వేసవిలో పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? - డేను ఇలా ప్లాన్ చేస్తే ఫోన్ అస్సలు ముట్టుకోరు!
సెలవుల్లో ఇంట్లో పిల్లలు అతిగా మొబైల్ చూస్తుంటే ఇలా చేయండి - దృష్టి మరల్చేలా తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్న నిపుణులు - పిల్లలతో కాసేపు సరదాగా గడపాలని సూచన

Published : May 18, 2026 at 4:31 PM IST
Summer Holidays Safety Tips for Parents : రాష్ట్రంలో వేసవి సెలవులు వచ్చి ఇప్పటికే 15 -20 రోజుల సమయం గడిచిపోయింది. ఎండల తీవ్రత నేపథ్యంలో బాల బాలికలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఉండి ఏమైనా చేస్తున్నారా? అంటే ఏమీ లేదు. వారు చేసేదల్లా ఒకే పని. వారంతా అత్యధిక సమయం సెల్ఫోన్కు అతుక్కుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో చరవాణి వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, మరో 25 రోజులు సెలవులు ఉండటంతో పిల్లల దృష్టి మరల్చేలా తల్లిదండ్రులు, కుటుంబీకులు పలు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అప్పట్లో కేవలం కాల్స్ మాట్లాడటానికే పరిమితమైన మొబైల్స్, ఇప్పుడు మాత్రం సర్వ సమాచారం అరచేతిలో అందించే సాధనంగా మారింది. ఈ క్రమంలో పిల్లల చేతికి ఫోన్ ఇస్తే కొన్నిసార్లు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదమూ ఉంది. వివిధ లింకుల ద్వారా బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్స్ రూపంలో సైబరాసురులు చిన్నారులను ఆకట్టుకోవచ్చు. అకౌంట్లో డబ్బును కాజేసే అవకాశం దృష్ట్యా మొబైల్ వాడకంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
మొబైల్తో నష్టాలివే! :
- పెరుగుతున్న స్క్రీన్ టైంతో ఎన్నో ఆరోగ్య మార్పులు
- అధిక కాంతి కారణంగా చూపులో స్పష్టత లోపిస్తుంది.
- నిద్రకు దూరం అవుతున్నారు.
- ఒత్తిడి హార్మోన్లు విడుదలై చక్కెర, రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- మెడ నొప్పితో పలువురు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం : వేసవి సెలవుల్లో పిల్లలు తమ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇదే మంచి సమయం అని నిపుణులు అంటున్నారు. ఇటీవల ప్రభుత్వం అన్ని చోట్ల నిర్వహిస్తున్న వేసవి శిబిరాలకు హాజరు కావొచ్చు. అక్కడ డ్యాన్సులు, డ్రాయింగ్, సాహిత్యం, ఇతర కళల వైపు అడుగేయాలి. ప్రస్తుతం ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పలువురు ఈ దిశగా అడుగులు వేస్తూ ప్రత్యేకతను చాటుతుండటం గమన్హారం.
10 ఏళ్లలోపు పిల్లలైతే ఇలా చేయండి : ఉదయం అరగంట సేపు అక్షరాలు, టేబుల్స్, కథలు తదితర వాటితో ఎంగేజ్ చేయడం, మధ్యాహ్నం డ్రాయింగ్, కథలు వినడం, చెప్పడం, క్రాఫ్ట్, కొద్ది సేపు నిద్ర, సాయంత్రం ఆటలు, పార్క్, స్నేహితులతో గడపడం, రాత్రి కుటుంబంతో గడిపేలా చూడాలి. అయితే వీటిని ప్రతిరోజు పాటించాలంటే తల్లిదండ్రులు తమ సమయాన్ని పిల్లలకు కేటాయించాల్సి ఉంటుంది.
పిల్లలతో కాసేపు సరదాగా : పిల్లలు కాస్త అల్లరి చేయగానే వారి ఏడుపు ఆపటానికి ఫోన్ చేతికి ఇస్తుంటారు. ఇలానైనా వారిని విసికించకుండా ఉంటారనే ఆలోచనతో తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు. కానీ పిల్లలు మాత్రం దీన్నే అవకాశంగా చేసుకొని ఏడ్చి మరీ మొబైల్ తీసుకోవాలని ఆలోచనా ధోరణి వారిలో పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా ఏడ్చినప్పుడల్లా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వకుండా, దాని నుంచి దారి మరల్చేలా చేయాలి. కేవలం ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించాలని పేర్కొంటున్నారు. ఇలా కొత్త విధానాన్ని అలవాటు చేస్తే మొబైల్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
సెలవుల్లో ఇలా చేయండి :
- ఆటలు, పాటలు, చదువుతో సంబంధం ఉండే అంశాలపై దృష్టి పెట్టేలా పిల్లలను ప్రోత్సహించాలి.
- చిన్న చిన్న నీతి కథలు, ఇతర పుస్తకాలు చదివేలా కృషి చేయాలి.
- డ్రాయింగ్, డ్యాన్స్, సంగీతం, గార్డెనింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ తదితర వాటిలో ఆసక్తి ఉన్న దాన్ని ఎంచుకొని నేర్చుకునేలా ప్రోత్సహించాలి.
- కంప్యూటర్ బేసిక్స్, ప్రాజెక్టుల తయారీ, స్పోకెన్ ఇంగ్లీష్, ఫొటోగ్రఫీ తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలి.
- రోజు మొత్తం పిల్లలు సెల్ఫోన్ జోలికి పోకుండా ప్రత్యేక షెడ్యూల్ను ఏర్పాటు చేయాలి.
అరచేతిలో ఆధునిక అస్త్రం - కొత్త ఆపదలను మోసుకొస్తోన్న మొబైల్ ఫోన్
మీ పిల్లలు ఫోన్ వదలడం లేదా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

