ETV Bharat / sports

సెలక్టర్లు పక్కన పెడుతున్నా షమీకి ఛాన్సుంది- అలా చేస్తే ఎవరూ ఆపలేరు- రీ ఎంట్రీ ఇవ్వడం పక్కా!

మహ్మద్ షమీకి తప్పని నిరీక్షణ - దేశవాళీలో రాణిస్తున్నా సెలక్టర్ల పిలుపు కోసం ఎదురుచూపులు- మాజీ క్రికెటర్లు ఏం అంటున్నారు?- అతిడి భవిష్యత్ ఏంటి?

Mohammed Shami
Mohammed Shami (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : January 11, 2026 at 3:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

Mohammed Shami Re- entry : మహ్మద్ షమీ. భారత్ క్రికెట్​లో అత్యుత్తమ పేస్​ బౌలర్లలో షమీ ఒకడు. 35ఏళ్లల వయసులోనూ ఫిట్​నెస్​గా ఉంటూ డొమెస్టిక్ క్రికెట్​లోనూ సత్తా చాటుతున్నాడు. అనుభవం, స్కిల్స్​ పరంగా చూస్తే, టీమ్ఇండియాలో ఇప్పుడున్న బౌలర్లకంటే షమీనే సీనియర్. కానీ గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సెలక్టర్లు షమీనీ పక్కనపెడుతూ వస్తున్నారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్​లో షమీని ఎంపిక చేయలేదు. తాజాగా న్యూజిలాండ్​తో జరుగుతున్న వన్డే సిరీస్​లోనూ షమీని సెలక్టర్లు పట్టించుకోలేదు. దీంతో షమీని మళ్లీ టీమ్ఇండియా జెర్సీలో చూడలేమా? అని ఫ్యాన్స్​లో సందేహం నెలకొంది.

అదే లాస్ట్!
అతడు చివరిసారిగా గతేడాది ఆడిన ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలో దిగాడు. ఆ టోర్నీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 22.27 సగటుతో 11 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత మాత్రం టీమ్ఇండియాకు దూరమయ్యాడు. గాయాలు, ఫిట్​నెస్ కారణాలతో అతడిని పక్కనపెడుతున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పలుమార్లు చెప్పాడు. అయితే వరుస సిరీస్​ల్లో అతడికి చోటు దక్కకపోయినా, షమీ నిరాశతో అక్కడే ఆగిపోవట్లేదు. దేశవాళీల్లో ఆడతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు.

డొమెస్టిక్​లో రాణించినా!
దేశవాళీలో షమీ బంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టిన ఈ ఫాస్ట్ బౌలర్, విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్లు)లో ఇప్పటిదాకా 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. కొత్త బంతితో షమీ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వయసు పెరగడం, ఫుల్ ఫిట్‌నెస్‌తో లేకపోవడం వల్ల టెస్టు జట్టులో చోటు కల్పించడం లేదంటే ఫర్వాలేదు. కానీ, వన్డేల్లోనూ అతడిని ఎంపిక చేయకపోవడం టీమ్ఇండియా అభిమానులకు ఆశ్చర్యం కలిస్తోంది.

భవిష్యత్‌ ఏంటి?
ఈ వ్యవహారంపై టీమ్ఇండియా మాజీ ప్లేయర్ల నుంచి షమీకి మద్దతు లభిస్తుంది. ఇటీవల దీనిపై భారత్ మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్​ మాట్లాడాడు. షమీ నిన్నా, మొన్నా జట్టులోకి వచ్చిన ప్లేయర్ కాదని అన్నాడు. 'అతడు నిన్నా మొన్నా వచ్చిన ప్లేయర్‌ కాదు. ఇంటర్నేషనల్ కెరీర్​లో 400+ వికెట్లు పడగొట్టాడు. అలాంటి బౌలర్‌ను ఏ కారణం లేకుండా ఎందుకు ఎంపిక చేయడం లేదు? కేవలం ఫిట్‌నెస్‌ సమస్యే అనుకోవట్లేదు. ఇటీవల దేశవాళీ టోర్నీల్లోనూ 200పైన ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడానికి ఇంతకంటే ఏముంటుంది? ఇంకా ఏం చేయాలి. అతడు ఏం మెరుగుపరుచుకోవాలి' అని ఇర్ఫాన్‌ ప్రశ్నించాడు.

బెంగాల్‌ కోచ్‌ లక్ష్మీరతన్‌ శుక్లా సైతం దీనిపై స్పండించాడు. షమీకి అన్యాయం జరుగుతోందని అయన అన్నాడు. ‘సెలక్షన్‌ కమిటీ షమీకి అన్యాయం చేసిందని విమర్శించాడు. ఇటీవల కాలంలో ఏ అంతర్జాతీయ ఆటగాడు అతడిలా అంకితభావంతో ఇన్నేసి దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడలేదని, అలా డొమెస్టిక్​లో సత్తా చాటినా సెలక్షన్‌ కమిటీ మాత్రం అతడిని విస్మరిస్తుందని అన్నాడు. ఇది సిగ్గుచేటు అని శుక్లా పేర్కొన్నాడు.

అలా చేస్తే రావొచ్చు!
జాతీయ జట్టుకు దూరమైన షమీ ప్రస్తుతం దేశవాళీలో ఆడుతున్నాడు. అక్కడ రాణిస్తున్నా అతడిని సెలక్టర్లు విస్మరిస్తున్నారు. అయితే మరో రెండు నెలల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ షురూ కానుంది. ఈ లీగ్​ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వీక్షిస్తారు. అందుకే ఈ లీగ్​లో షమీ రాణిస్తే టీమ్ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంది. అతడు మునుపటి రిథమ్ అందుకొని వికెట్ల ఆకలిని తీర్చుకోవాలి. అప్పుడు సెలక్టర్లు అతడి పేరును మరోసారి పరిశీలించే ఛాన్స్ ఉంది.

అయినప్పటికీ ఎంపిక చేయకపోతే అభిమానుల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తాయి. అతడు ఐపీఎల్​లో అదరగొడితే, మళ్లీ టీమ్ఇండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రీసెంట్​గా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈసారి అతడు లఖ్​నవూ సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అతడిని సన్​రైజర్స్ రూ.10 కోట్లకు ట్రేడ్ చేసింది.

కాగా, షమీ 2013లో అంతర్జాతీయ కెరీర్​ అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పటిదాకా 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20 ఆడాడు. ఇందులో టెస్టుల్లో 229, వన్డేల్లో 206, టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్​లో 119 మ్యాచ్​ల్లో 133 వికెట్లు నేలకూల్చాడు. 2023 వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత షమీ సుదీర్ఘ ఫార్మాట్లో ఆడలేదు. గతేడాది ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​లో చివరిసారిగా బరిలోకి దిగాడు. ఇక 2025 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​పై చివరి టీ20 ఆడాడు.