కర్నూలు జిల్లాలో 'రైల్ ఓవర్ రైల్' - రూ.350 కోట్లతో నిర్మాణానికి చర్యలు
మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు పైవంతెన - సుమారు పది కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణానికి ముమ్మరంగా సర్వే చర్యలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 2:01 PM IST
Bypass for Railway Line in Kurnool Its Construction at Cost of ₹350 Crore : కర్నూలు జిల్లాలోని చిప్పగిరి మండలంలోని మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు పైవంతెన (రైల్ ఓవర్ రైల్) నిర్మాణానికి రూ.350 కోట్లు మంజూరయ్యాయి. సుమారు పది కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణానికి ముమ్మరంగా సర్వే చర్యలు చేపట్టారు. పైవంతెన పూర్తయితే బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణం సులభతరం కానుంది. పైగా గుంతకల్లు స్టేషన్లోకి వెళ్లే రైళ్లకు ఆటంకాలు తప్పనున్నాయి.
ప్రస్తుతం బళ్లారి, ఆదోని, డోన్, గుత్తి మార్గాల నుంచి వచ్చే రైళ్లు, గూడ్సులు ఒకే మార్గం నుంచి స్టేషన్లోకి రావాల్సి ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. పైవంతెన నిర్మాణంతో బళ్లారి, ఆదోని, డోన్ మార్గం నుంచి వచ్చే కొన్ని రైళ్లు, గూడ్సులు స్టేషన్లో రాకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఇలాంటి వంతెనను గూడూరులో నిర్మించారు. విజయవాడ వద్ద మరొకటి నిర్మాణంలో ఉంది. గుంతకల్లులో నిర్మిస్తే మూడోది అవుతుంది.
రైళ్లలో తరచూ చోరీలు - ప్రయాణికులకు ఇబ్బందులు : దేశంలోని ప్రధాన నగరాల నుంచి గుంతకల్లు రైల్వే జంక్షన్కు రోజూ 58 ఎక్స్ప్రెస్, సూపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు వస్తుంటాయి. వీటితోపాటు వందకు పైగా గూడ్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. స్టేషన్లో ఏడు ప్లాట్ఫారాలు ఉన్నాయి. గూడ్సులు స్టేషన్లోకి రావడం ద్వారా ప్లాట్ఫారాలు ఖాళీలేక రైళ్లను స్టేషన్ బయట గంటల తరబడి నిలపాల్సి వస్తోంది. ఫలితంగా ఆలస్యం కావడమేకాక రైళ్లలో తరచూ చోరీలు జరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ బైపాస్ రైల్వే మార్గాలతోపాటు రైల్ ఓవర్ రైల్ వంతెన నిర్మాణాలతో పరిష్కారం చూపొచ్చని రైల్వే ఇంజినీర్లు నివేదికలు సమర్పించారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు తీరుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
కర్నూలు నగరం చుట్టూ ఓఆర్ఆర్ - ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు
ఇదిలా ఉండగా మరోవైపు కర్నూలు నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఇబ్బంది ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కువగా ఉంటుంది. వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బస్సులు, భారీ వాహనాలు రింగ్రోడ్డులో వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో భారీ వాహనాలు తిరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీటిని నేరుగా బైపాస్ రోడ్డుపై వెళ్లే విధంగా ప్రణాళిక చేపట్టారు. దీనిలో భాగంగా నగరం చుట్టూ రింగ్రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. బస్సులు, భారీ వాహనాలను సైతం బైపాస్ రోడ్డు నుంచి నేరుగా రింగ్ రోడ్డుకు అనుసంధానం విధానం అధికారులు నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నగరపాలక, ఆర్అండ్బీ అధికారులు రింగ్రోడ్డు నిర్మించేందుకు అనుకూలమైన నిర్మిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ పనులు గనక వేగంగా పూర్తి అయితే నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు కొంత మేర తీరుతాయి
రింగ్ రోడ్డుకు మాస్టర్ ప్లాన్: నగరంలో ట్రాఫిక్ రద్దీ వల్ల వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే గనక రోజువారీ వృత్తిరీత్యా పనులకు వెళ్లే వారికి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. రానున్న రోజులను దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలను అధికారులు రంగం సిద్ధం చేశారు.
మాస్టర్ ప్లాన్ ఆధారంగా 200 అడుగుల వెడల్పుతో 17 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు ఏర్పాటుకు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే నగరపాలక, ఆర్అండ్బీ అధికారులు రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. 3 నెలల్లో డీపీఆర్ తయారు చేయనున్నారు. రింగ్ రోడ్డు ప్రతిపాదిత ప్రాంతంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయో అధికారులు అంచనా వేయనున్నారు. నిధులు మంజూరు అయితే పనులు ప్రారంభిస్తారు.
ఎన్హెచ్-16లోకి వెస్ట్ బైపాస్ ? - ఆర్అండ్బీ పరిధిలోకి 40 కిలోమీటర్ల రహదారి

