YUVA : సైబర్ మోసంలో డబ్బుపోగొట్టుకున్నారా? - బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా 'డీజీ రక్ష'
సైబర్ బాధితులకు అండగా డీజీ రక్ష వెబ్సైట్ - దేశంలో ఎక్కడి నుంచైనా సహాయం పొందేలా వెసులుబాటు - ఇప్పటికే బాధితులకు చెందిన లక్షల రూపాయలు తిరిగి వచ్చేలా కృషి చేసిన రంజిత్

Published : May 28, 2026 at 1:32 PM IST
Services To Cybercrime Victims : సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజల అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. చదువుకోని వారికంటే ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వారే ఎక్కువగా ఈ మోసాల బారిన పడుతున్నారు. పరువు పోతుందనో.. అవగాహన లేకనో.. ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారందరికీ అండగా నిలుస్తోంది డీజీ రక్ష సంస్థ. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్నారు ఆ సంస్థ సీఈవో రంజిత్. మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ డిజిటల్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ టీం వీటిని కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజుకో పంథాలో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు తమవంతు ప్రయత్నంగా పరిష్కారం చూపాలనుకున్నారు. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా డీజీ రక్ష సంస్థ ఏర్పాటు చేశారు.
అన్నింటిలోనూ అండగా నిలుస్తూ : రంజిత్.. డీజీ రక్ష సంస్థ వ్యవస్థాపకుడు. సైబర్ క్రైం బారిన పడిన వారికి digiraksha.org వెబ్సైట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా బాధితులకు సహాయం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం దగ్గరి నుంచి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయించడం, లీగల్ కౌన్సెలింగ్ ఇవ్వడం వరకు అన్నింటిలోనూ అండగా నిలుస్తున్నారు.
లక్షల రూపాయలు తిరిగి వచ్చేలా : కొందరు పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తుంటే.. మరికొందరు అవగాహన లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నారు. అలాంటి వారికి డీజీ రక్ష మార్గదర్శిగా నిలుస్తుందని చెబుతున్నాడు రంజిత్. తమ వెబ్సైట్ను ఆశ్రయించిన వారికి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఇప్పటివరకు వందలాది మందికి అండగా నిలిచామని, బాధితులకు చెందిన లక్షల రూపాయలను తిరిగి వచ్చేలా కృషి చేశామని చెప్పారు.
నామమాత్రపు ఫీజుతోనే : ఈ సైబర్ రక్షణ సేవలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా 'డీజీ రక్ష' వెబ్సైట్ ద్వారా బాధితులు సహాయం పొందవచ్చు. అదీ కూడా కేవలం నామమాత్రపు ఫీజుతోనే ఈ సేవలు అందిస్తున్నట్లు రంజిత్ తెలిపారు.
"బాధితులతో మాట్లాడి ముందుగా కౌన్సిలింగ్ ఇస్తాం. బాధితులు పేమెంట్ ఏవిధంగా చేసి మోసపోయారో తెలుసుకుంటాం. తర్వాత సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లెంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కు పంపుతాం. తర్వాత కోర్టు నుంచి మనీ బ్యాక్ ఆర్డర్ వస్తే ఏం చేయాలి అనే విషయాలపై గైడెన్స్ ఇస్తాం. ఇప్పటి వరకు నా తరఫున 50 మందికి పైగా సాయం చేశాను. వాటి విలువ కోట్లలోనే ఉంది. మా సేవలను దేశవ్యాప్తంగా ఎవరైనా వినియోగించుకోవచ్చు. కౌన్సిలింగ్ ఉచితంగా ఇస్తాం. అవసరమైతేనే నామమాత్రపు ఫీజు తీసుకుంటాం"
- రంజిత్, డీజీ రక్ష వ్యవస్థాపకుడు
ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతారు : సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ ముందస్తుగా ఏదో ఒక ఆశ చూపుతారని అలాంటి ప్రలోభాలకు లొంగకపోతే ఎవరూ మోసపోయే అవకాశమే ఉండదని రంజిత్ అవగాహన కల్పిస్తున్నారు. మోసపోయాక బాధపడటం కంటే ముందే అప్రమత్తంగా ఉండి, సైబర్ నేరాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండడమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు. ప్రజా సమస్యల నుంచి పుట్టిన ఈ ఆలోచన ఆచరణతో సైబర్ క్రైం బాధితులు ధైర్యంగా ముందడుగు వేసి సమస్య పరిష్కరించుకునేందుకు అండగా నిలుస్తోంది.
"డీజీ రక్ష ఆన్లైన్ పోర్టల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని ఉద్దేశం ఆన్లైన్ మోసాల బారినపడి డబ్బు పోగొట్టుకున్న వారికి సాయం అందించడం. లింక్లు, షేర్మార్కెట్, నకిలీ వెబ్సైట్లు ద్వారా సొమ్ముపోతే మా వెబ్సైట్లోకి వచ్చి మీ సమస్యలు చెప్పొచ్చు. మా టీమ్ మెంబర్ వాట్సప్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఏ విధంగా మోసపోయారో తెలుసుకుంటారు."
- రాకేశ్, సాంకేతిక బృంద సభ్యుడు
YUVA : వినూత్న ఆవిష్కరణ చేసిన పల్లెటూరి యువకుడు - కోట్లాది మంది రైతులకు ఉపయోగపడే యంత్రం తయారీ
YUVA : న్యూస్ పేపర్లు చదివి ప్రిపరేషన్ - 6 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో సెన్సేషన్

