యువతకు ఉజ్వల భవిత - కెరీర్, నైపుణ్యాలు, ఉపాధికి 'మై భారత్'
యువజన సాధికారతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ పోర్టల్ - యువతను ఉద్యోగార్థులుగా మాత్రమే కాకుండా, నాయకులుగా, సామాజిక సేవకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 7:06 PM IST
My Bharat Portal : దేశ అభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం యువజన సాధికారతకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ దిశగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'మై భారత్' పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 29 సంవత్సరాలలోపు యువత ఈ పోర్టల్లో ఉచితంగా నమోదు చేసుకుని కెరీర్, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవ, ఉపాధి, వ్యవసాయేతర వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై సమగ్ర సమాచారం పొందే అవకాశం కల్పిస్తోంది. యువతను ఉద్యోగార్థులుగా మాత్రమే కాకుండా, నాయకులుగా, సామాజిక సేవకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పోర్టల్ ప్రధాన ఉద్దేశం.
ఎవరు నమోదు చేసుకోవచ్చు? : 29 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న యువత మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, స్వయం ఉపాధి కోరుకునే వారు, సామాజిక సేవపై ఆసక్తి ఉన్న యువకులు ఈ వేదికను వినియోగించుకోవచ్చు. నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉండటంతో దేశంలోని ఎక్కడి నుంచైనా సులభంగా చేరవచ్చు.
కెరీర్కు దిశానిర్దేశం : పోర్టల్లో కెరీర్ గైడెన్స్కు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. వివిధ రంగాల్లో ఉన్న నిపుణులు విద్య, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలు, నైపుణ్యాభివృద్ధి కోర్సులపై మార్గనిర్దేశం చేస్తారు. యువత తమ ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా కెరీర్ను ఎంచుకునేందుకు అవసరమైన సలహాలు పొందవచ్చు.
నైపుణ్యాభివృద్ధి - ఉపాధికి చేయూత : ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో వివిధ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. కమ్యూనికేషన్, డిజిటల్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, వ్యవస్థాపక నైపుణ్యాలు వంటి అంశాల్లో శిక్షణ అవకాశాల సమాచారాన్ని అందిస్తారు. స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన సూచనలు కూడా లభిస్తాయి.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు, సబ్సిడీలు ఎలా పొందాలో వివరమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. వ్యాపారం ప్రారంభించే విధానం, ప్రాజెక్టు నివేదిక తయారీ, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సహాయం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది.
స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం : దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, విపత్తు నిర్వహణ, గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలను పోర్టల్ ద్వారా తెలియజేస్తారు. ఇందులో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయి.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధి పథకాల వివరాలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి. అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు వంటి వివరాలను తెలుసుకుని యువత ఆయా పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
మై భారత్ పోర్టల్లో నమోదు నుంచి మార్గనిర్దేశం వరకు అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను విస్తరించి, దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే ఈ డిజిటల్ వేదిక ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు - 'మన బడి- మన భవిష్యత్తు' ఏర్పాటుకు ఉత్తర్వులు
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టలా? అంటే ఏంటి? - ఇది దేనికి ఉపయోగపడుతుంది?

