వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో చేశారు: సీఎం చంద్రబాబు
తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో లఘు చర్చ - 'మహాపాపం' పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించిన సీఎం చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 2:53 PM IST
|Updated : February 24, 2026 at 6:15 PM IST
CM Chandrababu Speech in Assembly: వైఎస్సార్సీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో సీఎం మాట్లాడుతూ 'మహాపాపం' పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వైఎస్సార్సీపీ నేతలు ఒక లడ్డూ విషయంలోనే కాదు అనేక విషయాల్లో తప్పు చేశారని కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.
2019-24 మధ్యకాలంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో చేశారని సీఎం అన్నారు. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యి వినియోగించారని ఇంక రూ.234.51 కోట్ల నిధుల అక్రమాలు జరిగాయని వివరించారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని ల్యాబ్లకు కన్నుకప్పి టెండర్లు దక్కించుకున్నారని వెల్లడించారు. 23.01.2026న సీబీఐ ఛార్జిషీట్ వేసిందని తెలిపారు. ఇంక కల్తీ నెయ్యి తయారీకి చాలా రసాయనాలు వాడారని అన్నారు. మోనో గ్లిసరైడ్స్, లాక్టిక్ యాసిడ్ యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, రంగు కోసం బీటా కెరాటిన్, వాసన కోసం ఎపిటిక్ యాసిడ్ ఈస్టర్, నెయ్యిలా కనిపించడానికి సింథటిక్ ఫ్లేవర్, నురుగు రావడానికి లబ్సా యాసిడ్ డిజర్టెంట్లో వాడతారని సీఎం వివరించారు.

రాజకీయ వివాదం ఉండకూడదని సిట్ ఏర్పాటు: రాజకీయ వివాదం ఉండకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్ ఏర్పాటు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. సీబీఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిందని అలానే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు పంపించిందని వెల్లడించారు. అందుకే ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించామని అన్నారు. లడ్డూ వ్యవహారంలో కాకుండా అనేక విషయాల్లో తప్పులు చేశారని ఒక పద్ధతి ప్రకారం లాలూచీ పడిన లూటీ అని స్పష్టంగా తేలిందని చెప్పారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా రిపోర్టును తొక్కిపెట్టారని వెల్లడించారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తాను సొంతంగా ఏమీ చెప్పలేదు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టునే చెప్పానని ఆ భగవంతుడే నాతో చెప్పించాడని సీఎం చంద్రబాబు అన్నారు.

వారికి అనుగుణంగా నిబంధనలన్నీ సడలించారని రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారని సీఎం చంద్రబాబు అన్నారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారని అలానే రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ 8 టన్నులకు తగ్గించారని తెలిపారు. డెయిరీల వార్షిక టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పరిమితం చేశారని వెల్లడించారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చి ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారని మండిపడ్డారు.

వారికి తెలియకుండా జరుగుతాయా: పోమిల్ జైన్, విపిన్ జైన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రధాన సూత్రధారులని సీఎం వివరించారు. నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలు ఏఆర్ డెయిరీ ఫుడ్స్, శ్రీవైష్ణవి డెయిరీ, మాల్ గంగా మిల్క్ డెయిరీ అని భోలే బాబా డెయిరీకి షెల్ కంపెనీలు సహకరించాయని తెలిపారు. లంచం డబ్బుతో చిన్నప్పన్న దొరికిపోయారని ఈ కల్తీ నెయ్యి సరఫరాదారులకు చిన్నప్పన్న సహకారం అందించారని చెప్పారు. తప్పుడు రిటర్నులతో బురిడీ కొట్టించి ల్యాబ్ నివేదిక ఫోర్జరీ చేశారని వివరించారు. ఇన్ని జరిగితే టీటీడీ బోర్డు ఈవో, ఛైర్మన్కు తెలియకుండా జరుగుతాయా అని ప్రశ్నించారు. ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరూ నాణ్యత తగ్గిందని చెప్పారని సీఎం తెలిపారు.

రాజమహేంద్రవరం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం - అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఏఐ సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన దారుణం: సీఎం చంద్రబాబు

