రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో కీలక అడుగు- వన్యప్రాణులను కాపాడేందుకు 'హనుమాన్ ': పవన్ కల్యాణ్
వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టు అని తెలిపిన పవన్ కల్యాణ్- ఏనుగుల వల్ల పంటలకు నష్టం జరగకుండా చర్యలు, అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 12:55 PM IST
Deputy CM Pawan Kalyan Launched Wildlife Conflict Prevention Project HANUMAN: మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించిన ఆయన వన్యప్రాణులను కాపాడేందుకు 'హనుమాన్ ఫౌండేషన్ ' ప్రాజెక్టు ప్రారంభించారు. ఇందులో భాగంగా అటవీశాఖకు వాహనాలు, అంబులెన్సులు అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగు అని అన్నారు. పర్యావరణ, జంతు ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపారు.
సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థ: వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వన్యప్రాణుల నుంచి మనుషులను రక్షించేందుకు చర్యలు చేపడతామని, ఏనుగుల వల్ల పంటలకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కరించామన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేశామన్న పవన్ వాటికి అండగా ఉన్న స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు తెలిపారు.
'వన్యప్రాణుల వల్ల పంటనష్టం, ప్రాణనష్టం జరగకుండా చూస్తాం. ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయం చేసేలా చర్యలు చేపడతాం. బాధితులకు పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ చూస్తుంది. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా అటవీశాఖకు 100 వాహనాలు అందించాం. రాష్ట్రంలో 19 అత్యవసర సహాయ బృందాలు సిద్ధం చేశాం. 7చోట్ల అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. వన్యప్రాణుల దాడుల బాధితులకు రూ.4 కోట్ల పరిహారం చెల్లించాం. మార్కెట్ విలువ ఆధారంగా పంటనష్ట పరిహారం ఇస్తున్నాం. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెచ్చి అడవి ఏనుగులను కట్టడి చేశాం. రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ బాధ్యతగా చేపట్టాం. హనుమాన్ ప్రాజెక్టులో స్వచ్ఛంద సంస్థలనూ భాగస్వాములు చేస్తాం.' -పవన్ కల్యాణ్, ఉపముఖ్యమంత్రి
ఉపముఖ్యమంత్రి సూచనలతో ప్రాజెక్ట్: పవన్ కల్యాణ్ సూచనల మేరకు హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు రూపొందించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. హనుమాన్ ప్రాజెక్టు కోసం ప్రత్యేకమైన యాప్ తయారుచేశామన్నారు. జంతు సంరక్షణ, పునరావాసం కోసం ప్రత్యేక వాహనాలు అందిస్తున్నామన్నారు. ఏనుగుల వల్ల పంటనష్టం జరిగితే ఇచ్చే పరిహారం భారీగా పెంచినట్లు అటవీశాఖ తెలిపింది. పంటనష్టం జరిగిన 24 గంటల్లో పరిహారం అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించింది. పవన్ సూచన మేరకు గజ ప్రజ, సర్ప మిత్ర కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఏఐ సాయంతో వన్యప్రాణులను అడవుల్లోకి పంపించే చర్యలు తీసుకున్నామన్నారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య పరస్పర సంఘర్షణ నివారణకే ప్రాజెక్టు రూపొందించినట్లు వివరించారు.
టెక్నాలజీతో అటవీ జంతువుల సంరక్షణ - కూటమి సర్కారు ముందడుగు
రైతులందరూ ధైర్యంగా ఉండండి - మీ కోసం ప్రభుత్వం పని చేస్తుంది: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

