వైద్యారోగ్యానికి అధిక ప్రాధాన్యం - క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడాలి : సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - కలెక్టర్లు, అధికారులతో సమీక్షలో బాధితులకు సాయంపై ఆరా, గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవని నిలదీత, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 8:12 AM IST
|Updated : February 27, 2026 at 2:41 PM IST
CM Chandrababu Review on Rajamahendravaram and Srikakulam Incidents: ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలకు మీరు వెళ్తారా? నన్ను వెళ్లమంటారా? అంటూ సీఎం చంద్రబాబు అధికారులను నిలదీశారు. గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవన్న సీఎం క్షేత్రస్థాయికెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలని హితబోధ చేశారు.
శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధితులకు వైద్య సాయం, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఘటన జరిగాక స్పందించడం కాదు, ముందస్తు పర్యవేక్షణ అవసరమని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రజల్లో ఉంటేనే సమస్యలు తెలుస్తాయని వెల్లడించారు. వైద్యారోగ్యపై సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
బాధితుల వైద్య సాయం పై సీఎం ఆరా: శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనల నేపథ్యంలో పురపాలిక, వైద్యారోగ్యశాఖలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న రెండు జిల్లాల కలెక్టర్లను బాధితులకు అందుతున్న వైద్య సాయం గురించి ఆరా తీశారు. శ్రీకాకుళంలో 129 మంది డయేరియా బాధితులకుగాను ప్రస్తుతం 107 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, 20 మంది డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సీఎం చంద్రబాబుకు వివరించారు.
పరిస్థితిని సీఎంకు వివరించిన అధికారులు: అయితే తాజా పరిస్థితిని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అందుకుగాను 4 ఇంజినీరింగ్ బృందాలు తాగునీటి పైపుల లీకులకు మరమ్మతులు చేశాయని, 150 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నామని వివరించారు. తాగునీటి పైపులైన్లు కాలువలు క్రాస్ అవడం సహా వివిధ కారణాలతో కలుషిత నీరు ఇళ్లకు చేరిందని పలువురు అధికారులు సీఎంకు వివరించారు. రాజమహేంద్రవరంలో కల్తీపాల వల్ల ఇంకా 15 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ కీర్తి తెలిపారు.
అదే విధంగా కల్తీ పాలు తాగిన 957 మందిని రోజూ పరీక్షిస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. విషాద ఘటనలు జరిగాక స్పందిస్తే పెద్దగా ఉపయోగం ఉండదని, ముందస్తు పర్యవేక్షణ, అప్రమత్తతతోనే నివారించొచ్చని రెండు జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అధికారులు నిత్యం ప్రజల్లో ఉంటనే, అనుకున్న మార్పు చూపించగలమని సీఎం అన్నారు. అధికారులతో కలిసి కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు.
ఏపీ వ్యాప్తంగా ఆహార తనిఖీలు! అధికారులు ప్రతి ప్రభుత్వ విభాగంలో కింది స్థాయి యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసేందుకుక్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఆకస్మిక తనిఖీలతో మంచి ఫలితాలే గాక, సంబంధిత శాఖల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. ముందుస్తు పర్యవేక్షణ, తనిఖీలు జరిగి ఉంటే శ్రీకాకుళంలో డయేరియా ప్రబలేది కాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తాజా ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీలు చేస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
అశ్రద్ధ వహిస్తే మీరే బాధ్యులన్న సీఎం: మరోవైపు మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితమైతే కమిషనర్లను ఉపేక్షించేది లేదని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ తేల్చి చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైపులైన్లు తనిఖీ చేయాలన్న ఆయన అశ్రద్ధ వహిస్తే మున్సిపల్ కమిషనర్లు, క్షేత్రస్థాయి సిబ్బందినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.
అంతేకాకుండా వార్డు, శానిటేషన్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని తెలిపారు. డ్రైనేజీల గుండా వెళ్తున్న తాగునీటి పైప్ లైన్లను వెంటనే మార్చేయాలని, డ్రైనేజీల్లో నీరు నిలవకుండా వెంటనే డీసిల్టేషన్ చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం - అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
శ్రీకాకుళంలో డయేరియా కేసులు - మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

