మీకోసం : 24లోపు ఎన్యూమరేషన్ పత్రం బీఎల్వోకు తిరిగి ఇవ్వకపోతే ఏమౌతుంది? - మనమేం చేయాలి?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సర్ సర్వే - ఈ నెల 24వ తేదీలోపు ఎన్యూమరేషన్ పత్రాలు అందివ్వకపోతే ఓటరు జాబితాలో పేర్లు గల్లంతే! - వెల్లడించిన ఈసీ కార్యాలయ శిక్షణ నోడల్ అధికారి చెన్నయ్య

Published : July 9, 2026 at 11:44 AM IST
|Updated : July 9, 2026 at 11:57 AM IST
EC Officials On Dead line to Fill Enumaration Form : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్ సర్వే కొనసాగుతోంది. ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 24వ తేదీలోపు నింపి బీఎల్వోలకు (బూత్ లెవల్ అధికారులు) అందించకపోతే ఓటర్ల జాబితాలో పేర్లు ఉండవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ శిక్షణ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వకపోయినట్లయితే ముసాయిదా జాబితా ప్రకటించిన ఈ నెల 31వ తేదీ తర్వాత ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈటీవీ-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో బుధవారం చెన్నయ్యతో ఫోన్-ఇన్ కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు తమ సందేహాలు వ్యక్తం చేయగా, చెన్నయ్య ఇలా సమాధానాలు ఇచ్చారు.
- ఎన్యూమరేషన్ ఫారం అందనట్లయితే ఎన్నికల సంఘం వెబ్సైట్, ఈసీఐనెట్ యాప్లో మీ పోలింగ్ బూత్కు సంబంధించిన బీఎల్వో నంబరుకు కాల్ చేస్తే ఎన్యూమరేషన్ పత్రం తీసుకొచ్చి ఇస్తారు. బీఎల్వోలు స్పందించనట్లయితే ఈఆర్వో నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు.
- ఎస్ఐఆర్-2002 సర్వేలో ఓటు ఉన్నవారు మొదటి బాక్సు కాలంలో నింపాల్సి ఉంటుంది. 2002లో ఓటు లేనివారు వారి తండ్రి, తల్లి, తాత, నాయనమ్మల్లో ఒకరిది ఎస్ఐఆర్-2002 వివరాలను రెండో బాక్సు కాలంలో నింపాల్సి ఉంటుంది. ఈ రెండు వివరాలూ తెలియని వారు మూడో బాక్సు కాలమ్ పూరించాలి.
- ఈ నెల 31వ తేదీ తర్వాత ముసాయిదా నోటిఫికేషన్ సమయంలో అడ్రస్ మార్పు కోసం ఫారం-8 నింపి, ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంత ఈఆర్వోకు సమర్పించవచ్చు.
- ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)-2002లో పాత జిల్లాలు, నియోజకవర్గాలే వస్తాయి. ఆ వివరాలే నింపాల్సి ఉంటుంది. రాష్ట్రం కాలంలో ఏపీ ఉంటుంది. పొరపాటున తెలంగాణ అని రాసినప్పటికీ ఇబ్బందేమీ లేదు.
- విదేశీ పౌరసత్వం ఉన్నట్లయితే ఇక్కడ ఎన్యూమరేషన్ పత్రం నింపొద్దు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు ఉంటే ఏదైనా ఒక ప్రాంతంలో మాత్రమే ఎంచుకోవావాల్సి ఉంటుంది. రెండుచోట్లా ఇచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు హెచ్చరించారు.
- ఎన్యూమరేషన్ పత్రాలతో కలిపి ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన పని లేదు. మీ పత్రంపై అనుమానాలున్నట్లయితే ఈఆర్వో నోటీసులు అందిస్తారు. ఆ సమయంలో అధికారులు అడిగిన డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది.
సర్ ప్రక్రియను ఆన్లైన్లో సులభంగా చేయండిలా :
ఈ సర్ ప్రక్రియను ఆన్లైన్లో ఏ విధంగా చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేయొచ్చు : ముందుగా గూగుల్లోకి వెళ్లి voters.eci.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలి. తొలిసారి వెబ్సైట్ను సందర్శిస్తున్నట్లయితే లాగిన్ కోసం అందులో సెల్ఫోన్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫోన్ నంబర్కు ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దాని ద్వారా పోర్టల్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.
- అనంతరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అనే పేరుతో ఫిల్ ఎన్యూమరేషన్ ఫారం అనే పేరుతో ఉన్న లింక్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంపిక చేస్తే కుడి వైపు మరో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఓటర్ కార్డు సంఖ్యను ఎంటర్ చేయాలి. తర్వాత మరో ఆప్షన్ తెరపైకి వస్తుంది. అందులో ఎంటరైన మొబైల్ నంబర్కు ఎంటర్ చేస్తే మరో ఓటీపీ వస్తుంది.
- తెలంగాణ రాష్ట్రంలో చివరగా 2002లో సమగ్ర ఓటరు జాబితాను(ఎస్ఆర్ఐ) తయారు చేశారు. ఆ సమయంలో ఉన్న కుటుంబీకులు తండ్రి లేదా తల్లి ఓటరు ఐడీ ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఓటరు గుర్తింపు నంబర్ తెలుసుకునేందుకు సైతం అక్కడ సెర్చ్ ఆప్షన్ను కల్పించారు. వారి 2002లోని ఓటరు కార్డు కావాలంటే వెళ్లి చూసుకోవచ్చు.
- ఒకవేళ నియోజకవర్గం మారినా, వేరే జిల్లాలో ఉన్నా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా ఈసీ అధికారులు కల్పించారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది.
- ఎన్యుమరేషన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్లు ఓ రిసీట్ జనరేట్ అవుతుంది. దాన్ని అధికారులు పరిశీలించి ఆమోదం తెలిపితే మీ సర్ ప్రక్రియ విజయవంతం అవుతుంది.
ప్రవాస భారతీయులకూ ప్రత్యేక ఆప్షన్ :
- ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ) కుడివైపున ఉన్న ఫర్ ఓవర్సీస్ ఓన్లీ అనే ప్రత్యేక ఆప్షన్ను కల్పించారు. ఆ ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకొని ఈ సర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఫోన్ నంబర్ ఓటర్ కార్డు లింక్ లేనన్నట్లయితే ఫాం-8 అప్లికేషన్ నంబర్ ద్వారా లింక్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత ప్రక్రియను కంప్లీట్ ఉంటుంది.
- ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి ఈసీఐఎన్ఈటీ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని కూడా ఈ ప్రక్రియను నిమిషాల వ్యవధిలో చూసేందుకు అవకాశం ఉంటుంది.
ఒకే ఫోన్ నంబర్పై ఏకంగా 700కు పైగా ఓటర్లు - విచారణకు ఆదేశాలు
ఎన్యూమరేషన్ ప్రక్రియలో బీఎల్వోల నిర్లక్ష్యం - వేటు తప్పదంటున్న అధికారులు

