ఈ పూరీలు చాలా హాట్ గురూ! ప్లేట్ రూ.2వేలు - ఎందుకంత ప్రత్యేకత తెలుసా?
ఓ హోటల్లో స్వయంగా పూరీలు వేసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి - ఎమ్మెల్యే చేసిన వేడివేడి పూరీ కోసం పోటీపడ్డ బీజేపీ కార్యకర్తలు - వేలం పాటలో రూ.2 వేలకు దక్కించుకున్న కార్యకర్త

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 1, 2026 at 1:41 PM IST
Adoni MLA Parthasarathy Made Puri and Cost RS. 2000 : రెండు పూరీలు 2 వేల రూపాయలు! ఏంటి అవాక్కయ్యారా? మీరు విన్నది నిజమే! ఈ రేటు పక్క రాష్ట్రంలోనో, ఫైవ్స్టార్ హోటల్లోనో కాదు! మన రాష్ట్రంలోనే, అది కూడా రోడ్డుపక్కనున్న సాదా సీదా హోటల్లోనే! ఆ కాస్ట్లీ పూరీ కథేంటో చూద్దామా?
ఏ హోటల్లోనైనా పూరీకి డిమాండ్ ఎక్కువే! ఎంత ఎక్కువైనా ప్లేట్ పూరీ యాభయ్యో, వంద రూపాయలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో గ్యాస్ రేట్లు పెరిగాయనుకున్నా ప్లేట్ ధర రెండు వందలకు మించదు. కానీ, ఆదోనిలో ప్లేట్ పూరీ అక్షరాలా 2వేల రూపాయలు పలికింది. షెఫ్లను బట్టి హోటల్కు పేరొచ్చినట్లు, ఈ పూరీ వేసిన వ్యక్తి కారణంగా రేటు రూ.2వేలు పలికింది. ఈయనెవరో కాదు మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి! 'ప్రజల కోసం మీ పార్థసారథి' కార్యక్రమంలో భాగంగా, వాల్మీకి నగర్ వెళ్లారాయన. ఇంటింటికీ తిరుగుతూ ఒక మహిళ నడుపుతున్న చిన్న హోటల్కు వెళ్లారు. అక్కడ స్వయంగా పిండిని ఒత్తి, నూనెలో వేసి పూరీలు చేయడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.
వేడివేడి పూరీ కోసం పోటీ : ఎమ్మెల్యే చేసిన వేడివేడి పూరీ కోసం బీజేపీ కార్యకర్తలు పోటీపడ్డారు. ఏకంగా వేలంపాట పెట్టారు. 500 నుంచి వేలం సాగింది. చివరకు బీజేపీ కార్యకర్త నాగిరెడ్డి 2వేల రూపాయలకు, ప్లేట్ పూరీ సొంతం చేసుకున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును హోటల్ నిర్వాహకులకు అందజేశారు. ఈ పూరీ చాలా రేట్ గురూ అంటూ టాక్ఆఫ్ది టౌన్గా మారారు ఎమ్మెల్యే. 'ప్రజల కోసం మీ పార్థసారథి' పేరుతో ఎమ్మెల్యే తరచూ ప్రజలతో ఇలాగే మమేకం అవుతున్నారు. స్థానికుల్లో కలిసిపోతున్నారు.
ఒక్క దోశ రూ.700 : కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ బి. పార్థసారథి స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడానికి "ప్రజల కోసం మీ పార్థసారథి" అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ పర్యటనల సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి పలు కాలనీల్లో పర్యటించి ప్రజల కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో కూడా ఆదోని పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన స్వయంగా ఓ హోటల్లో దోశలు వేయడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఆ దోశ సైతం ఏకంగా రూ.700 ధర పలికింది. ఇలా పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే ప్రతిచోట ఏదో ఒక వినూత్న కార్యక్రమాలతో జనాల్ని ఆకర్షిస్తున్నారు.
పథకాల అవగాహన: అంతేగాక ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో? లేదో? పరిశీలిస్తూ వాటిపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను, వ్యక్తిగత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఎమ్మెల్యే భరోసా ఇస్తున్నారు.
చంద్రబాబుకు ఓటేస్తా, ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డికి షాకింగ్ సమాధానం
దంపతులను బురిడీ కొట్టించి రూ.3.5 కోట్లు దోపిడీ - ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితులు

