రూ.1208.41 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం - మంత్రివర్గ కీలక నిర్ణయాలివే
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం - ఉద్యోగ, మౌలిక వసతులు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు - దాదాపు 41 అజెండా అంశాలకు ఆమోదం

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 30, 2026 at 3:05 PM IST
|Updated : April 30, 2026 at 8:00 PM IST
Cabinet Meeting Chaired by CM Chandrababu: ఉద్యోగ, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల వంటి అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దాదాపు 41 అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యూవల్, అద్దె నిర్ణయ విధానాల సవరణలకు అలానే అమరావతిలో పలు కీలక నిర్మాణాలకు సంబంధించి క్యాబినేట్ పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు.
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో చీఫ్ కోర్ట్ మేనేజర్, సీనియర్ కోర్ట్ మేనేజర్లు, కోర్ట్ మేనేజర్లతో కలిపి 21 కొత్త పోస్టులు సృష్టికి ఆమోదం లభించింది. దిల్లీలోని ఏపీ భవన్లో అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఇన్సిటిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈటీసీ శిక్షణ కేంద్రాల్లో 20 పోస్టులు (6 రెగ్యులర్, 14 అవుట్ సోర్సింగ్) సృష్టించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
దిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం: అదనంగా మరో 9 ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు రూ.354 కోట్ల మేర పాలనా అనుమతులకు క్యాబినెట్ ఆమోదించింది. ఏపీ మార్క్ఫెడ్కు రూ.1800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు అలానే దిల్లీలో 11.5 ఎకరాల్లో రూ.124.50 కోట్ల అంచనాతో కొత్త ఏపీ భవన్ నిర్మాణ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. నెల్లూరు, కాకినాడ, కర్నూలు, కడప ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాజెక్ట్ విలువపై 2 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనకు ఇంక కృష్ణా నది తీర రక్షణ పనులకు రూ.443.26 కోట్లతో 3 ప్యాకేజీలకు సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్లు వ్యయం చేసేందుకు మంత్రివర్గం అమోదం తెలిపింది. సచివాలయ, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు గానూ రూ.2540 కోట్ల వ్యయం చేసేందుకు, రాష్ట్ర శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు గానూ రూ.798 కోట్లను వ్యయం చేసేందుకు ఆమోదం లభించింది. ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలను చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్ చేసేందుకు రూ.1180.54 కోట్ల మేర పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.
పెన్షన్ మంజూరు నిబంధనల్లో మార్పు: 2వ దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనల్లో మార్పు చేసేందుకు అమోదం తెలిపింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేల చొప్పున, జరీబుకు రూ.60 వేలకు కౌలును పెంపుకు అలానే ప్రతీ ఏటా మెట్ట భూములకు రూ.3 వేల చొప్పున, జరీబు భూములకు రూ.5 వేల చొప్పున పదేళ్ల పాటు పెంచెందుకు ఆమోదం లభించింది. వివిధ సంస్థలకు భూములను కేటాయించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరులు, రెవెన్యూ, రవాణ శాఖలకు సంబంధించి పరిపాలనా అనుమతులు, సేవల మెరుగు ప్రతిపాదనలకు ఆమోదించిందని మంత్రి కేశవ్ వెల్లడించారు.
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కీలక అడుగు - ఏపీలో 20 లక్షల ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం
సచివాలయాల పేరు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్పు - కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే!

