పోలవరంలో పర్యటించిన చంద్రబాబు - జంట సొరంగాలు పరిశీలన
ఏలూరు జిల్లా పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన - పోలవరం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం - కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను పరిశీలించిన సీఎం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 3:26 PM IST
|Updated : January 7, 2026 at 3:42 PM IST
CM Chandrababu Visit to Polavaram : ఏలూరు జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4వ సారి పోలవరం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలవరం నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణ చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ నూ సీఎం పరిశీలించారు. ఎర్త్ కం రాక్ ఫీల్డ్- ECRF గ్యాప్-1, గ్యాప్-2 పనులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. పునరావాసం, నిర్వాసితుల సమస్యలపై సూచనలు చేశారు.
గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగినట్లు తెలిపాయి. 2014-19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72 శాతం జరిగాయి.
అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు కనీసం 2 శాతం పనులూ చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయాని కన్నా ముందే వీలైతే 2027 పుష్కరాల నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
CM Chandrababu at Polavaram: ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను సందర్శించారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు తుది దశకు చేరుకున్న డయాఫ్రం వాల్ పనుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో భాగమైన జంట సొరంగాలను సీఎం పరిశీలించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆరేడు ఏళ్లు ఆలస్యమైందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. గత పాలకుల నిర్వాకంతో డయాఫ్రం వాల్ నిర్మాణానికే అదనంగా వెయ్యి కోట్లు ఖర్చవుతోందన్నారు. విపత్తులు దృష్టిలో ఉంచుకుని నిపుణుల సూచనల ప్రకారం కొత్త డయాఫ్రం వాల్ కడుతున్నామన్నారు. ఫిబ్రవరి 15 కల్లా డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు.
అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిసరాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని గత నెలలో జిల్లాలోని గొల్లగూడెం పర్యటనలో సీఎం ప్రకటించారు. ప్రస్తుతం పోలవరం డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. భారీ యంత్రాలతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
పోలవరం-నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో వాదనలు - విచారణ 12కి వాయిదా
పోలవరం-నల్లమలసాగర్పై సుప్రీంకోర్టులో విచారణ - తెలంగాణ రిట్ పిటిషన్పై సందేహాలు

