అకారణంగా ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదు: ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ వెల్లడి
రాష్ట్రేతర ప్రాంతాల్లో సైతం ఓటర్లకు ఆన్లైన్ సదుపాయం - తొలి రోజు 4.12 లక్షల ఎన్యుమరేషన్ ఫాంల అందజేత - వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 16, 2026 at 8:57 AM IST
AP Chief Electroral officer Vivek Yadav on SIR Process: ఏపీలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా జూలై 21న ప్రచురణ జరుగనుందని ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ జాబితాపై నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. బీఎల్ఓలు, ఈఆర్ఓలు, కలెక్టర్లకు సర్ పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రేతర ప్రాంత ఓటర్లకు ఆన్లైన్ సదుపాయం: అదే విధంగా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకూ శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఈసీఐనెట్ యాప్లో కాల్ యువర్ బీఎల్ఓ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి 48 గంటల్లో ఓటర్లకు బీఎల్ఓ నుంచి స్పందన వస్తుందని వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్రం వెలుపల ఉన్నవారికి ఆన్లైన్లో ఫారం సమర్పణ అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో ఉన్న ఓటర్లు కూడా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయవచ్చునని వివరించారు. ecinet.eci.gov.in ద్వారా ఎన్యూమరేషన్ ఫారం సమర్పణ చేయవచ్చునని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియ 76 శాతం పూర్తయిందన్నారు. మ్యాపింగ్ను 95 శాతానికి పైగా పూర్తి చేయడమే లక్ష్యమన్నారు.
మార్గదర్శకాల ప్రకారమే ప్రక్రియ: ఇంట్లో లేని ఓటర్ల తరఫున బంధువులు ఫారం ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబోమని వెల్లడించారు. ఏఎస్డీడీ (గైర్హాజరు, మారిన వారు, డూప్లికేట్, మరణించిన వారు) ఓట్లపై మాత్రమే చర్యలు ఉంటాయని చెప్పారు. పత్రాలు స్వీకరించవద్దన్న ఆదేశాలు లేవన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారు. ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
"ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర విచారణలో భాగంగా బూత్ స్థాయి ఏజెంట్లకూ శిక్షణ ఇవ్వనున్నాం. ఈసీఐనెట్ యాప్లో కాల్ యువర్ బీఎల్ఓ సౌకర్యం వినియోగించుకోవాలి. దీనికి సంబంధించి 48 గంటల్లో ఓటర్లకు బీఎల్ఓ నుంచి స్పందన వస్తుంది. రాష్ట్రం వెలుపల ఉన్నవారికి ఆన్లైన్లో ఫారం సమర్పణ అవకాశం కల్పించాం. విదేశాల్లో ఉన్న ఓటర్లు కూడా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయొచ్చు. ఇంట్లో లేని ఓటర్ల తరఫున బంధువులు ఫారం ఇవ్వవచ్చు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ప్రక్రియ కొనసాగుతుంది. అర్హుడైన ప్రతి ఓటరు పేరును జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం"-వివేక్ యాదవ్, ఎన్నికల ప్రధాన అధికారి
ఏపీలో నేటి నుంచే "సర్" ప్రక్రియ - జులై 14 వరకూ సాగనున్న సర్వే
"సర్" వస్తున్నారు! మీ ఓటు జాగ్రత్త" - ఓటరు జాబితాలో ఉంచాలన్నా, తీసేయాలన్నా ఇపుడే!

