లేటరైట్ మైన్ వర్గీకరణలో మార్పులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ
లేటరైట్ మైన్ వర్గీకరణలో మార్పులపై కేంద్రమంత్రికి సీఎం లేఖ - కేంద్రం తెచ్చిన మార్పులతో ఏపీకి వచ్చిన ఇబ్బందులు లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు - కేంద్ర నిర్ణయంతో గనుల లీజు ప్రక్రియ ఆగిందని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 2, 2026 at 7:40 PM IST
CM Chandrababu Letter To Central Minister Kishan Reddy Over Laterite Mines: లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం శాతం 20 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిపోయిందని తెలిపారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నిలిచిపోయిన వాటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూముల దరఖాస్తులు, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయని చంద్రాబాబు లేఖలో వివరించారు.
ఎంతో ఖర్చు చేశారు: అదే విధంగా పాత నిబంధనల మేరకు దరఖాస్తు రుసుం, భూముల కొనుగోళ్లు, అటవీ అనుమతుల కోసం వందలాది మంది దరఖాస్తుదారులు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని లేఖలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో మైకా, క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, బారైట్స్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చారన్నారు.
దీని ప్రకారం పెండింగ్లో ఉన్న 402 దరఖాస్తులను పాత రూల్స్ కిందనే ప్రాసెస్ పూర్తి 2 ఏళ్లు వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరారు. సడలింపు ఇస్తే వందలాది మంది దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టం తప్పుతుందని, కోర్టు వివాదాలు రావని లేఖ ద్వారా వెల్లడించారు. సేవింగ్ క్లాజ్ అమలు చేస్తే సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ పరిశ్రమలకు ముడిసరుకు కొరత లేకుండా ఉపాధి నిలబడుతుందని లేఖలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ - కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు
'మిర్చి రైతులను ఆదుకోండి' - కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

