రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు - ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరణ
సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్ను తిరస్కరించిన పట్నా కోర్టు - పట్నా నుంచి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఏపీ పోలీసులు - ఇవాళ ఉదయం సునీల్ నాయక్ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 11:08 AM IST
AP Police Arrest IPS Sunil Nayak : రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్నాయక్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్నాయక్ను ఏపీ పోలీసులు బిహార్లో అదుపులోకి తీసుకున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్నాయక్ నిందితుడిగా ఉన్నారు. గుంటూరులోని నగరంపాలె పోలీస్స్టేషన్లో సునీల్నాయక్ పై కేసు నమోదైంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటేషన్పై సీఐడీలో పని చేశారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్నాయక్ పాత్రపై ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ నిమిత్తం పలు సార్లు నోటీసులు ఇచ్చినా సునీల్నాయక్ స్పందించ లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్నాయక్ బిహార్ సర్వీస్కు వెళ్లిపోయారు.
పాట్నాకు వెళ్లిన ఏపీ పోలీసులు : సునీల్నాయక్ను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు బిహార్లోని పట్నాకు వెళ్లారు. ప్రస్తుతం సునీల్నాయక్ అగ్నిమాపక శాఖ ఐజీగా పని చేస్తున్నారు. అక్కడ గృహ నిర్బంధంలో ఉన్న ఆయనను ఏపీ పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్పై ఆంధ్రప్రదేశ్కు తీసుకు రావాలనుకున్నారు.
బిహార్ పోలీసుల కథనం ప్రకారం: పట్నాలోని అగ్నిమాపక దళ ఇన్స్పెక్టర్ జనరల్ అధికారిక నివాసంపై ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం దాడి చేసిందని బిహార్ పోలీసులు తెలిపారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్లో హత్య కేసు నమోదు చేయడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేశారని బిహార్ పోలీసులు తెలిపారు.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు : 2021లో అప్పటి నర్సాపురం ఏపీ రఘురామకృష్టరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని సీఐడీలో సునీల్నాయక్ విధులు నిర్వహించారు. తనపై కస్టడీలో దాడికి పాల్పడ్డారని అప్పట్లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కోర్టు ఆదేశం మేరకు సునీల్నాయక్ పై కేసు నమోదు చేశారు. కోర్టు ఆయన బెయిల్ రద్దు చేసిన తర్వాత, ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి పట్నాకు వెళ్లారు.
ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరణ : అయితే ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్ను పట్నా కోర్టు తిరస్కరించింది. సునీల్ నాయక్ను గుంటూరుకు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ తీసుకునేందుకు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది. బిహార్ వెళ్లిన పోలీసుల బృందం ఈ సమాచారాన్ని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులకు చేరవేశారు. రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ పై ఆరోపణలున్నాయి. సంఘటన జరిగిన సమయంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడిలో పని చేశారు.
రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం - ఐపీఎస్ సునీల్ కుమార్పై కేసు నమోదు
సునీల్కుమార్కు సిట్ నోటీసులు - డిసెంబర్ 4న విచారణకు హాజరవ్వాలని వెల్లడి

