అందరూ మోసం చేశారంటూ యువకుడి ఆవేదన - ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సప్ స్టేటస్ - కాసేపటికి డిలీట్ - ఉదయం వరకు మధురానగర్ రైల్వేగేట్ వద్ద రైలుపట్టాలపై మృతదేహం

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 1:39 PM IST
Auto Drive Suspects Death in Madhura Nagar of Vijayawada: 'నన్ను అంతా మోసం చేశారు, నాకు బతకాలని లేదు ఆత్మహత్య చేసుకుంటా' అంటూ ఓ యువకుడు సోమవారం రాత్రి సీపీ కార్యాలయం వద్ద హడావిడి చేశారు. విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి బందువులకు అప్పగించారు. మంగళవారం ఉదయం నగరంలోని మధురానగర్ రైల్వేగేట్ వద్ద రైలుపట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు, తరువాత మధురానగర్ కొబ్బరితోటకు చెందిన 29వ డివిజన్ తెలుగు యువత కార్యదర్శి చంద్రశేఖర్ (నాని)గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: విజయవాడలోని మధురానగర్ కొబ్బరితోటకు చెందిన చంద్రశేఖర్ (30) ఆటోడ్రైవర్గా పని చేసేవారు. సోమవారం రాత్రి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు విచ్చేసి తనను అందరూ మోసం చేసారని అత్మహత్య చేసుకుంటానంటూ హడావిడి చేశారు. సీపీ కార్యాలయం భద్రతా సిబ్బంది గమనించి సూర్యారావుపేట పోలీసులకు పిర్యాదు చేయగా వారు వచ్చి చంద్రశేఖర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులకు తనను అందరూ మోసం చేశారనే చెప్పినట్లు తెలిపారు. ఎవరు చేశారని పోలీసులు ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
పట్టాలపై శవం: ఆత్మహత్య చేసుకోవద్దంటూ ధైర్యమిచ్చారు. ఆ తర్వాత అతడ్ని బంధువులకు అప్పగించారు. బంధువుతో కలసి ఇంటికి బయలుదేరిన చంద్రశేఖర్ ఉదయమైనా ఇంటికి చేరుకోలేదు. అతడ్ని తీసుకువెళ్లిన బంధువు ఇంటి వద్ద వదిలేసినట్లు తెలిసింది. ఉదయం 7.45 గంటల సమయంలో మధురానగర్ రైల్వే లైనుపై చనిపోయి ఉండగా స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని గుర్తు తెలియని వ్యక్తిగా చేసి నమోదు చేశారు.
వాట్సప్ స్టేటస్ ఎవరు డిలీట్ చేశారు: ఆ తర్వాత అది చంద్రశేఖర్ మృతదేహమని గుర్తించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రశేఖర్ వాట్సాప్ స్టేటస్ తాను అత్మహత్య చేసుకుంటున్నానంటూ వీడియో పెట్టినట్లు మిత్రులు తెలిపారు. ఆ తరువాత కొద్ది సేపటికి అది డిలీట్ అయిందని, ఎవరు తొలగించాలనే దానిపై స్పష్టత లేదు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళ్లిన బంధువు మధురానగర్ రైల్వేలైను వద్ద వదిలిపెట్టారని అక్కడ నుంచి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టిందని బంధువులు అంటున్నారు. రైల్వే పోలీసులు కూడా ఇదే అంశంతో కేసు నమోదు చేశారు.

