ఇరాన్, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం
ఇరాన్, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ - ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు పాటించాలని సూచన

Published : March 1, 2026 at 6:14 PM IST
|Updated : March 1, 2026 at 10:53 PM IST
CM appeals to Gulf NRIs Over Precautionary Measures : పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటించాలని స్పష్టంచేశారు. ఈ మేరకు ఈ ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే తెలుగు ప్రజలను సుంరక్షితంగా రప్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. ఇరాన్తోపాటు గల్ఫ్ దేశాల్లోని తెలంగాణవాసుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుందని తెలిపారు. కేంద్రంతో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులని అప్రమత్తం చేసినట్లు వివరించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆకాంక్షించారు. యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసిన పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర… pic.twitter.com/InHG2AB4QR
— Telangana CMO (@TelanganaCMO) March 1, 2026
రాష్ట్ర ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం : భారత ఎంబసీలు, కాన్సులేట్తోనూ సంప్రదింపులు జరపాలని కోరారు. రాష్ట్రప్రజల భద్రతే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉంటున్న భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను ఎప్పటికప్పుడు దౌత్యకార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్వేదికగా కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ను విజ్ఞప్తి చేశారు.
బాధిత కుటుంబాల్లో ఆందోళన : ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రానికి చెందిన లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పలు రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతమంది కారు డ్రైవర్లుగా, మరికొందరు భవన నిర్మాణ కార్మికులుగా, ఇంకొంతమంది తోటపనులు చేసుకుంటూ జీవనభృతిని పొందుతున్నారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడ ఉపాధికోసం వెళ్లిన బాధిత కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారు దేశం కాని దేశంలో ఎలా ఉన్నారో అని టెన్షన్ పడుతూ పదే పదే వారికి కాల్స్ను చేస్తున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అందరూ క్షేమంగా ఉన్నామని చెబుతుండటంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేంద్రం చూడాలి : మరోవైపు పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు వ్యాఖ్యలు చేశారు. యుద్ధం దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేంద్రం చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో చాలామంది తెలంగాణ పౌరులు ఉన్నారని వివరించారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రజలు క్షేమంగా ఉండాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ప్రభుత్వం దృష్టికి తేవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. కేంద్ర, రాష్ట్ర సహకారంతో రాష్ట్రప్రజలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ ప్రతీకార దాడులు- దుబాయ్ బుర్జ్ ఖలీపాపై మిసైల్ ఎటాక్?

