అమరావతిలో రహదారి పనులు రయ్ రయ్ - 60 మీటర్ల వెడల్పుతో ట్రాఫిక్ ఫ్రీ 'ట్రంక్ రోడ్లు'
వేగం పుంజుకున్న ప్రధాన రహదారుల (ట్రంక్ రోడ్ల) నిర్మాణ పనులు - వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు - ట్రాఫిక్ సమస్యలు రాకుండా 50, 60 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రహదారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 7:31 PM IST
Construction Works Of Trunk Roads in Capital Amaravati : ప్రజా రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల (ట్రంక్ రోడ్ల) నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు రాకుండా విశాలంగా, అధునాతన సదుపాయాలతో వీటిని నిర్మిస్తున్నారు. హైస్పీడ్ కనెక్టవిటీతో పాటు ట్రాఫిక్ సమస్యలు రాకుండా 50, 60 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రహదారులు నిర్మిస్తున్నారు. ఈ-11, ఈ-13, ఈ-15 రహదారులను ఎన్హెచ్ 16కు అనుసంధానం చేయనున్నారు. అమరావతికి రవాణా సౌకర్యం కోసం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మిస్తున్నారు. 9 వరుసలతో (ఈ-3) దీని నిర్మాణం జరుగుతోంది.
వేగంగా ఈ-5 రోడ్డు నిర్మాణపనులు : ఈ రహదారుల్లో భూగర్భ విధానంలో వరద నీటి నిర్వహణ, తాగు నీరు, డ్రైనేజీలు, విద్యుత్తు, ఇంటర్నెట్ వంటి సదుపాయాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్-7 రహదారిపై వంతెన నిర్మాణం, అనంతవరం సమీపంలో ఈ-5 రోడ్డు నిర్మాణపనులు వేగంగా పుంజుకున్నాయి. 2026 ఫిబ్రవరి చివరి నాటికి ఈ-3 రోడ్డును ప్రకాశం బ్యారేజ్ సమీపంలో మంగళగిరి రోడ్డుకు అనుసంధానం చేసే పనులు పూర్తి చేసే లక్ష్యంతో ఏడీసీఎల్ ముందుకుసాగుతోంది.
ఇందుకోసం తాడేపల్లి వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఏడాదిలో ప్రధాన రహదారులన్నీ ఒక రూపు సంతరించుకుంటాయని, ప్రస్తుతం ట్రంక్ రోడ్లు నిర్మాణాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) సీఈ నరసింహమూర్తి తెలిపారు.

చెన్నై- కోల్కతా రహదారితో అనుసంధానం : మరోవైపు రాజధాని అమరావతిని యర్రబాలెం నుంచి చెన్నై- కోల్కతా జాతీయ రహదారితో (ఎన్హెచ్-16) అనుసంధానించే ఇ-13 రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని మాస్టర్ప్లాన్లో భాగంగా నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు ప్రతిపాదించిన ఇ-13 రహదారిని ఇప్పుడు ఎన్హెచ్-16 వరకు పొడిగిస్తున్నారు. ఇది విజయవాడ- మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం సమీపంలో ఎన్హెచ్-16తో కలుస్తుంది.
యర్రబాలెం నుంచి నుంచి ఎన్హెచ్-16 వరకు సుమారు 3.54 కి.మీ. ఈ రహదారి మార్గంలో కొండలు ఉన్నాయి. సుమారు కిలోమీటరు పొడవున కొండలపై ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత కొంత దూరం కొండపై రహదారి, మళ్లీ కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, మళ్లీ కొంత దూరం కొండపైన, ఆ తర్వాత ఫ్లైఓవర్, చివర్లో ట్రంపెట్ ఇలా సాగుతుంది. రహదారి నిర్మాణానికి మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని కొండను చదును చేయడం వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
రాజధానిలోని నెక్కల్లు నుంచి ఎన్హెచ్-16 వరకు 11 కి.మీ.
- రాజధాని మాస్టర్ప్లాన్ ప్రకారం ఇ-13 రహదారిని నెక్కల్లు నుంచి యర్రబాలెం వరకు 7.5 కి.మీ. దూరం నిర్మిస్తున్నారు. ఇది ఆరు వరుసల రహదారి.
- 2024లో రాజధాని పనుల్ని పునఃప్రారంభించాక అమరావతిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు కొన్ని రహదారుల్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఇ-13 రహదారిని యర్రబాలెం నుంచి ఎన్హెచ్-16 వరకు పొడిగిస్తున్నారు. ఈ దూరం సుమారు 3.54 కి.మీ. దీన్ని కూడా ఆరు వరుసలుగా నిర్మిస్తున్నారు.
- మధ్యలో కొంత అటవీ భూమి ఉండటంతో రోడ్డు నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతులు తీసుకున్నారు.
- రూ.384 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు.
రాజధాని రైతులకు గుడ్న్యూస్ - లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు
రాజధాని అమరావతిలో మరో ముందడుగు - హైకోర్టు భవన నిర్మాణ పనులు ప్రారంభం

