పార్లమెంటులో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై బిల్లు పెట్టాలి: సీఎం చంద్రబాబు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం చంద్రబాబు - ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై భేటీలో చర్- ఇప్పటికే పార్లమెంటులో బిల్లు పెట్టాలని నిర్ణయించిన కేంద్రం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 10, 2026 at 12:47 PM IST
CM Chandrababu Naidu Meeting With Central Ministers in Delhi: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై చర్చించారు. ఇప్పటికే పార్లమెంటులో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించగా, అందుకు అనుగుణంగా కేబినెట్ నోట్ తయారీ జరుగుతుంది. బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో బిల్లు పెట్టాలని చంద్రబాబు అమిత్షాను కోరారు. దీనికి ముందే కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమైన సీఎం ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం కోరుతూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రత, వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయం విషయంలో పెండింగ్ అంశాలపై చర్చించారు.
అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా చూడాలని విన్నవించినట్లు సమాచారం. స్టాప్వర్క్ ఆర్డర్ వల్ల ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయని వివరించారు. పోలవరం కాలువల సామర్థ్యం పెంపుతో పెరిగిన వ్యయం రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ -2కి ఆర్థిక సహాయం అందించాలని, ఫేజ్-2లో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. ఈ పనులకు అదనంగా సుమారు రూ.32 వేల కోట్లు అవసరమని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. పోలవరం - నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు అంశంపై భేటీలో చర్చించారు. ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి సాంకేతిక, ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వీటితోపాటు ఏపీ-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదం పరిష్కరించాలని కోరారు. వంశధార నీటి వివాద ట్రైబ్యునల్ తుది నివేదిక గెజిట్లో ప్రచురించాలని, వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ-తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. నదీ జలాల పంపకానికి గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక చేపట్టిన చర్యలపై అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏపీకి వచ్చే దిగువ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని సీఎం తెలిపారు.
ఆరుగురు కేంద్రమంత్రులతో భేటీకానున్న చంద్రబాబు: దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరుగురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్, అమిత్ షా చర్చలో పాల్గొన్న సీఎం నిర్మలా సీతారామన్, శివరాజ్సింగ్, అశ్వినీ వైష్ణవ్తో భేటీకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఉదయం 11 గం.కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పలు అంశాల గురించి సీఎం చర్చించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో, మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్తో, సాయంత్రం 4 గంటలకు ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు అడ్డుపడే చట్టాలను సవరిద్దాం: సీఎం చంద్రబాబు
'జలం-మన బలం' - ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపడితే నీటి సమస్యే రాదు: మంత్రి నిమ్మల

