పంట కొనుగోళ్లలో రైతులకు లాభదాయక ధరలు కల్పించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్ల పై సీఎం సమీక్ష - మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటల ధరలు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2026 at 10:18 PM IST
CM Chandrababu Review on Crop Purchases: రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్ల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించేటటువంటి పంటలకు లాభసాటి ధరలు దక్కే విధంగా చూడాలని అధికారులకు చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ విధానం ద్వారా పంటలకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంటుందని చంద్రబాబు సూచించారు. ఈ ఏడాది 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వస్తుందని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. అందుకు బదులిస్తూ రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులకు అధికారులంతా సమష్టి కృషి చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. అంతేకాకుండా ప్రకృతి సేద్యం విధానంలో వివిధ పంటలను పండించటం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు.

