ఐకానిక్ టవర్స్లో డీజీపీ ఆఫీసు - కానీ సీఎందే నిర్ణయం: మంత్రి నారాయణ
సచివాలయంలో పరిపాలనా భవనాల నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ - ఐకానిక్ టవర్ల నిర్మాణంపై చర్చ - శాఖలవారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించినట్లు మంత్రి నారాయణ వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 5:13 PM IST
Cabinet Sub Committee meet on Construction of Administrative Buildings: పాలనా యంత్రాగం మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ఐకానిక్ టవర్స్లో డీజీపీ కార్యాలయం ఉండాలా, విడిగా ఉండాలా అనే దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ వీరాంజనేయ స్వామి, బీసీ జనార్థన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయ్యింది. ఐకానిక్ టవర్ల నిర్మాణంపై చర్చించింది.
శాఖల వారీగా ఉద్యోగుల బట్టి వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ తొలుత అంచనా వేశామని వెల్లడించారు. 39,852 మంది ఉద్యోగులు అంచనా ఉందని అన్నారు. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని సీఎస్ను కోరామని తెలిపారు. వచ్చే సమావేశంలో వర్క్ స్పేస్పై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
''శాఖలవారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించాం. తొలుత 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశాం. శాఖలవారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని సీఎస్ను కోరాం. వర్క్ స్పేస్పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఐకానిక్ టవర్స్లోనే డీజీపీ ఆఫీసు ఉండాలా అనేదానిపై సీఎం చంద్రబాబుదే నిర్ణయం. డీజీపీ ఆఫీసు విడిగా ఉండాలా అనే దానిపై సీఎం నిర్ణయిస్తారు.'' - నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ: సీఅర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సచివాలయంలో గురువారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. భూ సమస్యల పరిశీలన, రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం తదితర అంశాలపై చర్చించారు. అమరావతిలో గతంలో వివిధ సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని మంత్రులు మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రారంభించలేని సంస్థలు, అదనపు స్పేస్ కోరిన వాటిని పరిశీలించి వాటికి క్లియరెన్స్లు ఇచ్చామని తెలిపారు. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా బ్యాంకులు, వివిధ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలకు చెందినవి ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో మొత్తం 22 అంశాలపై చర్చ జరిగిందని, వీటిలో 7 కొత్త ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రులు వెల్లడించారు.
వేగంగా నిర్మాణ పనులు : మరోవైపు అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకున్న సంగతి తెలిసిందే. రాజధానిలో ఏ వైపు చూసినా వేల మంది కార్మికులు, వాహనాలు, యంత్రాలు, భారీ నిర్మాణ సామగ్రి దర్శనమిస్తున్నాయి. రాజధాని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, ట్రంక్ రోడ్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జిలు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీసు అధికారుల భవన సముదాయాల పనులు వేగంగా జరుగుతున్నాయి. దానితోపాటు మరో వైపున రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధికీ శరవేగంగా ఎల్పీఎస్ లేఔట్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న లేఔట్లలో జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు రోడ్లు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు చేసే పనులను చేస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
అమరావతిలో భూకేటాయింపులపై 22 అంశాలపై చర్చ - 7 కొత్త ప్రతిపాదనలు

