వైఎస్సార్సీపీ ఎంపీల ఆస్తులు గుట్టురట్టు - నివేదిక విడుదల చేసిన ఏడీఆర్ సంస్థ
ఎంపీ మిథున్రెడ్డి ఆస్తుల్లో 10 ఏళ్లలో 550% పెరుగుదల, అవినాష్రెడ్డివి 474% వృద్ధి - కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఆస్తుల్లో తగ్గుదల - వరుసగా 3 ఎన్నికల్లో గెలిచిన వారి ఆస్తులను విశ్లేషించిన ఏడీఆర్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 9:26 AM IST
Adr Analyzed Assets of Those who Won 3 Consecutive Elections: వైఎస్సార్సీపీకు చెందిన ఇద్దరు ఎంపీల ఆస్తులు 10 ఏళ్లలో సగటున 532% పెరిగినట్లు ఏడీఆర్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆస్తులు 474%, రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి ఆస్తులు 550% మేర పెరిగినట్లు వెల్లడించింది.
2014, 2019, 2024 ఎన్నికల్లో 103 మంది వరుసగా లోక్సభకు ఎన్నిక అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 102 మంది అఫిడవిట్లను ఏడీఆర్ విశ్లేషించింది. ఈ వివరాలను వెల్లడించింది. అందులో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (804%) తర్వాత అత్యధికంగా ఆస్తుల విలువ పెరిగిన పార్టీల్లో వైఎస్సార్సీపీ 2వ స్థానం (532%)లో నిలిచింది. ఎంపీ మిథున్రెడ్డి ఆస్తులు 2014లో రూ.22 కోట్ల మేర ఉన్నాయి. 2019కి రూ.66 కోట్లకు, 2024కు రూ.146 కోట్లకు చేరినట్లు తాజా నివేదిక పేర్కొంది. అత్యధికంగా ఆస్తులు పెరిగిన సిటింగ్ ఎంపీల్లో మిథున్రెడ్డి దేశంలో 3వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆస్తులు 2014లో రూ.7 కోట్ల మేర ఉన్నాయి. అవి 2019కి రూ.18 కోట్లకు, 2024కు రూ.40 కోట్లకు చేరాయి. ఆస్తుల విలువ వృద్ధి పరంగా ఈయన 15వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది.
- ఎంఐఎం పార్టీ తరఫున గత మూడు ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గెలిచారు. ఎంపీ అసదుద్దీన్ ఆస్తులు 10 ఏళ్లలో 488% పెరిగాయి. ఈ నివేదిక ప్రకారం ఆస్తులు పెరుగుదలలో 24వ స్థానంలో నిలిచారు.
- టీడీపీ తరఫున గత మూడు ఎన్నికల్లో ఏకైక ఎంపీ కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడి గెలిచారు. ఆస్తులు 10 ఏళ్లలో 177% పెరిగాయి. పెరుగుదల పరంగా రామ్మోహన్నాయుడు 28వ స్థానంలో ఉన్నారు.
ఆస్తి తగ్గిన ఏకైక ఎంపీ: గత మూడు ఎన్నికల్లో వరుసగా 102 మంది ఎంపీలు గెలిచారు. వీరి ఆస్తుల విలువ 10 ఏళ్లలో సగటున 110% పెరగాయి. అయితే కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆస్తి మాత్రం గతంలో కంటే తగ్గిపోయింది. గుజరాత్లోని నవ్సారీ నియోజకవర్గం నుంచి వరుసగా 3వ సారి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందుతూ వచ్చారు. ఆయన ఆస్తి 2014లో రూ.74.47 కోట్లు ఉన్నాయి. 2019కి రూ.44.60 కోట్లకు, 2024కు రూ.39.49 కోట్లకు తగ్గిందని నివేదిక పేర్కొంది. గత 10 ఏళ్లలో ఆయన ఆస్తి రూ.34.98 కోట్లలో సుమారు -47% మేర తగ్గిపోయిందని వెల్లడించింది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం గత మూడు ఎన్నికల్లో బీజేపీ నుంచి వరుసగా 65 మంది ఎంపీలు గెలిచారు. సగటున ఆస్తులు రూ.16.90 కోట్ల మేర అనగా 108% పెరగాయి. కాంగ్రెస్కు చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు రూ.6.99 కోట్ల మేర అనగా 135 శాతం వృద్ధి చెందాయి. రాహుల్గాంధీ ఆస్తుల్లో రూ.10.99 కోట్ల పెరుగుదల నమోదైంది. 2014లో రూ.9.40 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019కి రూ.15.88 కోట్లకు, 2024కు రూ.20.39 కోట్లకు చేరాయని నివేదిక పేర్కొంది. 117% పెరుగుదలతో రాహుల్గాంధీ 38వ స్థానంలో నిలిచారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు 82 శాతం పెరిగాయి. 2014లో రూ.1.65 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019కి రూ.2.51 కోట్లకు, 2024కు రూ.3.02 కోట్లకు పెరిగాయని నివేదిక తెలిపింది. మోదీ 94వ స్థానంలో నిలిచారు. అత్యధిక ఆస్తి విలువ పెరిగిన టాప్-10 ఎంపీల్లో ఐదుగురు బీజేపీ వారే ఉండడం గమనార్హం.
2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచిన తెలుగు రాష్ట్రాల ఎంపీల ఆస్తులు(రూపాయల్లో) ఇలా:-
| ఎంపీ | 2014 | 2019 | 2024 | పెరుగుదల (రూ.) | సగటు వృద్ధి % |
| మిథున్ రెడ్డి | 22,59,84,036 | 66,50,85,701 | 146,85,01,685 | 124,25,17,649 | 550 |
| అవినాష్ రెడ్డి | 7,04,80,623 | 18,69,69,794 | 40,43,01,973 | 33,38,21,350 | 474 |
| అసదుద్దీన్ ఒవైసీ | 4,06,11,099 | 17,90,44,376 | 23,87,66,044 | 19,81,54,945 | 488 |
| రామ్మోహన్ నాయుడు | 8,41,73,423 | 12,27,91,042 | 23,30,73,561 | 14,89,00,138 | 177 |
కేసులు తేలేదాకా జగన్ ఆస్తులు విడుదల చేయొద్దు: సీబీఐ
కొత్త ఎమ్మెల్యేల చిట్టా : సగానికిపైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు- 90 శాతం మంది కోటీశ్వరులు!

