ETV Bharat / state

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయితే - పాలమూరు పచ్చనిపైరే

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా సస్యశ్యామలమే - సీఎం రేవంత్ రెడ్డి పుట్టినగడ్డపై ప్రేమ కురిపిస్తారని ఆశగా చూస్తున్న ప్రజలు - 18 లక్షల ఎకరాలకు నీరందిస్తే పాలమూరు పచ్చనిపైరే

PALAMURU RANGAREDDY PROJECT
PALAMURU RANGAREDDY PROJECT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 4, 2026 at 9:16 AM IST

3 Min Read
Choose ETV Bharat

Pending Works in Palamuru Ranga Reddy Lift Irrigation Projects : సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో పుట్టినగడ్డ (మహబూబ్​నగర్​ జిల్లా)పై ప్రేమ కురిపిస్తారని నిధులు సమకూర్చి పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారని ఉమ్మడి పాలమూరు ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్‌ పనుల కారణంగా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు మాత్రం అందడం లేదు. ఇకనైనా ఈ ప్రభుత్వంలో పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నారు.

పాలమూరు-రంగారెడ్డి : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రధాన లక్ష్యం. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 18 ప్యాకేజీల్లో పనులను చేపట్టగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన వరకు రిజర్వాయర్లు పూర్తికావొచ్చాయి. ఉదండాపూర్‌తో కలిపి దాదాపు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఆయా పంపుహౌస్‌ల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా 3వ ప్యాకేజీలోని నార్లాపూర్‌-ఏదుల మధ్య గ్రావిటీ కాల్వ పూర్తయితే కర్వెన రిజర్వాయర్​ వరకు నీటి తరలింపు మార్గం సుగమం అవుతుంది.

నారాయణపేట-కొడంగల్‌ : నారాయణపేట - మక్తల్‌ - కొడంగల్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఊట్కూరు పెద్ద చెరువు నుంచి బాపూర్‌ వద్ద నిర్మించనున్న పంపుహౌస్‌ వరకు కాలువ పనులు, పంపుహౌస్‌ నిర్మాణ ప్రాంతంలో పైపులైను పనులు, భూత్పూర్‌-కాట్రేవుపల్లి, కానుకుర్తి గ్రావిటీ కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 560 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం : మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ) పరిధిలో రిజర్వాయర్లు ఉన్నా వాటి సామర్థ్యం కేవలం 4 టీఎంసీల లోపే ఉంది. దీని కింద దాదాపు 20 రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించినా ఆ అంశం ఏమాత్రం ముందడుగు పడలేదు. డిస్ట్రిబ్యూటరీలు, ఉప కాల్వలు నిర్మించాల్సిన అవసరమైతే ఉంది. ఇవి పూర్తయితే మరో 1.44 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది.

సమస్యలు అనేకం : సంగంబండ పరిధిలో మాగనూరు, మక్తల్, కృష్ణ, నర్వ మండలాలకు సాగునీరందించే ప్రధాన కాలువల నిర్మాణం పూర్తయ్యింది. కానీ ఇక్కడ అనేక పునరావాస సమస్యలు ఉన్నాయి.

  • కోయిలసాగర్‌ పరిధిలో 14 వేల ఎకరాలకు నీరు అందించేందుకు కొత్త కాలువ నిర్మించాల్సి ఉంది.
  • ఆర్డీఎస్‌ (రాజోలి బండ డైవర్షన్ స్కీం) ఆయకట్టు 85 వేల ఎకరాల లక్ష్యం కాగా ప్రస్తుతం అది సగమే పారుతోంది. తుమ్మిళ్ల ఎత్తిపోతలతో కొంత ఉపశమనం ఉన్నా రిజర్వాయర్ల నిర్మాణానికి ఏ మాత్రం ముందడుగు పడటం లేదు. దీనికోసం భారీగా భూసేకరణ చేయాల్సి ఉంది.
  • శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్సెల్బీసీ) సొరంగం పనులు ఇంకా 9.533 కిలో మీటర్ల పొడవునా కొండలను తవ్వాల్సి ఉంది.
  • రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పెండింగ్‌ పనులు, కానాయపల్లి ఆర్‌ఆర్‌ కాలనీ నిర్మాణం, కెనాల్‌ విస్తరణ, శంకరసముద్రంలో నిలిచిపోయిన పనులను చేపట్టాల్సి ఉంది.
  • ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో 18.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనేది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం. కొనసాగతున్న ప్రాజెక్టుల (ఆన్‌గోయింగ్‌) పరిధిలో ఇంకా 1.11 లక్షల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.07 లక్షల ఎకరాలు చేపట్టారు. ఇంకా 4,694 ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది.
  • కొత్తగా కృష్ణా, భీమాపై ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు జిల్లా సుసంపన్నంగా సస్యశ్యామలమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిధుల వరద పారించి పనులు పట్టాలెక్కించేలా చూడాలని పాలమూరు బిడ్డలు కోరుకుంటున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ - క్షేత్రస్థాయిలో పరిశీలన

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి : సీఎం ఆదేశాలు