ఎట్టకేలకు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం డబ్బులు - సాకారం కానున్న ఆర్ఆర్ఆర్!
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్వాసితులకు ఎకరాకు రూ.14 నుంచి రూ.16 లక్షల పరిహారం - ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగే అవకాశం - రెండో విడతలో రెండింతలు పరిహారం

Published : November 6, 2025 at 12:11 PM IST
Latest Update On Regional Ring Road Hyderabad : హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో రోడ్లను విస్తరించారు. గతంలోనే ఇన్నర్ రింగ్ రోడ్, ఆపై అవుటర్ రింగ్ రోడ్లను నిర్మించారు. దీంతో చాలా వరకు నగంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి. అయితే రాజధాని నగరం నానాటికీ విస్తరిస్తోంది. దీంతో నగరానికి వెలుపల రీజినల్ రింగ్ రోడ్ను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం అడుగులు వేసింది.
దీని నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించింది. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎట్టకేలకు పరిహారం పంపిణీ ప్రారంభమైంది. దీంతో రైతులు తమ ఖాతాలను చూసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే పరిహారం జమ అవుతుందని అధికారులు అంటున్నారు.
అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంతో : ఉత్తర భగం నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రావడంతో అధికారులు గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేశారు. దీంతో పరిహారం డబ్బులు పంపిణీకి ఎన్హెచ్ఏఐకి మార్గం సుగమం అయింది. చౌటుప్పల్, భువనగిరి, జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి కంది వరకు 158 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.5557.02 కోట్ల వ్యయం చేయనున్నారు.
రెండో విడతలో రెండింతలు : మొదటి విడత పరిహారానికి రెండింతలు పెంచి రెండో విడతలో తుది మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ఖరారు చేస్తారని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ వెల్లడించారు. నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాక భూముల దస్తావేజులను సేకరిస్తామని అన్నారు. ఎకరాకు రూ.14 నుంచి రూ.16 లక్షలు అందుతాయని తెలిపారు.
"మొదటి విడత పరిహారానికి రెండింతలు పెంచి రెండో విడతలో తుది మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ఖరారు చేస్తారు. నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాక భూముల దస్తావేజులను సేకరిస్తాం. ఎకరాకు రూ.14 నుంచి రూ.16 లక్షలు పరిహారం అందుతుంది." - మహిపాల్, ఆర్డీఓ, నర్సాపూర్
ఎకరా భూమికి రూ.30 లక్షల వరకు : ప్రస్తుతం నిర్వాసితుల ఖాతాల్లో ఎకరాకు రూ.14 నుంచి రూ.16 లక్షల వరకు భూములు మార్కెట్ విలువ ఆధారంగా డబ్బులు జమ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్బిట్రేషన్ దరఖాస్తులు కలెక్టర్ ఆమోదానికి పంపిన తర్వాత అక్కడి నుంచి రెండో విడతలో ఎకరా భూమికి రూ.30 లక్షల వరకు అందజేసే అవకాశాలున్నాయి.
వేగంగా అడుగులు : మొత్తం రోడ్డు నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్లు సైతం పిలిచింది. ఓ వైపు పరిహారం పంపిణీ చేస్తుండటంతో ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగే అవకాశముంది. గత నెలలో అవార్డుల జారీ ప్రారంభించారు. రైతులు, వారి ఆధీనంలో ఉన్న భూముల వివరాలను అధికారులు సేకరించారు. ఆర్బిట్రేషన్ దరఖాస్తులను తీసుకుని కలెక్టర్కు పంపారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావడంతో పరిహారం నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
టోల్ప్లాజా సేవలు : డబ్బులు కట్టడమే కాదు - ఈ సౌకర్యాలూ పొందొచ్చని మీకు తెలుసా?
ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్ మధ్యలో రేడియల్ రోడ్లు - త్వరలోనే పనులు ప్రారంభం!

