భూ భారతి పోర్టల్లోకి చొరబడిన దొంగలు - రాత్రికి రాత్రే రూ.కోట్ల విలువైన భూముల మార్పిడి
గుట్టుగా పోర్టల్లోకి చొరబడి హక్కులు మార్చేసిన అక్రమార్కులు - అసైన్డ్, ప్రభుత్వ భూముల్లోనూ రిజిస్ట్రేషన్లు - ప్రభుత్వానికి అందిన ఫోరెన్సిక్ నివేదికలో కీలక అంశాలు - అక్రమాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం

Published : July 4, 2026 at 8:55 AM IST
|Updated : July 4, 2026 at 10:44 AM IST
Cybercrime On Dharani : ధరణి/ భూభారతిలోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఏకంగా పోర్టల్లోకి చొరబడ్డారు. గుట్టుగా భూముల హక్కులను మార్చేశారు. అసైన్డ్, ప్రభుత్వ భూముల్లోనూ రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వానికి అందిన ఫోరెన్సిక్ నివేదికలో కీలక అంశాలు ఉన్నాయి. అక్రమాలను తీవ్రంగా పరిణించిన ప్రభుత్వం, చర్యల కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఓ వ్యక్తి పేరుపైకి రాత్రికి రాత్రే రూ.కోట్ల విలువైన భూములు : హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉన్న ఓ జిల్లాలో ఓ వ్యక్తి పేరుపైకి రాత్రికి రాత్రే రూ.కోట్ల విలువైన కొన్ని ఎకరాల భూముల మార్పిడి జరిగింది. మరో జిల్లాలో రైతులు ప్రభుత్వానికి చెల్లించిన రిజిస్ట్రేషన్ల ఛార్జీ మొత్తాన్ని మధ్యలోనే కాజేశారు. ఇలాంటి అక్రమాలు సాగుభూముల పోర్టల్లో భారీగానే చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది జనవరిలో భువనగిరిలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
రెవెన్యూ, సైబర్ క్రైమ్స్, రిజిస్ట్రేషన్లు, ఎన్ఐసీ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల నిపుణులు రంగంలోకి దిగారు. లోతైన విచారణ తర్వాత సర్కారుకు నివేదిక అందజేశారు. అక్రమాలకు పాల్పడ్డ బాధ్యులపై ఎలా చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయడానికి జిల్లాల కలెక్టర్లు, ఐటీ కమ్యూనికేషన్స్, ఎన్ఐసీ, సైబర్ క్రైమ్ నిపుణులతో ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వానికి చెల్లించిన రిజిస్ట్రేషన్ల ఛార్జీలు స్వాహా : విలువైన భూములే లక్ష్యంగా పోర్టల్లో అక్రమాలకు తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆధారాలేవీ వెబ్సైట్లో చేర్చకుండానే కొన్ని భూముల యాజమాన్య హక్కులు మారినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూములకు సైతం రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. వివాదాల్లో ఉన్న భూములకూ యాజమాన్య హక్కులు సృష్టించారు. సర్వే నంబర్లు లేని భూములకు కొత్తవి సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అధికారికంగా దస్త్రాల బట్వాడా లేకుండానే పలు కంప్యూటర్లను వినియోగించినట్లు అనంతరం డిజిటల్ ఫుట్ప్రింట్స్ను గుర్తించకుండా అక్రమార్కులు జాగ్రత్త పడ్డట్లు భావిస్తున్నారు.
పలు మాడ్యూళ్లను వినియోగించి ఇలా హక్కుల మార్పిడి చేసినట్లు ఫోరెన్సిక్ విచారణలో నిపుణుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఎవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారనేది గుర్తించి, ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ప్రత్యేక బృందం ప్రభుత్వానికి నివేదించనుంది. అక్రమార్కులు వినియోగించిన టెక్నాలజీ, అక్రమాల బాధ్యులు, సహకరించింది ఎవరో కూడా గుర్తించనున్నారు.
ధరణి, భూ భారతిలోని సాంకేతిక లోపాలతో అక్రమాలు : ధరణి పోర్టల్ రూపకల్పన, నిర్వహణను 2020లో ఓ ప్రైవేటు సంస్థ చేపట్టింది. ఆ ఏడాది నవంబర్ రెండో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు-మ్యుటేషన్లు ప్రారంభమయ్యాయి. మీసేవా కేంద్రాల ద్వారా పోర్టల్లోని మాడ్యూళ్ల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు సేవలు అందేలా డిజైన్ చేశారు. పోర్టల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు అప్పటి ప్రభుత్వం 2021 నుంచి దశల వారీగా 33 మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వాటిని ఆసరాగా తీసుకుని కొందరు పోర్టల్లోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ను భూభారతిగా మార్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్-NIC భూభారతిని నిర్వహిస్తున్నా, ధరణి నాటి సాంకేతికతే ఉండిపోయింది.
గుట్టుగా పోర్టల్లోకి చొరబడి మార్చేసిన అక్రమార్కులు : పోర్టల్లో సరైన సైబర్ రక్షణ లేకపోవడంతో పలువురు చొరబడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన రిజిస్ట్రేషన్ల ఛార్జీల దారి మళ్లింపు కూడా ఇదే విధంగా జరిగింది. దాని ఆనుపానులను శోధించగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆన్లైన్/మీసేవా కేంద్రాలకు లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కొందరు నిర్వాహకులను కూడా విచారించారు. ఇదే తరహాలో ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూ యాజమాన్య హక్కులను కూడా మార్చినట్లు తెలిసింది.
సాంకేతికతపై పట్టున్న పలువురు, రెవెన్యూ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మరికొందరు కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అనుమానం ఉన్న చోట్ల ఆడిట్ నిర్వహించారు. సాంకేతిక లోపాలను అవకాశంగా తీసుకునే భూదస్త్రాల్లో మార్పులు, యాజమాన్య హక్కుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది.
ధరణి పోర్టల్లో కోడ్ ఆడిటింగ్ - ఇక అక్రమాలకు చెక్
భూభారతి స్కామ్ : తక్కువ చెల్లించినా ఎందుకు రిజెక్ట్ అవలేదు? - ఆ రూ.50 కోట్లు ఏమయ్యాయి?

