ETV Bharat / state

నదీ జలాలపై రాజకీయాలు చేయొద్దు - తెలంగాణ నేతలను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు

ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు - గోదావరి నదిలో పుష్కలంగా ఉన్నందున పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదన్న ఏపీ సీఎం - రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి

AP CM Chandrababu on Polavaram Project
AP CM Chandrababu on Polavaram Project (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 7:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

AP CM Chandrababu on Polavaram Project : గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని తెలిపారు. నదీ జలాలపై రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నానని అన్నారు. దేవాదుల, కల్వకుర్తి తానే ప్రారంభించానని ఆర్డీఎస్‌లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్‌నగర్‌కు ఇచ్చామని వెల్లడించారు. గతంలో హైదరాబాద్‌లో వారానికి ఒకసారి నీరు వచ్చేవని, సాగర్‌ నుంచి నీళ్లు తెచ్చి హైదరాబాద్‌కు ఇచ్చామని అన్నారు. తాము చేసిన పనుల వల్ల హైదరాబాద్‌ అన్నింటికీ అనుకూలంగా ఉందని, ప్రస్తుతం దేశంలోనే అత్యంత జీవన అనుకూల నగరంగా హైదరాబాద్ మారిందని స్పష్టం చేశారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, అలాంటిది పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని చెప్పారు. మిగిలిన నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని పోటీపడి మాట్లాడటం సరికాదని, అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలని సూచించారు.

పోలవరం గ్యాప్‌-1లో పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్యాప్‌-2లో అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరంలో చంద్రబాబు బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో పోలవరం నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్​తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి వివరించారు.

నదీ జలాలపై రాజకీయాలు చేయొద్దు - తెలంగాణ నేతలను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు (ETV)

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పట్టిసీమ రాకుండా వైఎస్సార్సీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారని అప్పుడు పట్టిసీమ నిర్మించకుంటే ఇవాళ రాయలసీమకు నీళ్లు వెళ్లేవి కాదని అన్నారు. రైట్ కనెక్టివిటీలో 19 మీటర్లు వెడల్పు, ఎత్తుతో 2 టన్నెళ్లు వస్తాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక విశిష్ట లక్షణాలు ఉన్నాయని తెలిపారు. విశాఖకు నీరు తీసుకెళ్లే కాలువను బాగా వెడల్పు చేశామని, పోలవరం నీటితో అనకాపల్లి, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం - జీవనాడని కొనియాడారు.

''నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు. భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. ఆర్టీఎస్‌లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్‌నగర్‌కు ఇచ్చాం. దేవాదుల, కల్వకుర్తి నేనే ప్రారంభించా. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారు?.''- నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం

హార్టీకల్చర్‌ హబ్‌గా రాయలసీమ: పట్టిసీమ ఎత్తిపోతలను ఏడాది వ్యవధిలో పూర్తి చేశామని ఈ పట్టిసీమ వల్ల కృష్టా డెల్టాలో సమయానికి పంటలు వేయగలిగామని ఏపీ సీఎం అన్నారు. శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు నీరివ్వగలిగామని అలానే రాయలసీమలో గొల్లపల్లి కట్టి కియా మోటార్స్ తెచ్చామని చెప్పారు. పండ్లతోటలు ఎక్కువ పండుతున్న రాష్టంగా మనం మారామని హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రతి సోమవారం రోజు పోలవరంపై సమీక్ష చేశనని అన్నారు.

ఆ నీటిని రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటి : మరోవైపు ఏపీ మంత్రి లోకేశ్ స్పందించారు. "సముద్రంలో కలిసే వేల టీఎంసీలు కాపాడి రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటి? తెలంగాణ ప్రాజెక్టులకు మేం ఎక్కడా చిల్లు పెట్టలేదు. మిగిలిన నీళ్లను తెలంగాణ వాడుకోవచ్చు, చెన్నైకు ఇవ్వొచ్చు. గతంలో పట్టిసీమ దండగని జగన్ అన్నారు. దాన్నే ఐదేళ్లు వాడుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది" అని లోకేశ్‌ అన్నారు.

ఇరు రాష్ట్రాలూ మధ్యవర్తిత్వం గురించి ఆలోచించండి : 'పోలవరం-నల్లమల సాగర్' వివాదంపై సుప్రీం

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగింది : మంత్రి ఉత్తమ్