మద్యం ముడుపుల సొమ్ముని నగదు, నగల రూపంలో ఇచ్చేశా: సిట్ విచారణలో అనిల్ చోక్రా
అనిల్ చోక్రాను సుదీర్ఘంగా విచారించిన సిట్ - తన డొల్ల కంపెనీల్లోకి రూ.78 కోట్లు జమైనట్లు అంగీకారం, ప్రతిఫలంగా కమీషన్ తీసుకున్నానని వెల్లడి, కొత్తగా తెరపైకి చాముండ బులియన్ యజమాని చేతన్కుమార్ పేరు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 2, 2025 at 7:27 AM IST
Liquor Case Accuse Anil chokra Questioned By Sit: మద్యం కుంభకోణం కేసులో ఏ49 గా ఉన్న అనిల్చోక్రాకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే సిట్ అనిల్ చోక్రాను మద్యం కుంభకోణానికి సంబంధించి పలు అంశాలపై విచారించింది. అందుకు అనిల్ చోక్రా బదులిస్తూ కొత్తగా తెరపైకి చాముండ బులియన్ యజమాని చేతన్కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఏపీకి చెందిన పలు మద్యం డిస్టిలరీలు వాటి బ్యాంకు ఖాతాల నుంచి మీ డొల్ల కంపెనీల ఖాతాల్లో డబ్బు జమచేస్తాయి. ఆ సొత్తు విత్డ్రా చేసి నగదు, బంగారం రూపంలో వెనక్కి ఇస్తే మీకు కమీషన్ చెల్లిస్తామంటూ ముంబయికి చెందిన చాముండ బులియన్ యజమాని చేతన్కుమార్ నన్ను సంప్రదించారని తెలిపారు. అదే విధంగా ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ-11), క్రిపాటి ఎంటర్ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ-12), నైస్న మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ-13), విశాల్ ఎంటర్ప్రైజస్ (ఏ-19) తదితర డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల వివరాలు ఆయా డిస్టిలరీలకు అందజేశామని అనిల్ చోక్రా విచారణలో చెప్పారు.
అప్పటి ప్రభుత్వ పెద్దలకు మద్యం ముడుపులు: తద్వారా వాటిలో రూ.78 కోట్లను వారు జమచేశారని అనిల్ సిట్ అధికారులకు తెలిపారు. అందులో నా కమీషన్ మినహాయించుకుని మిగతా సొత్తు నగదు, బంగారం రూపాల్లోకి మార్చి చేతన్కుమార్కు అందజేశానని పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో నిందితుడు (ఏ-40), ముఠా తరఫున మద్యం ముడుపుల సొమ్ము మనీ లాండరింగ్ చేసిన ముంబయివాసి అనిల్ చోఖ్రా సిట్ దర్యాప్తులో వెల్లడించాడు.
చేతన్కుమార్ తండ్రికి దుబాయ్లోని పలువురు వ్యక్తులతో ఆర్థిక సంబంధాలున్నాయని అనిల్ చోక్రా తెలిపాడు. న్యాయస్థానం అనిల్ చోఖ్రాను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వగా, తొలి రోజు సోమవారం ఆయన్ను దాదాపు 6 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణలో కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది.
డొల్ల కంపెనీలకు రూ.78 కోట్లు: వైఎస్సార్సీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ సంస్థలు రాజ్ కెసిరెడ్డి(ఏ-1), ముప్పిడి అవినాష్రెడ్డి (ఏ-7)ల నియంత్రణ, పర్యవేక్షణలో ఉండేవి. ఈ మూడు సంస్థలు కలిపి మొత్తం రూ.78 కోట్లను అనిల్ చోఖ్రాకు సంబంధించిన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయి.
అదే విధంగా రెండో దశలో ఆ నిధులు మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఆ సొత్తు వైఎస్సార్సీపీ ముఠాకు వారి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేర్చేవారు. ఎక్కడా ఆడిట్కు దొరక్కుండా, నేరం గుట్టు బయటపడకుండా బహుళ అంచెల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారని సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం మనీ లాండరింగ్ గుట్టు రాబట్టేందుకు అనిల్ చోఖ్రాను ప్రశ్నించింది.
బ్లాక్ మనీని వైట్గా వైట్ను బ్లాక్గా: రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతానికి చెందిన అనిల్ చోఖ్రా నవీ ముంబయిలోని సాన్పాడాలో నివసించేవాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత డబ్బులిచ్చి వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను సేకరించేవాడు. వాటితో డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా మనీ లాండరింగ్ చేయడంలో సిద్ధహస్తుడుగా పేరుగాంచాడు. తద్వారా కమీషన్లు పొందేవాడు. వైట్ను బ్లాక్ మనీగా, మళ్లీ బ్లాక్ను వైట్లోకి మార్చి కమీషన్ పొందుతుండేవాడు.
వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా పెద్ద మొత్తాల్లో సొత్తు హవాలా చేసినందుకు గతంలో అతనిపై కేసులు నమోదయ్యాయి. ఈడీ అరెస్టు కూడా చేసింది. వైఎస్సార్సీపీ మద్యం ముఠా కోసం చోఖ్రా పలు డొల్ల కంపెనీలు సృష్టించి, అక్రమ నగదు లావాదేవీల కోసం వాటిని వినియోగించాడని అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో అతనితో వైఎస్సార్సీపీ ముఠా సభ్యులు ఎవరెవరు సంప్రదింపులు జరిపారో సిట్ ఒక్కొక్కటి కూపీ లాగుతోంది.
లిక్కర్ స్కాం - ఈనెల 21 వరకు అనిల్ చోక్రాకు రిమాండ్
'డిఫెన్స్ లిక్కర్ ఇచ్చే కిక్కే వేరప్పా' - తరచూ పట్టుబడుతున్న ‘రక్షణ మద్యం’

