50 మంది చిన్నారులకు పునర్జన్మ - శస్త్రచికిత్సతో వినికిడి శక్తి కల్పించిన 'కిమ్స్ సవీరా' వైద్యులు
పుట్టుకతో వినికిడి కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు - కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో చేపట్టిన కోక్లియర్ ఇంప్లాంట్- శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైద్యులకు చిన్నారుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 10:09 PM IST
Cochlear Implant Surgeries for Hearing Impaired Children : పుట్టుకతో వినికిడి కోల్పోయిన చిన్నారులకు అనంతపురం కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఉచితంగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. చిన్నారులకు శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో, పిల్లలు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పుట్టుకతో పాటు ఇతర సమస్యలతో వినికిడి కోల్పోయిన చిన్నారులకు తిరిగి వినపడేలా కిమ్స్ సవీర చేస్తున్న కృషి అభినందనీయమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, డిప్యూటీ కలెక్టర్ సి. విష్ణు చరణ్ అన్నారు.
అంతర్జాతీయ వినికిడి దినోత్సవాన్ని పురుస్కరించుకొని కిమ్స్ సవీర క్లాకియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేయించుకున్న చిన్నారులతో నేడు(సోమవారం) ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శస్త్రచికిత్సలు చేయించుకున్న పిల్లలు ఎలా మాట్లాడగలుగుతున్నారు, సమాజంలో సగర్వంగా ఎలా నిలవగలుగుతున్నారు అనేది ఈ కార్యక్రమంతో బాగా స్పష్టమైందన్నారు. కిమ్స్ సవీర యాజమన్యాన్ని, వైద్యులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఉచితంగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు : అనంతరం కిమ్స్ సవీర కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డా.ఆర్. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ, “వినికిడి అనేది సమస్త ప్రాణికోటికి భగవంతుడు ఇచ్చిన ఓ అద్భుతమైన వరం. దాని సాయంతోనే మన చుట్టూ ఏం జరుగుతోందో కళ్లు మూసుకుని కూడా తెలుసుకోవచ్చు. మన మనస్సు ప్రతిస్పందించాలంటే కంటితో చూడాలి లేదా చెవులతో వినాలి. కొందరికి ఈ వినికిడి సామర్థ్యం పుట్టుకతోనే ఉండదు. అలాంటివారిని అలాగే వదిలేయకుండా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేయిస్తే, బ్రహ్మాండంగా వినగలగడమే కాకుండా, చక్కగా మాట్లాడే అవకాశం కూడా వస్తుంది.
ఈ శస్త్రచికిత్సలకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది. కానీ కిమ్స్ సవీరలో మాత్రం డా. ఎన్టీఆర్ వైద్యసేవ, ఈహెచ్ఎస్, అడిప్ లాంటి పథకాల ద్వారా వీటిని పూర్తి ఉచితంగా చేశాం. వాటితో పాటు రెండు సంవత్సరాల స్పీచ్ థెరపీ కూడా ఉచితంగా ఇస్తున్నాం. వీటివల్ల అప్పటివరకు మూగ, చెవిటివారుగా ఉన్న పిల్లలు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అనంతపురంలో ఈ తరహా ఆపరేషన్లు చేస్తున్న ఏకైక ఆస్పత్రి కిమ్స్ సవీరా ఒక్కటే" అని డా.ఆర్. రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు.
విజయవంతంగా 50పైగా శస్త్రచికిత్సలు : డా. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ కర్త డా. గంగాధర్ మాట్లాడుతూ, "2021లో ప్రారంభమైన ఈ శస్త్రచికిత్సలు ఇప్పటివరకు 50పైగా జరిగాయి. ఇందులో ఒక ఏడాది 8 నెలల వయసున్న పిల్లల నుంచి నాలుగేళ్ల 11 నెలల వయసున్నవారి వరకు అందరూ ఉన్నారు. వినికిడి లోపం ఉన్న పిల్లలకు ఈ శస్త్రచికిత్స చేయించకపోతే వాళ్లకు మాట రాకపోవడంతో సమాజంలో వారిని చిన్నచూపు చూస్తారు. ఉద్యోగాలురావు, మిగిలినవారితో కలిసి తిరగలేరు. జీవితాంతం ఆ వైకల్యం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. పిల్లలకు మాటలు రానప్పుడు వెంటనే ఆస్పత్రిలో చూపించాలి. అవసరమైతే ఇలాంటి చికిత్సలు చేయించాలని ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రపంచ వినికిడి దినోత్సవం లక్ష్యం." అన్నారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ సవీర సీఈఓ డా.పి.ఎస్. ప్రసాద్, సీఓఓ సి. సిద్దారెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రీషన్ డా. ఏ. మహేష్, రేడియాలజిస్ట్ డా. సి. దీపా, ఈఎన్టీ సర్జన్ డా. రోజా, అనెస్తీషీయా, క్రిటికల్ కేర్ హెచ్ ఓడి డా. రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఎక్మోపై 500 కి.మీ ప్రయాణం - కిమ్స్ ఐకాన్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
న్యుమోనియాతో ఇన్ఫెక్షన్ - మూడేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు

