బ్రెయిన్ డెడ్తో మృతి చెంది నలుగురికి ప్రాణదాతగా నిలిచిన బాలింత
23 రోజుల కిందటే ప్రసవం - అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి బ్రెయిన్ డెడ్ - అవయవదానంతో నలుగురికి పునర్జన్మ - అసిఫాబాద్లోని ఓ బాలింత మానవతా దృక్పథం

Published : February 27, 2026 at 5:27 PM IST
Mother Organ Donation After Die : బ్రెయిన్ డెడ్తో 23 రోజుల కిందటే బిడ్డకు జన్మనిచ్చిన ఓ బాలింత మృతి చెందింది. కానీ అవయవ దానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చి అమ్మ మనసు చాటుకుంది. ఈ ఘటన అసిఫాబాద్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని జన్కాపుర్కు చెందిన గుండు నాగరాజ్కు 2018లో సృజన (34)తో వివాహమైంది. వీరికి అద్విక్ అనే అయిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా 23 రోజుల కిందటే మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓ రోజు అకస్మాత్తుగా స్పృహ తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయిదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించిన తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్దరించారు. దీంతో కుటుంబీకుల అంగీకారంతో సృజన అవయవాలను దానం చేశారు. నెల కూడా నిండని పసికందు, అయిదేళ్ల కుమారుడు అమ్మ చితికి నిప్పు పెట్టిన ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
అకస్మాత్తుగా స్పృహ తప్పి : జన్కాపుర్కు చెందిన గుండు నాగరాజ్ ఉద్యోగ నిమిత్తం మూడేళ్లుగా దుబాయ్లో ఉంటున్నారు. గర్భిణిగా ఉన్న సృజనను ప్రసవం కోసం మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉన్న ఆమె తల్లిగారింటికి పంపించారు. 23 రోజుల కిందట సృజనకు బాబు పుట్టాడు. భార్య కాన్పు కోసమని నాగరాజ్ దుబాయ్ నుంచి మందమర్రికి వచ్చి, 11 రోజుల పాటు భార్యా పిల్లలతో గడిపి, దుబాయ్కి తిరిగి వెళ్లారు. ఓ రోజు తలనొప్పితో సృజన ఉన్నట్లుండి స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మంచిర్యాలలోని ఓ హాస్పిటల్కు తరలించారు. కానీ సృజన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయిదు రోజులు ఐసీయూలో చికిత్స అందించిన డాక్టర్లు సృజన బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్దరించారు.
దుబాయ్ నుంచి వచ్చి : సృజన పరిస్థితి గురించి డాక్టర్లు, జీవన్ధాన్ ఆర్గాన్ డోనర్ సంస్థ ప్రతినిధులు అవయవదానం గురించి బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో ఆమె భర్త నాగరాజ్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చి అవయవదానానికి అంగీకరించారు. ఈ మేరకు సృజనకు సంబంధించిన ఊపిరితిత్తులు, రెండు కిడ్నీలు, కాలేయాన్ని వైద్యులు సేకరించారు. అవసరమైన వారికి ఆ అవయవాలను అందించారు.
చిన్నారులను చూసి కన్నీరుమున్నీరు : అంత్యక్రియలు చేసేందుకు సృజన మృత దేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు గురువారం జన్కాపుర్కు తీసుకొచ్చారు. దీంతో గ్రామస్థులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. 23 రోజుల పసికందును, అభం శుభం తెలియన అయిదేళ్ల కుమారుడు తల్లి చితికి నిప్పు పెట్టడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్థులతో పాటు జీవన్దాన్ ప్రతినిధులు, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, జీవన్దాన్ ప్రతినిధులు, కార్యదర్శి లింగమూర్తి, సభ్యులు నూక సురేష్, భీష్మాచారి, సానా రామకృష్ణారెడ్డి, ఆసు, రాంరెడ్డి, తదితరులు విషాదంలోనూ బాధిత కుటంబ సభ్యులు చూపిన మానవతా దృక్పథాన్ని అభినందించారు.
ఆర్గాన్ డొనేషన్ చేయాలనుకుంటే : అవయవాలు దానం చేసేందుకు క్రమగా ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికి పలు సంస్థలు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వాసవి, లయన్స్, అలయన్స్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలకు అవయవ దానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో చాలామంది ఆర్గాన్ డొనేషన్కు ముందుకొస్తున్నారు. భవిష్యత్తులోనూ ఎవరైనా అవయవ దానం చేయాలని నిర్ణయించుకుంటే https://jeevandan.gov.in/వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డోనర్ కార్డును సంస్థ ఆన్లైన్లో అందిస్తుంది. హైదరాబాద్లో ఉన్నవారు నిమ్స్ హాస్పిటల్ ఉన్న జీవన్దాన్ సంస్థ ప్రతినిధులను నేరుగా సంప్రదించవచ్చు. అవయవ దానానికి సంబంధించిన సందేహాలను వారితో నివృత్తి చేసుకోవచ్చు.
మలుపులు తిరుగుతోన్న కుమ్మెర ఘటన - షాకింగ్ విషయాలు చెప్పిన పోలీసులు
చిన్న చిన్న కారణాలతో ఉసూరుమంటున్న ప్రాణాలు - ధైర్యం చెప్పేవారుంటే సరి

