హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సీఎం - బాలికకు ధ్రువపత్రం అందజేత
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం - 14-15 ఏళ్ల బాలికలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచన - తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 9:50 AM IST
|Updated : March 1, 2026 at 10:49 AM IST
CM Chandrababu Vizianagaram Tour : రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు బాలికలంతా హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన చర్యలు చేపడతామన్న సీఎం, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. ఐదేళ్లూ అడ్డగోలు తప్పులు చేసిన వైఎస్సార్సీపీ వాటిని కూటమి ప్రభుత్వం పైకి నెడుతోందని మండిపడ్డారు. అలాంటి వారిని సమాజం ముందు దోషులుగా నిలబెడతామని ప్రకటించారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు డిసెంబర్ నాటికి అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించారు. తొలుత చీపురుపల్లి చేరుకున్న చంద్రబాబు అక్కడ హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఓ బాలికకు వ్యాక్సిన్ ఇవ్వడాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఆమెకు ధ్రువపత్రం అందించారు. ఆ తర్వాత బాలికలతో మాట్లాడారు. వ్యాక్సినేషన్ గురించి వారికి సూచనలు చేశారు.
అన్నీ సరిచేసి, సర్వే చేసి డిసెంబర్కి పాసు పుస్తకాలు:
అనంతరం రావివలసలో నిర్వహించిన ప్రజావేదికకు హాజరయ్యారు. 14 నుంచి 15 మధ్య వయసున్న బాలికలు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. అప్పుడే సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందన్నారు. డిసెంబర్ నాటికి భూములన్నీ సర్వే చేసి అందరికీ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
''హెచ్పీవీ వ్యాక్సిన్కు మాములుగా అయితే రూ.4,000 ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని రూ.4 వేలకు కొని, అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంది. 14 నుంచి 15 ఏళ్ల బాలికలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి. రాబోయే రోజుల్లో క్యాన్సర్తో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే ప్రతి ఆడబిడ్డకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎంత ఖర్చు అయినా వ్యాక్సిన్ ఉచితంగా అందించే బాధ్యత తీసుకుంటోంది. పిల్లలకు జీవితంలో ఎప్పుడూ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి.'' - సీఎం చంద్రబాబు
ఆడబిడ్డల జోలికొచ్చిన వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని మరోసారి చంద్రబాబు హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి మత్తులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. దేవుడికి ద్రోహం చేసిన వైఎస్సార్సీపీ నాయకుల్ని క్షమిస్తే మరింత రెచ్చిపోతారన్న సీఎం వాళ్లను ప్రజల ముందు దోషిగా నిలబెడతామని స్పష్టం చేశారు.
''భూముల రికార్డులన్నీ తారుమారు చేశారు. మీ భూమిని వారికి ఇవ్వమని దౌర్జన్యం చేశారు. ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిగా మార్చేశారు. డిసెంబర్కి అన్నీ భూములు సర్వే చేసి రాజముద్రతో పాసు పుస్తకాలు అందజేస్తాం. దేవుడికి ద్రోహం చేసిన వైఎస్సార్సీపీ నాయకుల్ని వదలం. సమాజం ముందు దోషులుగా నిలబెడతాం.'' - సీఎం చంద్రబాబు
అనంతరం పైలపేటలో రొంగళ ఎల్లయ్య అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లి సీఎం పింఛన్ అందించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, సంతానం, వృత్తిపై ఆరా తీశారు. ఇల్లు కట్టించి ఇవ్వాలన్న ఎల్లయ్య దంపతుల వినతికి సానుకూలంగా స్పందించారు. ఇంటి బాధ్యతను కలెక్టర్ రామసుందర్రెడ్డికి అప్పగించారు.
దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్- క్యాన్సర్కు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకాలు - తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి

