ఇల్లు కడుతున్నారా? - ఇసుక, కంకర రోడ్డుపై వేస్తే రూ.5 లక్షల జరిమానా, ఏడాది జైలు శిక్ష
రోడ్లపై ఇసుక, ఇటుకలు, మట్టి వేయడంపై నిషేధం - నిర్మాణ వ్యర్థాలను జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా వేస్తే రూ.5 లక్షల జరిమానా, ఏడాది జైలు శిక్ష

Published : January 10, 2026 at 10:03 AM IST
Dumping Sand on Road is Prohibited : ఇళ్లు నిర్మించేందుకు ఆ దారి నిండా ఇటుక, ఇసుక, మట్టి వేయడం చూసే ఉంటారు. అలా రోడ్డుపై ఇసుక, మట్టి వంటివి ఉండటం వల్ల ఆ కాలనీవాసులు వచ్చి గొడవలు పడతారని ముందే ఆ ప్రాంత అధికారికి అంతోఇంతో ఇచ్చేసి జబర్దస్త్ చేయడం వంటివి చేస్తారు. ఇలా చేసి ఎవరైనా గట్టిగా అడిగితే బెదిరించడం ఇక కుదరదు. ఈ నేపథ్యంలో ఏకంగా జీహెచ్ఎంసీ చట్ట సవరణకు ప్రతిపాదనలు చేసింది. మరికొన్ని రోజుల్లో ఆదేశాలు కూడా రానున్నాయి.
ప్రభుత్వ కీలక నిర్ణయం : హైదరాబాద్లో రహదారి కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై ఇటుకలు, ఇసుక, మట్టి వంటి నిర్మాణ సామగ్రిని వేయడం, విక్రయించడంపై నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేసింది. నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించడం, ఉల్లంఘనులకు ఏడాది పాటు జైలు శిక్ష పడేట్టు జీహెచ్ఎంసీ చట్టంలో సవరణలు రాబోతున్నాయి.
ప్రతిపాదనలు ఇలా :
- జీహెచ్ఎంసీ చట్టంలోని ఆర్టికల్ 112(2), (3), (20), (25), ఆర్టికల్ 115(39) ప్రకారం జులై 15 2025న అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్లు, జీహెచ్ఎంసీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై మార్పులు చేర్పులపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
- చాలా మంది పాదచారులు, వాహనదారులు రహదారుల్లో, రద్దీ ప్రాంతాల్లో చెత్త పడేసేందుకు చిన్న డబ్బాలను ఏర్పాటు చేయడం, వ్యర్థాల నిల్వకు తాత్కాలిక ట్రాన్స్ఫర్ స్టేషన్లను అందుబాటులోకి తేవడం, చెత్త నిర్వహణ కేంద్రాలను పెంచనున్నారు.
- భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలను అనధికారికంగా తరలించడం, ఇష్టానుసారం డంపింగ్ చేయడంపై నిషేధం ఉంటుంది.
- ఇసుక, ఇటుకలు, కంకర, మట్టి, ఇతర నిర్మాణ సామగ్రిని రహదారులు, కాలిబాటలపై అమ్మడాన్ని నిషేధిస్తున్నారు.
- రెండు, అంతకు మించి తప్పిదాలకు పాల్పడితే రూ.5 లక్షల జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష ఉండేలా సవరణ చేస్తున్నారు.
- నిర్మాణ వ్యర్థాలను జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా తరలించే వాహనాలకు మొదటి తప్పుగా రూ.లక్ష జరిమానా. ఒకవేళ ఆ వ్యర్థాలను నాలాలు, రోడ్లు, చెరువులు, కాలిబాటలు, ప్రజలు తిరిగే చోట పడేస్తే రెట్టింపు జరిమానా విధిస్తారు.
- జీహెచ్ఎంసీ వెలుపల కూడా వ్యర్థాల నిర్వహణ సెంటర్ను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని కార్పొరేషన్కు కల్పిస్తారు.
- రెండు, అంతకు మించి తప్పిదాలకు పాల్పడితే రూ.5 లక్షల జరిమానా, సంవత్సరం పాటు వరకు జైలు శిక్ష ఉండేలా సవరణ చేస్తున్నారు.
- ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువుల విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ సెక్షన్ 487-ఏను కొత్తగా జీహెచ్ఎంసీ చట్టంలో చేర్చనున్నారు.
ఇసుక వల్ల రోడ్డుపై తీవ్ర ప్రమాదాలు : కొందరి నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారుతోంది. నిర్మాణాలకు అవసరమైన ఇసుకను వాడిన తర్వాత మిగిలిపోయినది అక్కడే రోడంతా పరచుకోగా, దానిపై నుంచి వెళ్తూ జారిపడి తీవ్ర గాయాలవుతున్నాయి. నగరంలో పలు చోట్ల రహదారుల పక్కన భవన, ఇతర నిర్మాణాలు చేపట్టడానికి యజమానులు వీటిని తీసుకొచ్చి నిర్మాణ స్థలాల పక్కన రహదారులపైనే నిల్వ చేసి వాడుకుంటున్నారు. ఆ ఇసుక వ్యర్థాలు గాలి వీచినప్పుడు రోడ్డుపైకి చేరుతోంది.
ఈ ఇసుక, సిమెంట్, కంకర తారు రహదారులపై విస్తరిస్తోంది. మరి కొందరు ఇసుకను ట్రాక్టర్లలో నిండా నింపుకొని రవాణా చేసే సమయంలో అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు, అలాగే వేగంగా గాలులు వచ్చినప్పుడు ఇసుక రహదారులపై జారి విస్తరిస్తోంది. రహదారులపై పరుచుకున్న ఇసుకపై నుంచి ద్విచక్రవాహనదారులు వెళ్తూ జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇసుక అక్రమ రవాణాలో యువత - వచ్చే డబ్బులతో చెడు అలవాట్లకు బానిస!
ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే ఇసుక కూపన్లు - ఆ ముసుగులో రూ.కోట్లు గడిస్తున్న అక్రమార్కులు

