అమరావతికి చట్టబద్ధత కల్పించండి:సీఎం చంద్రబాబు
బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమివ్వండి - ఉపాధి హామీలో రాష్ట్ర వాటాకు వెసులుబాటు చూడండి - కేంద్ర హోం మంత్రి అమిత్షాకు సీఎం చంద్రబాబు వినతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 7:32 AM IST
CM Chandrababu Meets Amit Shah in Delhi: ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పోలవరం పర్యటన ముగించుకుని దిల్లీ వెళ్లిన సీఎం కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించుకున్నారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమిచ్చేలా చూడాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీలో రాష్ట్ర వాటాకు వెసులుబాటు చూడమని కోరారు.
అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించడం వల్ల రాష్ట్రంలో మరింత వేగంగా అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్లవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని అడిగారు. బుధవారం దిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాత్రి ఇక్కడి కృష్ణమేనన్ మార్గ్లోని హోం మంత్రి నివాసంలో అమిత్షాతో భేటీ అయ్యారు.
ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు: ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడిగా ఉన్న అమిత్షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి, తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. పరిపాలన అవసరాల దృష్ట్యా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో చేసిన మార్పుచేర్పుల గురించి అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు.
పూర్వోదయ పథకం కింద: గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన మౌలిక వసతులను పునరుద్ధరించడానికి మూలధన వ్యయం కోసం తగిన ఆర్థిక వనరులు కల్పించాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయంతోపాటు వేగంగా అనుమతులివ్వాలన్నారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరగా ఆమోదముద్ర వేసి నిధులు విడుదల చేయించాలని కోరారు.
పరిశ్రమల ఏర్పాటుకు: గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశామన్న సీఎం వామపక్ష ప్రభావితమైన ఆ ప్రాంత అభివృద్ధికి హోంశాఖ పరంగా తగిన నిధులు ఇవ్వాలని కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చేయూతనివ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు వివరించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చానంటూ అక్కడి పనుల పురోగతి గురించీ అమిత్షాకు సీఎం వివరించారు.
అమిత్షాను కలవడానికి ముందు చంద్రబాబు దిల్లీలోని తన అధికార నివాసం 1-జన్పథ్లో ఎల్జీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శ్రీసిటీలో ఆ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమ పురోగతి గురించి వారు చర్చించారు. అర్ధరాత్రి దాటాక ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలు ముగించుకుని అమరావతి చేరుకున్నారు.
పోలవరంలో పర్యటించిన చంద్రబాబు - జంట సొరంగాలు పరిశీలన
'మీ భూమి-మీ హక్కు' - రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా: సీఎం చంద్రబాబు

