ETV Bharat / sports

సెమీస్ రేస్- భారత్ ఛాన్స్​లేంటి?- ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి?- రేపే క్లారిటీ!

T20 World Cup 2026 : రసవత్తరంగా టీ20 వరల్డ్​కప్​ సెమీస్ రేస్- ఇప్పటికే అర్హత సాధించిన ఇంగ్లాండ్- మిగిలిన బెర్తులు ఎవరివో?​

T20 World Cup Semis Race
T20 World Cup Semis Race (Source : IANS,Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : February 25, 2026 at 8:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

T20 World Cup Semis Race : టీ20 వరల్డ్ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న సూపర్ 8 మ్యాచులు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య పోరు సాగుతోంది. గ్రూప్ 1, గ్రూప్ 2 లలో సమీకరణాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ప్రతీ మ్యాచ్ ఫలితం ఇప్పుడు కీలకం కానుంది. రెండు గ్రూపులలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల నుంచి చివరిలో ఉన్న జట్ల దాకా ప్రతి ఒక్కరికీ సెమీస్ అవకాశం ఉన్నా, అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉండటం విశేషం. అసలు ఏ జట్టు సెమీస్ చేరాలంటే ఏం జరగాలి? ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం.

గ్రూప్ 1 ఇలా

  • భారత్ సెమీస్​కు చేరాలంటే తదుపరి రెండు మ్యాచ్​ (జింబాబ్వే, వెస్టిండీస్)ల్లోనూ భారీ తేడాతో నెగ్గాలి. అదే సమయంలో సౌతాఫ్రికా కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్​ల్లోనూ నెగ్గితే టీమ్ఇండియా నేరుగా సెమీస్​కు వెళ్తుంది
  • కానీ విండీస్​తో మ్యాచ్​లో సౌతాఫ్రికా ఓడిపోతే పోటీ రసవత్తరంగా మారుతుంది. అప్పుడు భారత్, వెస్టిండీస్ నాలుగు పాయింట్లతో సమానంగా ఉంటాయి. మెరుగైన రన్​రేట్ ఉన్న జట్టు ముందడుగు వేస్తుంది
  • ఇక టీమ్ఇండియా రెండు విజయాలు సాధించి, సౌతాఫ్రికాపై విండీస్, జింబాబ్వేపై సౌతాఫ్రికా నెగ్గితే అప్పుడు మూడు జట్లు నాలుగు పాయింట్లతో ఉంటాయి. ఇందులోనూ రన్​రేటే కీలకం అవుతుంది. మెరుగైన రన్​రేట్ ఉన్న జట్టు సెమీస్​కు వెళ్తుంది
  • మరోవైపు, విండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన జింబాబ్వే ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు సెమీస్ రేసులో ఉండాలంటే భారత్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు అనుకూలిస్తే 4 పాయింట్లతో మెరుగైన రన్​రేట్ ఉంటే జింబాబ్వేకు కూడా అవకాశం దక్కవచ్చు.

గ్రూప్ 2 : మిగిలింది ఒక్క స్థానమే!
గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్ వరుసగా రెండు విజయాలు సాధించి సెమీస్​లో అడుగుపెట్టింది. వరుసగా ఐదోసారి సెమీస్ చేరి ఇంగ్లాండ్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక రెండో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. న్యూజిలాండ్ తన మిగిలిన మ్యాచుల్లో శ్రీలంక, ఇంగ్లాండ్​పై గెలిస్తే నేరుగా సెమీస్ వెళ్తుంది. ఒకవేళ కివీస్ ఒక మ్యాచ్​లో ఓడిపోతే పాకిస్థాన్​కు అవకాశం ఉంటుంది.

పాకిస్థాన్, శ్రీలంక- ఛాన్స్ ఎవరికి?
పాకిస్థాన్ సెమీస్ వెళ్లాలంటే తన చివరి మ్యాచులో శ్రీలంకపై కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్, శ్రీలంక లేదా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాలని కోరుకోవాలి. ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోతే పాకిస్థాన్​కు ఛాన్స్ దొరికినట్లే. ఇక ఆతిథ్య జట్టు శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్, పాకిస్థాన్​పై గెలవడమే కాకుండా రన్​రేట్​ మెరుగుపరుచుకోవాలి. ఒక్క ఓటమి ఎదురైనా లంక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇంగ్లాండ్ మినహా మిగిలిన జట్లన్నీ సెమీస్ కోసం చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రేపు కీలకం
కాగా, గ్రూప్ 1లో సెమీస్​ రేస్​లో గురువారం కీలకం కానుంది. రేపు తొలుత వెస్టిండీస్- సౌతాఫ్రికా మ్యాచ్ ఉంది. ఆ తర్వాత భారత్- జింబాబ్వే పోరు ఉండనుంది. ఈ గ్రుప్​లో సెమీస్​ బెర్తులపై ఓ అవగాహన రావాలంటే రేపటి మ్యాచ్​లు కీలకం కానున్నాయి.

భారత్ తదుపరి మ్యాచ్​లు

  • భారత్ x జింబాబ్వే - ఫిబ్రవరి 26- చెన్నై చిదంబరం స్టేడియం
  • భారత్ x వెస్టిండీస్ - మార్చి 01- ఈడెన్ గార్డెన్స్, కోల్​కతా

ఆసక్తికరంగా వరల్డ్​ కప్​ సూపర్​ 8 సమీకరణాలు- భారత్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే!

సూపర్​ 8లో తడబడ్డ భారత్​- దక్షిణాఫ్రికా విక్టరీ- నెక్స్ట్ తప్పక గెలవాల్సిందే!