విద్యార్థులను ప్రోత్సహిస్తూ పోటీ పడుతున్న సైన్స్ టీచర్ - రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు
రైతుల ఇబ్బందుల దృష్ట్యా పరికరాన్ని తయారుచేసిన సోమేశ్వరరావు - విద్యుత్తు అవసరం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో పని - అనేక సార్లు రాష్ట్రస్థాయికి ఎంపిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 5:00 PM IST
Encouraging And Competing Science Teacher : విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు తాను కూడా పోటీపడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పురస్కారాలు అందుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఓ ఉపాధ్యాయుడు. నిజమైన ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాలకు అతీతంగా అన్ని విషయాలను బోధిస్తాడని నిరూపిస్తున్నారు ఈ ఉపాధ్యాయుడు. అసలు ఎవరు ఆ ఉపాధ్యాయుడు? అందరి మన్ననలు ఎందుకు పొందుకుంటున్నారో తెలుసుకుందాం.
కృష్ణా జిల్లా బందరు మండలం గుండుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడు బొమ్మిడి సోమేశ్వరరావు విధ్యార్థులకు పోటీగా తాజాగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సైన్సు ప్రయోగ ప్రదర్శనల్లో ఉపాధ్యాయ విభాగంలో పాల్గొన్నారు. ఆయన తీర్చిదిద్దిన నమూనా దక్షిణ భారతదేశ పోటీలకు అర్హత సాధించింది. ఆయన ఆవిష్కరణ తక్కువ ఖర్చుతో ఉండడంతో ఇది రైతులు, నిర్మాణ కార్మికులకు ఆచరణాత్మకంగా ఎంతో ఉపయోగం కలిగిస్తుంది. దాని కారణంగా ఆయన తీర్చిదిద్దిన నమూనా అందరి దృష్టిని ఆకర్షించింది.
విద్యుత్తు అవసరం లేకుండా : రైతులు ధాన్యాన్ని జల్లెడ పట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటారు, ముఖ్యంగా కూలీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కొరత కూడా రైతులు ఇబ్బందికి కారణమని సోమేశ్వరరావు గమనించారు. దానిని దృష్టిలో పెట్టుకొని సోమేశ్వరరావు పరికరాన్ని తీర్చిదిద్దారు. ఈ పరికరం విద్యుత్తు అవసరం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో జల్లెడ పట్టేస్తుందని సోమేశ్వరరావు తెలిపారు. బాల్ బేరింగ్స్ ఉపయోగించి సైకిల్కు జల్లెడను అమర్చారు. సైకిల్ తొక్కుతుంటే జల్లెడ ఆడుతుంది. తద్వారా ధాన్యం నుంచి మిగిలినవి వేరవుతాయి. ఒకవైపు ధాన్యం, తప్పలు, రాళ్లు తదితరాలు మరోవైపు వెళ్లిపోతాయి.
ఈ పరికరాన్ని ఈ పరికరాన్ని మినుములు వంటి ధాన్యాలను జల్లెడ పట్టడం వంటి వ్యవసాయ అవసరాలకే కాకుండా, నిర్మాణ పనులకు, ముఖ్యంగా ఇసుకను జల్లెడ పట్టేందుకు సైతం ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. నాలుగు టన్నుల ఇసుక జల్లించాలంటే ప్రస్తుతం దాదాపు రూ.4వేలు ఖర్చువుతుంది. అదే సోమేశ్వరరావు తయారు చేసిన సైకిల్ ద్వారా అయితే ఇద్దరు వ్యక్తులు ఆరు గంటలు పనిచేస్తే చాలు.
అనేక సార్లు రాష్ట్రస్థాయికి : సోమేశ్వరరావు గూడూరు మండలం మల్లవోలులో 2005లో ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడే 2015 వరకు పనిచేశారు. 2006లో తాను ప్రోత్సహించిన విద్యార్థులు ప్రయోగాల ప్రదర్శనలో కూడా రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు. అనంతరం 2008, 2009, 2011, 2015 సంవత్సరాల్లో సైతం ప్రయోగాల ప్రదర్శనలో మెరిశారు. 2015 నుంచి ప్రస్తుతం ఉన్న గుండుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు.
ఇక్కడికి వచ్చాక 2018లో రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు. విశేషమేంటంటే 2022-23 ఇన్స్పైర్మనక్ పోటీల్లో విద్యార్థుల ప్రయోగాలు కూడా జాతీయ స్థాయికి అర్హత సాధించాయి. తాజాగా ఆయన కూడా జాతీయ స్థాయికి అర్హత సాధించారు.దీనితో సహోద్యోగులను, విద్యార్థులను ఆశ్చర్యపరిచారు. అందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఔరా అని అభినందిస్తున్నారు కూడా. ఒక ఉపాధ్యాయుడు ముందుండి నడిపించడం ద్వారా, ఆవిష్కరణ, ప్రోత్సాహం అనేవి విద్యార్థులను ప్రభావితం చేస్తాయి, అంతేకాదు ఆయన జీవితం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని స్థానికులు, విద్యాధికారులు తెలిపారు.
అన్నదాతలకు అండగా సర్కార్ - సాగుకు అద్దె పరికరాలు
దెబ్బతిన్న రేటింగ్ను పెంచుకుంటే ఏపీ జెన్కోకు రూ.100 కోట్లు ఆదా!

