతిలో రైతులు, కూలీల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు - నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యం - రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీల పిల్లలకే మొదట ప్రాధాన్యం

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 7:00 PM IST
Farmer School In Amaravati : మీకు తెలుసా? అమరావతిలో రైతులు, కూలీల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. అందుకు కావాల్సిన ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు ఆ స్కూల్ కార్యదర్శి తెలిపారు. వ్యవసాయం చేసే వారి పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా పాఠశాలలు ఉంటాయని అనుకుంటున్నారా? తెలుసుకుందాం.
అమరావతి రైతుల ఆధ్వర్యంలో నిర్వహించే డీఏవీ పాఠశాలలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని కార్యదర్శి బాలమురళీకృష్ణ చెప్పారు. ఈ పాఠశాలలో రాజధానిలోని అన్ని గ్రామాల రైతులు రైతు కూలీల పిల్లలకు మొదట ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. తుళ్లూరులో ఏర్పాటు చేయబోయే ఈ పాఠశాలలోని వసతులపై 29 గ్రామాల్లోని ఐకాస నాయకులకు వెల్లడించారు.
మొదటి ప్రాధాన్యత రైతుల పిల్లలకే : ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు నిర్వహించే పాఠశాలలో ముందు రాజధాని రైతుల పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తామని ఆ తర్వాత సీట్లు మిగిలితే ఇతరులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. డీఏవీ పాఠశాల ఆధ్వర్యంలో నెక్కల్లులో 3 ఎకరాలలో నూతన భవనాలు నిర్మిస్తున్నామని అప్పటివరకు తుళ్లూరులో తాత్కాలికంగా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
ఇప్పుడు కార్యరూపం దాల్చింది : 2018లోనే పాఠశాల ఏర్పాటుపై తమిళనాడులోని దయానంద్ ఆంగ్లో వేదిక్ డీఏవీ పాఠశాలతో చర్చలు జరిపామని అది ఇప్పుడు కార్యరూపం దాల్చిందని స్పష్టం చేశారు. చెన్నైలో గత 50 ఏళ్లుగా ఆత్యాధునిక విద్యా విధానాలను ఆవిలంబిస్తున్నామని ఇప్పుడు రాజధానికి రావడం సంతోషంగా ఉందని డిఏవి పాఠశాల ప్రతినిధి నందగోపాలు తెలిపారు.
"రైతులు, రైతు కూలీల పిల్లల కోసం మంచి విద్యను అందుబాటులో ఉన్న ఫీజులతో అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ప్రారంభించారు. ఈ సంవత్సరం స్కూల్ ఫీజులు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి రూ.30,000 ప్రైమైరీ తరగతులలో ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు రూ.35,000, 4, 5 తరగతులకు రూ.40,000 వరకు నిర్ణయించడం జరిగింది. ఏ అంతర్జాతీయ స్కూల్లు ఇంత తక్కువ ఫీజుతో పాఠశాలలను నడపలేవు." - బాలమురళీకృష్ణ, అమరావతి ఎడ్యుకేషన్ కల్చరల్ అకాడమీ కార్యదర్శి
నాణ్యమైన విద్య : అమరావతిలో రైతులు, రైతు కూలీల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ స్కూల్ రూ.20 కోట్ల ప్రాజెక్టని కార్యదర్శి అన్నారు. దీనికోసం రైతులు చందాలు వేసుకొని కట్టడానికి సిద్ధమయ్యామని చెప్పారు. ఇప్పటికే రూ.10 కోట్ల వరకు చందాలు వచ్చాయని, మరో రూ.10 కోట్లతో కంట్రక్షన్ జరుగుతుందని అన్నారు. పాఠశాలను కట్టి ఏవీ వారికి అప్పగిస్తామని, నాణ్యతతో కూడిన విద్యను పిల్లలకు అందిస్తారని ఆయన చెప్పారు. అందులో ఎలాంటి రాజీ ఉండదనని అన్నారు. ఈ స్కూల్లో ఎక్కువగా రైతుల పిల్లలకే ప్రాధాన్యత ఉంటుందనని ఆయన తెలిపారు.
ట్విన్స్ డే స్పెషల్ - మాంటిస్సోరి స్కూల్లో 32 మంది కవలలు
చూపు లేకపోయినా పాఠాలూ చెప్పగలదు - ఆత్మవిశ్వాసానికి మారుపేరు సూర్యకాంతం

