ETV Bharat / state

కాకినాడ, గుంటూరు ఆస్పత్రులకు క్యాన్సర్ చికిత్స యంత్రాలు: ఓఎన్‌జీసీ ఛైర్మన్

సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ భేటీ - కేజీ బేసిన్‌లో చమురు, గ్యాస్ వెలికితీత పనులపై చర్చ - ప్రాజెక్టుల వేగవంతానికి పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం

ONGC Chairman Meets CM
ONGC Chairman Meets CM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 4, 2026 at 1:34 PM IST

2 Min Read
Choose ETV Bharat

ONGC Chairman Meets CM : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చమురు, సహజవాయువు సంస్థ (ONGC) చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో రాష్ట్రంలో ఇంధన రంగ అభివృద్ధి, ఓఎన్‌జీసీ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యంగా ఏపీలోని కృష్ణా-గోదావరి (KG) డెల్టా బేసిన్‌లో ప్రస్తుతం జరుగుతున్న చమురు, సహజవాయువు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతిని ఓఎన్‌జీసీ చైర్మన్ ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు లభించే ఆదాయం, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఉపాధి అవకాశాల కల్పన వంటి సానుకూల అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.

మెరుగైన సమన్వయం ఉండేలా చూస్తామని హామీ : రాష్ట్ర ప్రగతిలో ఇంధన భద్రత అత్యంత కీలకమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఓఎన్‌జీసీ ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు, సంస్థకు మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో సంస్థ తన సామాజిక బాధ్యతను (CSR) గుర్తుంచుకోవాలని సూచిస్తూ, చమురు, గ్యాస్ తవ్వకాలు జరుగుతున్న పరిసర గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేసి, ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

అత్యంత అధునాతన యంత్రాలు : సీఎం సూచనలపై సానుకూలంగా స్పందించిన ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్, తాము ఇప్పటికే వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే కాకినాడ, గుంటూరు నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత అధునాతన యంత్రాలను సమకూరుస్తున్నట్లు సీఎంకు వివరించారు. రాష్ట్ర ఇంధన రంగానికి కొత్త దిశను చూపేలా సాగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుతో పాటు ఓఎన్‌జీసీ ఉన్నతాధికారుల బృందం పాల్గొన్నారు.

ఎక్స్​ ద్వారా పోస్ట్​ : చంద్రబాబు నాయుడుతో చమురు, సహజవాయువు సంస్థ (ONGC) చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ భేటీకి సంబంధించిన ఫొటోలు సీఎంవో ఎక్స్​ ద్వారా పోస్ట్​ చేశారు. "ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నేడు రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా- గోదావరి డెల్టా బేసిన్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ఓఎన్‌జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యకలాపాలపై సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఓఎన్‌జీసీ అధికారుల బృందం సభ్యులు కూడా హాజరయ్యారు" అంటూ సీఎం కార్యాలయ అధికారులు పోస్ట్​ చేశారు.

ముగ్గురాయిలో మాయాజాలం - పైసల వ్యత్యాసంతో బిడ్లు వేసి రూ.340 కోట్లకు ఎసరు

ఓఎన్​జీసీ బావిలో స్వల్ప గ్యాస్ లీక్​ - సకాలంలో గుర్తించడంతో తప్పిన ప్రమాదం