నిందితులను తప్పించేందుకు లంచం - కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన సీపీ రాజశేఖరబాబు
నిందితుల పేర్లను మార్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ - సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించిన సీపీ రాజశేఖరబాబు, ఎస్సై పాత్రపైనా కొనసాగుతున్న విచారణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 1:17 PM IST
Constable Suspended For Demanding Money in NTR Distrcit: ఓ కేసులో నిందితులుగా పేర్లు చేర్చకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పోలీసు స్టేషన్లో చోటు చేసుకుంది. అనంతరం ఎస్.ఐ ఉమామహేశ్వరరావుపై శాఖపరమైన విచారణకు పోలీసు కమిషనర్ రాజశేఖర్బాబు ఆదేశించారు.
అసలేం జరిగిందంటే? వత్సవాయి పోలీసు స్టేషన్ పరిధిలోని గోపినేనిపాలెంలో ఇటీవల బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అయితే ఈ కేసులో నిందితుడి సోదరుడు, అతని స్నేహితులను ఎస్సై నిత్యం స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఎస్సైకు రూ.50,000 ఇచ్చేందుకు అంగీకరించి, సమాచారాన్ని ఏసీబీకి అందించారు.
ఎస్సై పాత్రపైనా విచారణ: లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు పకడ్బందీగా పథకం వేశారు. ఈ మేరకు లంచం ఇచ్చేందుకు నిందితుడి తండ్రి ఎస్సై వద్దకు వెళ్లాడు. ఇప్పుడే వస్తానని ఎస్సై బయటకు వచ్చాడు. ఆ సమయంలో స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బయట ఉన్న తన బ్యాచ్కు చెందిన ఏసీబీ కానిస్టేబుల్ని గుర్తుపట్టాడు. అనుమానంతో వెంటనే ఎస్సైకు సమాచారం ఇచ్చాడు.
దీంతో ఎస్సై ఉమామహేశ్వరరావు స్టేషన్ నుంచి హుటాహుటిన బయటకు వెళ్లిపోయారని తెలిసింది. లంచం డిమాండ్ చేసి ఏసీబీ ట్రాప్ నుంచి తప్పించుకున్న ఉదంతంపై సీపీ రాజశేఖరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేసి, ఎస్సై ఉమామహేశ్వరరావు, కానిస్టేబుల్ కొండలరావుపై నివేదిక ఇవ్వాలని గ్రామీణ డీసీపీ లక్ష్మీనారాయణను సీపీ ఆదేశించారు. దీంతో హుటాహుటిన డీసీపీ లక్ష్మీనారాయణ నందిగామ ఏసీపీ కార్యాలయానికి వచ్చి విచారణను చేపట్టారు. కేసు వివరాలను పోగుచేసి పరిశీలించారు. ఆ తర్వాత బాధితుల నుంచి వివరాలను సేకరించారు. ప్రాథమికంగా కానిస్టేబుల్ పాత్ర నిర్ధరణ అయింది.
అయితే ఎస్సైకు డబ్బులు ఇస్తే పేర్లు చేర్చరని చెప్పినట్లు తెలిసింది. దీంతో డీసీపీ సిఫార్సు మేరకు పోలీసు కమిషనర్ కానిస్టేబుల్ కొండలరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎస్సై పాత్ర గురించి సైతం విచారణ సాగుతోంది. వత్సవాయి పోలీసు స్టేషన్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు.
గతంలోనూ ఈ తరహా ఘటన: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వర్తించిన సీవీ నరసింహులు అప్పటి నాయకుల అండతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరసింహులు అవినీతిపై విచారణ జరిపి సస్పెండ్ చేసింది. చిత్తూరు జిల్లా సోమల ఎస్సైగా నరసింహులు ఉన్న సమయంలో 2023 సెప్టెంబరులో ఓ మహిళ అదృశ్యం కాగా ఆమె భర్త ఫిర్యాదు చేశారు.
మరుసటి రోజు ఆమె స్టేషన్కు వచ్చి కుటుంబపరమైన వివాదాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటానని ఎస్ఐకి చెప్పారు. ఇష్టప్రకారం ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని ఆమెను ఎస్ఐ నరసింహులు డిమాండ్ చేశారు.తన వద్ద నగదు లేదని ఆమె చెప్పగా మెడలో ఉన్న మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చారు. తెలిసిన తాకట్టు వ్యాపారి వద్దకు పంపి ఆమె ఫోన్పే నుంచి ఎస్ఐ రూ.60 వేలు బదిలీ చేయించుకున్నాడు.
పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య - సస్పెండ్ చేసిన అధికారులు
పోలీస్స్టేషన్లో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు రాచమర్యాదలు - వెలుగులోకి మరో వీడియో

