నకిలీ మద్యం కేసులో మరో కీలక కోణం - జోగి సోదరులకు అద్దేపల్లి బ్రదర్స్ ముడుపులు
జోగి సోదరులు, అద్దేపల్లి బ్రదర్స్ ఆర్థిక బంధం బట్టబయలు - జోగి సోదరులకు ముడుపులిచ్చినట్లు అంగీకరించిన జనార్దనరావు

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 23, 2025 at 12:10 PM IST
Fake Liquor Case Financial Links Between Jogi and Addepalli Brothers : నకిలీ మద్యం కేసులో మరో కీలక కోణం వెలుగుచూసింది. జోగి సోదరులతో అద్దేపల్లి బ్రదర్స్కు ఉన్న ఆర్థిక బంధం బట్టబయలైంది. వ్యాపారానికి ఇబ్బందుల్లేకుండా చూసుకునేందుకు జోగి బ్రదర్స్కు ముడుపులిచ్చినట్లు జనార్దనరావు విచారణలో అంగీకరించారు. జనార్దనరావు, జోగి రమేష్ సోదరుడు రాము మధ్య పెద్దఎత్తున ఫోన్ కాల్స్ను అధికారులు గుర్తించారు.
నకిలీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడు జనార్దనరావు, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్, అతని సోదరుడి మధ్య బంధంపై ఆధారాలు బయటకు వస్తున్నాయి. తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును డ్రా చేసి అందజేసినట్లు జనార్దనరావు కస్టడీలో అంగీకరించాడు. గత నాలుగేళ్లలో పలుమార్లు జనార్దనరావు, జగన్మోహన్రావుల ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో విత్ డ్రాయల్స్ ఉన్నాయి.
వీటిని సీసాలు, స్పిరిట్, మూతలు, లేబుల్స్ సరఫరాదారులతో పాటు జోగి సోదరులకు కూడా ముడుపుల రూపంలో అందజేసినట్లు విచారణలో వెల్లడించారు. అద్దేపల్లి సోదరుల నాలుగు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. వీరికి సాయంత్రం ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి, ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జనార్దనరావును నెల్లూరు కారాగారానికి, జగన్మోహన్రావును విజయవాడ జైలుకు తరలించారు.
నగదు రూపంలో ముడుపుల అందజేత : 2021 నుంచి 2025 వరకు అద్దేపల్లి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లను సిట్, ఎక్సైజ్ అధికారులు వడపోశారు. నగదు విత్డ్రాయల్స్ వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఏ అవసరాలకు నగదు తీశారనేది ప్రశ్నించారు. అక్రమ మద్యం, నకిలీ మద్యం వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకే తరచూ జోగి సోదరులకు ముడుపులను నగదు రూపంలో అందజేసినట్లు వారు ఒప్పుకొన్నారు.
జోగి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులు పలు అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. జోగి రమేష్ సోదరుడు రాముతో జనార్దనరావు తరచూ ఫోన్లో మాట్లాడినట్లు సీడీఆర్ విశ్లేషణలో బయటపడింది. ఇద్దరి కాల్డేటాను పరిశీలిస్తే పెద్ద సంఖ్యలో కాల్స్ కనిపించాయి. దీన్నిబట్టి నకిలీ మద్యం తయారీ కుట్రలో వైఎస్సార్సీపీ నేత ప్రమేయం ఉందని సిట్ భావిస్తోంది. సెప్టెంబరు ముందువరకు పలు దఫాలు రెగ్యులర్ కాల్స్లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు.
ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబరు 23న జోగి రమేష్ ఇంటికి వెళ్లానని జనార్దనరావు తన నేరాంగీకార స్టేట్మెంట్లో వెల్లడించారు. నిందితుడు చెప్పిన సమయానికి సీసీ కెమెరాల్లోని దృశ్యాలతో సరిపోలాయి. జనార్దనరావు, జోగి రమేష్, రాములు ఒకే లొకేషన్ పరిధిలో ఉన్నట్లు తేలింది. జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల డీవీఆర్ను ఆయన అరెస్టు సమయంలో స్వాధీనం చేసుకున్నారు. దీని పాస్వర్డ్ను చెప్పకపోవడంతో తెరవలేకపోయారు. జోగి సోదరులను కస్టడీకి తీసుకున్నప్పుడు తెరవాలని భావిస్తున్నారు.
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి
మద్యం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు - జోగి-అద్దేపల్లిల ఆర్థిక బంధంపై సిట్ దృష్టి

