జగన్కు ఇదేం రాక్షస మనస్తత్వం - ఉద్యోగాలు వస్తాయంటే అడ్డుకుంటాననడం సైకోయిజమే: మంత్రులు
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో జగన్ అసత్యాలు చెబుతున్నారని కూటమి మంత్రులు ఆగ్రహం - రాష్ట్రంలో ప్రతీ ఒక్కరినీ బెదిరించడం కోసం ప్రతీ నెలా ఓ కార్యక్రమం పెట్టుకుంటున్నారని విమర్శ

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 16, 2026 at 8:51 PM IST
Ministers Comments on YS Jagan over Fishermen Issue: దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తాననటమేంటని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. జగన్కు ఇదేం రాక్షస మనస్తత్వమని నిలదీశారు. మత్స్యకారుల పిల్లలకు మెరుగైన వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటాననడం ముమ్మాటీకీ సైకోయిజమేనని మండిపడ్డారు.
తల్లిని తరిమేసి, చెల్లిని గెంటేసిన జగన్కు దైవం అంటే భక్తి లేదు, దేశం అంటే ద్వేషం, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారంటూ లోకేశ్ దుయ్యబట్టారు. ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం అమరావతిని మార్చేస్తాం కట్టినవన్నీ కూల్చేసి, కంపెనీలన్నీ వెళ్లగొడతామంటున్నారని మండిపడ్డారు. ఇంత దుర్మార్గపు జగన్ మోహన్ రెడ్డి ఎందుకని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు.
పరిశ్రమలను భయపెట్టే యోచనలోనే జగన్: రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు జగన్ మతిపోయి మాట్లాడుతున్నాడని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. పరిశ్రమలను అధికారంలో ఉన్నప్పుడు వెళ్లగొట్టిన జగన్ అధికారం కోల్పోయాక భయపెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరినీ బెదిరించడం కోసం ప్రతీ నెలా ఓ కార్యక్రమం పెట్టుకుంటున్నారని విమర్శించారు. పరిశ్రమలను భయపెట్టే యోచనలోనే జగన్ జువ్వెలదిన్నె పర్యటన చేపట్టారని మండిపడ్డారు. మత్స్యకారులు బాగుకోసం జగన్ చేసిందేమీ లేదని తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి కుటుంబాలకు ఉపాధి మార్గం కూటమి ప్రభుత్వం చూపిస్తోందని అన్నారు. జగన్ 5 ఏళ్లు కళ్లు మూసుకున్నందుకే 151 నుంచి 11కు పడిపోయాడని మంత్రి బీసి జనార్ధన్రెడ్డి దుయ్యబట్టారు.
మత్స్యకారులను పొట్టన పెట్టుకుంది మీరు కాదా: తల్లి మీద ప్రేమ, చెల్లి పట్ల గౌరవం, దేశ భక్తి లేని వ్యక్తి జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. శత్రుదేశాల నుంచి దేశానికి రక్షణ కల్పించేలా పరిశోధన చేసేందుకు వస్తున్న సాగర్ డిఫెన్స్ సంస్థను తరిమేస్తాననటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల బోట్లు మన భూభాగంలోకి రాకుండా స్పీడ్ బోట్లు ఏర్పాటు చేసుకోవటంతోపాటు మెరైన్ గస్తీ పెంచుకుంటున్నామని తెలిపారు. జగన్ కట్టిందేమీ లేక కూటమి ప్రభుత్వం చేపట్టే వాటిలో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సోంపేట, గంగవరం పోర్టులో మత్స్యకారులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకుంది మీరు కాదా అని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరికేస్తాం, చంపేస్తామనే ఉన్మాదంతో రాజకీయాలు - జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి నిమ్మల
జగన్ పిచ్చి వాగుడుపై చర్చ అనవసరం - అమరావతే సరైన సమాధానం చెబుతుంది : సీఎం చంద్రబాబు

