వారికి గుడ్న్యూస్ - పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ అప్డేట్
బీ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ను అయిదు నుంచి ఏడేళ్ల లోపు వాళ్లు చేసుకుంటే సేవలు ఉచితం - ప్రతి మండలంలో పిల్లల కోసం బాల ఆధార్ నమోదు కేంద్రాలు నాలుగు చొప్పున అందుబాటులోకి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 3:12 PM IST
Aadhar Card Update 5 To 7 Years : ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అవసరంగా మారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు కావాలన్నా, పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నా ఆధార్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఆధార్ని ప్రామాణికంగా చూస్తున్నారు. ఇక చివరికి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి సైతం ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు. కాగా, గతంలో ఆధార్ కార్డు తీసుకుని అప్డేట్ చేయించుకోని వారికి మరొక అవకాశం. అక్టోబరులో వారం రోజుల పాటు జిల్లాలోని పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కువ మంది నవీకరించుకోలేదు. దీంతో మరోసారి అవకాశం కల్పించారు. బ్యాంకులు, పోస్టాఫీసులతోపాటు గ్రామ సచివాలయాల్లోనూ ఆధార్ మార్పులు, నమోదు, చేర్పుల సేవలు అందుబాటులోకి వచ్చాయి.
బయోమెట్రిక్ 1,09,000 వరకు పెండింగ్ : విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షలు, సంక్షేమ పథకాలు, ఉపకార వేతనాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి అవుతోంది. ఫిబ్రవరిలో నీట్-2026 నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటితోపాటు కొన్ని జాతీయ ప్రవేశ పరీక్షలకు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరముంది. ఉడాయ్ సూచన ప్రకారం విశాఖపట్నం జిల్లాలో తప్పనిసరిగా చేయాల్సిన బయోమెట్రిక్ 1,09,000 వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల్లో సోమవారం నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
7 ఏళ్లలోపు పిల్లలకు ఉచితం: అప్పుడే పుట్టిన శిశువుల నుంచి అయిదేళ్లలోపు పిల్లలకు పేరు, ఫొటో, పుట్టిన తేదీ ఆధారంగా ‘బాల ఆధార్ను’ జారీ చేస్తారు. ఆ వయసులో ఐరిస్, వేలి ముద్రలను తీసుకోరు. ప్రస్తుత నిబంధనల ప్రకారం పిల్లలకు అయిదేళ్లు రాగానే తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి. బీ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ (ఎంబీయూ)గా పిలిచే ఈ ప్రక్రియను అయిదు నుంచి ఏడేళ్ల లోపు చేసుకుంటే అన్ని సేవలు ఉచితం. ఈ ప్రక్రియ ద్వారా చిన్నారుల ఆధార్ నంబరులో ఎలాంటి మార్పు ఉండదు. ఏడేళ్లు వచ్చినా నవీకరణ చేయకపోతే ఆధార్ గుర్తింపు రద్దు చేసే అవకాశముంది. కొత్తగా ఆధార్ను నమోదు చేయడానికి ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. 5 నుంచి 7 ఏళ్లలోపు ఉన్న వారు వేలి ముద్రల అప్డేట్ను ఒక సారే ఉచితంగా చేసుకోవచ్చు. ప్రతి మండలంలో పిల్లల కోసం బాల ఆధార్ నమోదు కేంద్రాలు నాలుగు చొప్పున అందుబాటులోకి తీసుకువచ్చారు.
"ఎంబీయూ (బీ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ) ఎక్కువగా పెండింగ్ ఉన్న పాఠశాలలకు ముందుగా కిట్లను పంపించనున్నాం. ఈ మేరకు మ్యాపింగ్ పూర్తి చేశాం. పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు ఎంబీయూ పూర్తి చేయాలి" - -ఉషారాణి, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణాధికారి
ఆధార్ వివరాల అప్డేషన్ : ఆధార్ కార్డుదారులు పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబరు వంటి వివరాలు మార్చుకోవడం, నవీకరించుకోవడం కోసం గతంలో ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై దీన్ని ఆన్లైన్లోనే సులువుగా చేసుకోవచ్చు. మీరు అప్డేట్ చేసిన వివరాలను ప్రభుత్వ గుర్తింపుకార్డుతో అధికారులు వెరిఫై చేస్తారు. ఇందుకోసం పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్కార్డు, పాస్పోర్టు, జనన ధ్రువీకరణ పత్రంలాంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం myAadhaar portalకు వెళ్లి ఆధార్, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆపై మీకు కావాల్సిన వివరాలను మార్చుకోవడానికి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవాలి.
ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలు - 42 దేశాల నుంచి తరలివచ్చిన తెలుగుప్రజలు
'ఎంకేఎస్' 200 మంది జూనియర్లను తీర్చిదిద్దారు - అందరికీ మార్గదర్శకంగా నిలిచారు: జస్టిస్ శ్రీనరసింహ

