ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 21 శాతం క్రైం తగ్గించాం: సీపీ రాజశేఖర్బాబు
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు - ఈసారి పెరిగిన నార్కోటిక్, ఎకనామిక్ కేసులు - ఏవిడెన్స్ బేస్ పోలీసింగ్కు ప్రాధాన్యత

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 4:53 PM IST
Commissioner Rajasekhar Babu PC on Annual Crime Review 2025: వచ్చే ఏడాదిలో సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు విజయవాడ సీపీ రాజశేఖర్బాబు తెలిపారు. 2024తో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల లెక్క తగ్గినట్లు, వార్షిక నేర సమీక్ష- 2025లో భాగంగా వెల్లడించారు. 2025లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మంచి ఫలితాలు సాధించామన్నారు. సురక్ష ప్రాజెక్ట్ ద్వారా నగరంలో ఒకేసారి వెయ్యి కెమెరాలు ఏర్పాటు చేశమన్నారు. వచ్చే ఏడాది నార్కోటిక్, ఎకనామిక్ కేసులను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 21 శాతం క్రైం తగ్గించామని సీపీ రాజశేఖర్బాబు తెలిపారు. ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్కు ప్రధాన్యత ఇచ్చామన్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామని ఆలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాను నియంత్రణ చేశామని వ్యాఖ్యానించారు. అస్త్రం ద్వారా ట్రాఫిక్ను నియంత్రిస్తున్నామన్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలి: సైబర్ క్రైం తగ్గినా నగదు నష్టం ఎక్కువుగా ఉందని వెల్లడించారు. 80.70 శాతం రికవరీ ఉండటం ఒక రికార్డు. 2024లో 52శాతం మాత్రమే రికవరీ ఉందన్నారు. కన్విక్షన్ 50 శాతం నిందితులకు పడిందని తెలిపారు. హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలు, రోడ్టు ప్రమాదాలు తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాద మరణాలు ఇరవై శాతం తగ్గాయని హెల్మెట్, సీటు బెల్ట్ పై అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. వచ్చే ఏడాదిలో ఈ ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గించేలా చేస్తామని వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులే ఎక్కువుగా ప్రమాదాల్లో మరణిస్తున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని సూచించారు.
హిట్ అండ్ రన్ కేసులు 328 ఉంటే 238 మందికి ఆర్ధిక సాయం రూ.2 కోట్లతో అందించామన్నారు. దేశంలోనే ఇది 3వ స్థానంలో ఉండటం ఎన్టీఆర్ పోలీస్ గొప్పగా భావిస్తున్నామన్నారు. సైబర్ క్రైంలో 9.54 కోట్ల రూపాయలను నిందితుల ఖాతాల్లో సీజ్ చేశామని తెలిపారు. నార్కోటిక్ కేసుల్లో 22 మంది పై పిట్ ఎన్డిపియస్ అమలు చేసామని రాష్ట్రంలో తొలిసారిగా ఇక్కడే ఈ సెక్షన్ కింద కేసు పెట్టామన్నారు.
పార్కింగ్ ప్రదేశాల్లోనూ కెమెరాలు: దసరా, భవానీ దీక్షల విరమణ, ఇతర భారీ ఉత్సవాలకు రద్దీని మానటరింగ్ చేయడంలో డ్రోన్లు కీలకంగా పని చేశాయని గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అద్భుతంగా పని చేశామన్నారు. 18 లక్షల మంది దసరాకు వచ్చినా, భవానీ దీక్షల విరమణకు 6 లక్షలు వచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశామన్నారు. క్యూలైన్లలో కౌంటింగ్ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు క్రౌడ్ను అంచనా వేశామని తెలిపారు. అన్ని ప్రధాన ఆలయాల్లో వచ్చే ఏడాదిలో ఈ కౌంటింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వాటికి అనుసంధానించే సర్వర్, ఇతర పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉందని వెల్లడించారు. పార్కింగ్ ప్రదేశాల్లో కూడా కౌంటింగ్ కెమెరాలు పెట్టబోతున్నామన్నారు.
'గత ఏడాదితో పోలిస్తే ఈసారి 21 శాతం క్రైం తగ్గించాం. ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. నార్కోటిక్, ఎకనామిక్ కేసులు మాత్రమే ఈసారి పెరిగాయి. ఏవిడెన్స్ బేస్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇచ్చాం. సురక్ష ప్రాజెక్టుతో ఒకేసారి వెయ్యి కెమెరాలు ఏర్పాటు చేశాం.' - రాజశేఖర్ బాబు, సీపీ
అస్త్రం యాప్ ద్వారా: ఎన్టీఆర్ జిల్లా క్రైమ్కు abcd అవార్డు వచ్చిందని టీంకు అభినందనలు చెప్పారు. పసికందులను విక్రయించే ముఠాను అరెస్టు చేశామని కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు బృందాలు పని చేస్తున్నాయన్నారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయా ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్ల పని తీరు కూడా తెలిసిపోతుందన్నారు. వీటి ఆధారంగా వారి పని తీరులో మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రేపు ఏ జంక్షన్ లో రద్దీ ఉండబోతుందో కూడా ఈరోజు తెలుసుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అస్త్రం టూల్ ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు.
ఈ పాథ్ ద్వారా అంబులెన్స్ మూవ్మెంట్ తెలియజేస్తే గ్రీన్ ఛానల్ ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మనం ఏ రూటులో వెళితే రద్దీ ఉండదు అని ప్రజలకు యాప్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఫంక్షన్ హళ్లలో జరిగే కార్యక్రమాలు గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని ఆయా ప్రాంతాల్లో రద్దీ, వీఐపీ మూవ్మెంట్ బట్టి ట్రాఫిక్ ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ డిప్లాయిమెంట్ ద్వారానే సిబ్బందికి బందోబస్తు డ్యూటీలు వేస్తున్నామన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
వ్యాపారులకు టోకరా వేసిన సైబర్ ముఠా - రూ.32 లక్షలు మాయం
రాష్ట్రంలో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది - సైబర్ నేరాలు పెరిగాయి : డీజీపీ హరీష్కుమార్

