ఈ-చలానా అంటూ నకిలీ లింక్లు - క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
ట్రాఫిక్ ఉల్లంఘనల పేరిట ఫోన్లకు నకిలీ ఈ-చలానాలు - లింక్లు పంపిస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్న అందినకాడికి దోచుకుంటున్న మోసగాళ్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 4:41 PM IST
Cybercrime Through WhatsApp Links to Pay Traffic Challan: సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. అసలైన వాటిని పోలిఉండే లింక్లు తయారు చేసి సామాన్యులను మోసగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎంతో మంది తమ సొమ్ము పోగొట్టుకుని బాధితులవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను అడ్డుగా పెట్టుకుని సైబర్ కేటుగాళ్లు నకిలీ చలానాల వివరాలతో తప్పుడు సందేశాలు పంపిస్తున్నారు. వాటి ద్వారా ఆ వ్యక్తి ఖాతాలోని సొమ్ము అంతా మాయం చేస్తున్నారు. వీళ్లు చలానాల పేరుతో పంపించే సందేశాలు నిజమైన వాటికి ఏమాత్రం తీసిపోవు. అంత అసలైనవిగా ఉండడం వల్లనే చాలా మంది ఈ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు.
తక్కువ జరిమానా చూపిస్తారు- క్లిక్ చెయ్యమని సూచిస్తారు: రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుపేరుతో ట్రాఫిక్ నిబంధనలు పాటించనందకు మీ వాహనంపై చలానా పెండింగ్లో ఉందంటూ మోసగాళ్లు ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా సందేశాలు పంపుతారు. పెండింగ్లో ఉన్న జరిమానా అంతా వెంటనే కట్టాలని దాంట్లో ఉంచుతారు. జరిమానా చెల్లించడానికి ఈ మెసేజ్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయ్యాలని సూచిస్తారు.
ఆ సందేశంలో కట్టాల్సిన జరిమానాను తక్కువగా చూపిస్తారు. అది కేవడం అదే నిజమని మనల్ని నమ్మించడానికి మాత్రమే. ఒకవేళ కేటుగాళ్ల మాయలో పడి లింక్మీద క్లిక్ చేసినట్లైనతే వెంటనే నకిలీ వెబ్సైట్లోకి వెళ్తుంది. అందులో ఓటీపీలు, క్రెడిట్ , డెబిట్ కార్డుల నంబర్లు నమోదు చేయాలని కోరుతుంది. సందేశంలో ఉన్న విధంగా మనం మన వివరాలన్నీ అందులో నమోదు చేస్తే ఆ వెంటనే బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. ఏపీకే ఫైళ్లను కూడా కొన్ని సార్లు సందేశాల్లో పంపిస్తుంటారు. జరిమానా చెల్లించేందుకు, సరిచూసుకునేందుకు దీనిపై క్లిక్ చేయ్యాలని సూచిస్తారు. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆటోమెటిక్గా మాల్వేర్ మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. అంతే కాక ఫోన్ నియంత్రణ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది.
సందేశాలు పంపుతారు- సొమ్ము మాయం చేస్తారు : విజయవాడ నగరంలోని ఒక వ్యక్తికి ట్రాఫిక్ ఉల్లంఘన చేశారంటూ వాట్సప్లో ఈ-చలానా కట్టాలని సూచిస్తూ సందేశం వచ్చింది. అతడు దాని మీద క్లిక్ చేయగానే విడతల వారీగా తన క్రెడిట్ కార్డుల నుంచి రూ.1.78 లక్షలు పోయాయి. ఇటీవల నగరానికి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్కు వాట్సప్ నంబర్కు గుర్తు తెలియని నంబర్ నుంచి ట్రాఫిక్ చలానా వచ్చింది. చలానా పెండింగ్లో ఉందని ఇంకో మెసేజ్ వచ్చింది. దీంతో అతను ఆ లింక్లో ఉన్న ఏపీకే ఫైల్పై క్లిక్ చేసి సంబంధించిన వివరాలన్నీ ఎంటర్చేశాడు. అలా చేసిన కొద్ది సేపటికే తర్వాత ఆ ఎగ్జిక్యూటివ్ రెండు క్రెడిట్ కార్డుల నుంచి రూ.2.10 లక్షలు మాయమానట్లు నోటిఫికేషన్ వచ్చింది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: మీరు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించారంటూ సెల్ఫోన్లకు వచ్చే చలానాలకు స్పందించొద్దని అధికారులు తెలుపుతున్నారు. ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసు పేర్లతో మెసెజ్లో వచ్చే లింక్లను క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. ఇలాంటి మెస్సేజ్లు వచ్చినప్పుడు అవి క్లిక్ చేయకుండా అధికారిక వెబ్సైట్లలోకి వెళ్లి వివరాలు చెక్ చేసుకోవాలి. తెలియని/ పరిచయం లేని వ్యక్తులతో బ్యాంకింగ్ వివరాలను పంచుకోకూడదు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఎట్టిపరిస్తుతుల్లోనూ నకిలీ వెబ్సైట్లలో మోదు చేసుకోవద్దు.
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు - లైకుల కోసం జంతు బలులు
ఒక్కో ఖాతాకు రూ. 13 వేలు - కమీషన్ ఆశ చూపించిన రాజస్థాన్ ముఠా

