కోనసీమ తరహాలో అనకాపల్లిలో కోడిపందేలకు ఏర్పాట్లు - పది వేలకు పైగా పందెం పుంజులు సిద్ధం
ఈ ఏడాది రాంబిల్లి మండలం వెంకటాపురంలో పందెం బరి ఏర్పాటు - ఆక్వా చెరువుల వద్ద, కొబ్బరితోటల్లో జాతి పుంజుల పెంపకం - పందేం కోళ్లకు ‘శాక’తీత

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 12:49 PM IST
Arrangements For Cockfights In Anakapalli District : సంక్రాంతి పండగ సమయంలో గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసే కోడిపందేల శిబిరాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. అక్కడి పందెం బరులను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా తరలివెళ్తారు. గోదావరి జిల్లాలకు దీటుగా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోనూ కోడి పందేల బరులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది పాయకరావుపేట, చోడవరం, పెందుర్తి, ఎలమంచిలి, నర్సీపట్నంలో శిబిరాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది భోగి నుంచి మూడు రోజులపాటు పగలు, రాత్రి తేడా లేకుండా పందాలు నిర్వహించారు.
కోనసీమ తరహాలో ఏర్పాట్లు : ఈసారి మరో అడుగు ముందుకేసి కోనసీమ తరహాలో బరులతోపాటు గ్రిల్స్, టెంట్లు ఏర్పాటు చేసి పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్ల పార్కింగ్కి మాత్రం ప్రత్యేకంగా స్థలాలను కేటాయిస్తున్నారు. గతేడాది ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం రామన్నపాలెం గ్రామంలో పందెం బరిని ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది మాత్రం రాంబిల్లి మండలం వెంకటాపురంలో పందెం బరిని ఏర్పాటు చేసి, కోడిపందేలు నిర్వహించాలని నిర్ణయించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో గత ఏడాది పందేలు నిర్వహించగా, ఈ ఏడాది పందేలను ఎస్.రాయవరం మండలానికి మార్చారు. కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటైన అడ్డురోడ్డులో ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇదేతరహా ఏర్పాట్లు సాగుతుండటంతో పందేల ప్రేమికులు ఈ ఏడాది భీమవరం వెళ్లే అవసరం లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పదివేలకు పైగా సిద్ధం: గతేడాది సంక్రాంతి పండగ సమయంలో పందేలకు సరిపడా కోళ్లు లభించలేదు. స్థానికంగా ఉన్నవి సరిపోకపోవడంతో కోనసీమ జిల్లాలకు వెళ్లి అధిక ధరలకు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా తగినన్ని కోళ్లు దొరక్కపోవడంతో కనుమ పండగ రోజున శిబిరాల్లో జనాల సందడి అంతగా కనిపించలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం జిల్లాలో పదివేలకు పైగా పందెం పుంజులు పెంచి వాటికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారని అంచనా. గత వారం రోజులుగా వీటి అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. జాతి పుంజులు ఒక్కొక్కటి రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ప్రత్యేక శిబిరాలు : పందెం కోళ్ల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి పందెం పుంజులను పెంచుతున్నారు. ఆక్వా చెరువుల వద్ద, కొబ్బరితోటల్లో జాతి పుంజుల పెంపకానికి కేంద్రాలుగా ఉన్నాయి. మరికొందరు ఇళ్ల వద్దే పుంజులను పెంచుతున్నారు. అయితే రంగును బట్టే కోడి ధర ఉంటుంది. ఏక రంగుగా పిలిచే కోడి డేగ, కాకి నెమలి, కోడి కాకి రంగులకు ధర ఎక్కువగా ఉంది. ఒక్కో రకం పుంజు ఖరీదు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు పలుకుతోంది. బర్మా, పెరూ పుంజులు కంటే ఇక్కడి వాటికి పౌరుషం ఎక్కువ కావడంతో ఎక్కువగా కొనుగోలు అవుతాయని పందెం ప్రియులు తెలిపారు.
పందేం కోళ్లకు ‘శాక’తీత: పోటీలో ఉన్నప్పుడు అవతలి కోడి పొడిచే కత్తిపోట్లు, కాలిగోటి దెబ్బలకు నొప్పి తెలియకుండా ఉండేందుకు పందేం శరీరాన్ని సిద్ధం చేసేందుకు నీళ్లపోతలు ‘శాక’లు తీస్తారు. వీటితో కోళ్ల శరీరం గట్టి పడి, దెబ్బ తగిలినా నొప్పి తెలియక పోరాడుతూనే ఉంటాయి.
కోడి పందాలకు 110కి పైగా బరులు - హోటళ్లు, లాడ్జీల కంటే గదులకేే డిమాండ్
విశాఖలో నేటి నుంచి 'లైట్హౌస్ ఫెస్టివల్' - రెండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు

