పండగ వేళ పశ్చిమ బైపాస్ ఎక్కేస్తున్నారా? - జాగ్రత్త! ప్రమాదాలు జరగొచ్చు
పశ్చిమ బైపాస్పై పూర్తి కాని పనులు -తాత్కాలిక రాకపోకలకు అనుమతి - తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 9:44 AM IST
Dangers Posed in Vijayawada Bypass Due To Incomplete Works : విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించింది. హైదరాబాద్-విశాఖ మధ్య రాకపోకలు సాగించే వారికి విజయవాడ ట్రాఫిక్ చెర నుంచి విముక్తి దొరికింది. ఎంచక్కా పశ్చిమ బైపాస్పై దూసుకెళ్లేందుకు ఇప్పటికే తాత్కాలిక రాకపోకలు మొదలయ్యాయి. అయితే వాహనాలు వెళుతున్నా ఇంకా పూర్తి కాని పనులు ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సంక్రాంతి నేపథ్యంలో రద్దీ మూడు రెట్లు పెరుగుతుంది. దీంతో ప్రమాదాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీనికి అధికారులతో పాటు వాహన చోదకులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది.
రాకపోకలకు, విజయవాడ నుంచి ఎన్హెచ్-16 మీదుగా విశాఖ వెళ్లే వారితో రద్దీగా ఉంది. మలుపు తిరిగే సమయంలో రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతున్నాయి. పిన్నమనేని ఆస్పత్రి, వైద్య కళాశాల నుంచి వచ్చేవారు నిత్యం రహదారిపై నడుస్తుంటారు. సమీపంలోని ఫ్లైఓవర్ మీదుగా వేగంగా వాహనాలు రావడంతో అదుపు కావడం లేదు. ఇక్కడ ఫుట్ ఓవర్ వంతెన నిర్మాణం చేపట్టాలి.

ఆ ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా : చినఆవుటపల్లి నుంచి గొల్లపూడికి 30 కి.మీ మేర పశ్చిమ బైపాస్ దాదాపు పూర్తి కావడంతో కొంత కాలం కిందట ప్రయాణానికి అనుమతించారు. ప్రస్తుతం రోజుకు 10వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్-విశాఖ మధ్య రాకపోకలు సాగించేవారికి విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సంక్రాంతి నేపథ్యంలో దాదాపు ఇదే బైపాస్పై వెళ్లనున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య 30వేలకు పైగా పెరుగుతుందని అంచనా. 30 కి.మీ ప్రయాణంలో మూడు ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.
ఇరుకు మార్గంలోనే ప్రయాణం : జక్కంపూడి-అంబాపురం మధ్య పాములకాలువ వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రస్తుతం వాహనాలు తాత్కాలిక మార్గంలో ఒకేవైపు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడ తాజాగా రెండు ప్రమాదాలు జరిగాయి. వాహనదారులు ఈ ప్రాంతంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు వెంటనే అక్కడ వేగ నియంత్రికలు, సూచికలు, లైటింగ్ ఏర్పాటు చేయాలి.
హైదరాబాద్ నుంచి వచ్చేవారు గొల్లపూడి సమీపంలో పశ్చిమ బైపాస్లో ప్రవేశించే చోట అనుసంధానం పనులు పూర్తికాలేదు. చాలా ఇరుకుగా ఉండడంతో ప్రమాదకరంగా ఉంది. భారీ నుంచి చిన్న వాహనాలు ఈ ఇరుకు మార్గంలోనే వెళ్తుండడంతో గందరగోళం నెలకొంటోంది. గ్రామానికి దూరంగా ఉండడంతో ప్రమాదాలు జరిగినా సమాచారం రావడమూ కష్టమే. అక్కడ లైట్లు, సూచికలు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ పోలీసుల పహారా అవసరం.
విద్యుత్తు టవర్ల సమస్యకు పరిష్కారం : మరోవైపు ప్రయాణానికి ప్రతిబంధకంగా ఉన్న నున్న విద్యుత్తు టవర్ల సమస్యకు అధికారులు పరిష్కారం చూపించారు. దీంతో హైదరాబాద్ ప్రయాణికులకు బోలెడంత సమయం ఆదా కానుంది. ప్యాకేజీ-3లో చినఆవుటపల్లి-గొల్లపూడి వరకు 30 కిమీ మేర బైపాస్ పూర్తి చేశారు. జక్కంపూడి, నున్నలో రహదారిపై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్తు టవర్లతో ఇప్పటి వరకు ప్రయాణికులను అనుమతించలేదు. ఇటీవల జక్కంపూడి టవర్ల వివాదానికి కోర్టు పరిష్కారం చూపింది.
ప్రస్తుతం ఉన్న ఎలైన్మెంట్లోనే విద్యుత్తు వైర్లను ఎత్తు పెంచాలని తీర్పు ఇచ్చింది. నున్న టవర్ల విషయంలో ఇప్పటికే కొత్త టవర్ల నిర్మాణం సగానికి పైగా పూర్తవడంతో జక్కంపూడి తరహా మార్పు సాధ్యం కాదని అధికారులు భావించారు. దీనికి ఎన్హెచ్ఏఐ అధికారులు యుద్ధప్రాతికన రహదారిపై తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను పైకిలేపి నున్నలో ఓ తాత్కాలిక టవర్ నిర్మించి సమస్యను పరిష్కరించారు.
రూ.700 కోట్ల ఎలివేటెడ్ వంతెన రద్దు - విజయవాడ వాసులకు NHAI షాక్
ఓవైపు పచ్చని పొలాలు, మరోవైపు కృష్ణమ్మ - మధ్యలో బాహుబలి బ్రిడ్జి - ఇవిగో డ్రోన్ విజువల్స్

