డేంజర్లో అజిత్ అగార్కర్ పదవి - రోహిత్ శర్మ రిటైర్మెంట్ కాంట్రవర్సీనే కారణమా?
క్రీడా వర్గాల్లో నయా ప్రచారం- ఈసారి చీఫ్ సెలక్టర్ అజిత్ ఆగార్కర్ పదవికి గండం- మాజీ క్రికెటర్కు ఆ బాధ్యతలు!

Published : August 5, 2026 at 10:40 AM IST
Ajit Agarkar Replacement : భారత క్రికెట్ వర్గాల్లో కొత్త ప్రచారం మొదలైంది. మొన్నటిదాకా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్పై ఉన్న ఫోకస్ ఒక్కసారిగా ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వైపు మళ్లింది. ఈ క్రమంలో అగార్కర్ భవిష్యత్పై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అతడి స్థానాన్ని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఈసారి పొడగింపు లేదు!
సెలక్టర్గా అగార్కర్ పదవి వచ్చే నెలలో ముగియనుంది. వాస్తవానికి ఆయన పదవీకాలం ఇప్పటికే ముగిసినా బీసీసీఐ ఒకసారి పొడగించింది. దీంతో ఇప్పుడు మరోసారి పొడగించే ఆలోచన మేనేజ్మెంట్కు లేనట్లు తెలుస్తోంది. 2027లో వన్డే వరల్డ్కప్ నేపథ్యంలో అజిత్వైపు బీసీసీఐ మొగ్గు చూపడం లేదని సమాచారం. అందుకే ఈ బాధ్యతలను లక్మణ్కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పని చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే అతడిపైవు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీంతోపాటు మరో ప్రచారం కూడా నడుస్తోంది. వచ్చే ఏడాది ప్రపంచకప్ దాకా గంభీర్- అగార్కర్ జోడీని అలాగే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తే, అజిత్ను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
VVS LAXMAN AS TEAM INDIA CHIEF SELECTOR. 🇮🇳
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2026
- The BCCI is considering to appoint VVS as the new Chief Selector. Final decision to be made in September. (Abhishek Tripathi). pic.twitter.com/touxgavGEv
క్లారిటీ అప్పుడే!
ప్రస్తుతం సాగుతున్నవన్నీ ప్రచారాలే. వీటిపై బోర్డు సభ్యులు ఎవరూ ఇప్పటిదాకా మాట్లాడలేదు. అయితే దీనిపై వచ్చే నెలలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్లో బీసీసీఐ బోర్డు వార్షిక సమావేశం జరగనుంది. ఇందులో టీమ్ఇండియా గత సిరీస్ల ఫలితాలపై సమీక్ష, సెలక్షన్ కమిటీలో మార్పులు, జట్టు భవిష్యత్ ప్రణాళికలు, వన్డే వరల్డ్కప్ కోసం సన్నద్ధత వంటి అంశాలపై చర్చించనున్నారు. అప్పుడే ఈ ప్రచారాలపై ఓ స్పష్టత వస్తుంది.
రోహిత్ శర్మే కారణమా?
సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మకు- చీఫ్ కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్తో కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్కప్ జట్టు ప్రణాళికల్లో అతడు తమ ఆలోచనలో లేడని మేనేజ్మెంట్ భావిస్తుందని కూడా ప్రచారం జరిగింది. గతనెలలో ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్కు లార్డ్ వన్డేనే ఆఖరిది అని జోరుగా పుకార్లు వచ్చాయి. ఇదంతా అవాస్తవం అని చెప్పేందుకు ఏకంగా బీసీసీఐ కార్యదర్శి సైకియా రంగంలోకి దిగాల్సి వచ్చింది. జట్టు ప్రణాళికల్లో భాగంగా ఉన్నంతకాలం రోహిత్ ఉంటాడని ఆయన అన్నాడు. దీంతో రోహిత్ రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పడింది.
అయితే రోహిత్ వన్డే వరల్డ్కప్ ఆడాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. కానీ అతడిని మేనేజ్మెంట్ తప్పించాలని ప్రయత్నిస్తోందని ప్రచారం జరిగింది. అయితే రోహిత్ ఇంగ్లాండ్తో మూడో వన్డేలో అద్భుతమైన సెంచరీతో తన ఫామ్ చాటుకున్నాడు. దీంతో మేనేజ్మెంట్పైనా ఒత్తిడి పెరిగింది. అటు టీమ్ఇండియా అభిమానుల్లోనూ రోహిత్ వన్డే వరల్డ్కప్ ఆడాలని, అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని భావన కూడా ఉంది. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ రోహిత్,సెలక్టర్ అజిత్ ఫ్యూచర్పై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
🔴 ROHIT SHARMA CONTROVERSY PUTS AJIT AGARKAR CHAIR IN DANGER? 🤯
— Sam (@cricsam02) August 5, 2026
- BCCI is considering VVS Laxman as a possible replacement for Ajit Agarkar as chief selector.
- Agarkar's future could depend on India's performance in the Sri Lanka Test series.
- Some BCCI officials… pic.twitter.com/UmoE8a6FN0
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ల పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. అయితే అప్పటి పరిస్థితులను బట్టి ఈ పదవీకాలాన్ని మరో ఏడాది దాకా పొడగించవచ్చు. ప్రస్తుతం ఉన్న అజిత్ అగార్కర్ 2023 జులైలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా నియమితుడయ్యాడు. ఆయన పదవీకాలం గతనెలలోనే ముగిసింది. కానీ, బీసీసీఐ సెప్టెంబర్ దాకా అజిత్ను పొడగించింది.
మొన్నటిదాకా కోచ్గా ప్రచారం
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఎంపికైన తర్వాత టీమ్ఇండియా చెప్పుకోదగ్గ సాధించిన టైటిళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్కప్. ఇదే సమయంలో శ్రీలంకలో వన్డే సిరీస్, సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో వన్డే సిరిస్లు కోల్పోయింది. దీంతో అతడిని కూడా కోచ్ పదవిని నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో భారత ఏ జట్టుకు కోచ్గా ఉన్న లక్మణ్ను సీనియర్ టీమ్ కోచ్గా ప్రమోట్ చేస్తారని ప్రచారం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా లక్ష్మణ్ కోచింగ్లోనే జింబాబ్వే టూర్కు వెళ్లిన భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఈ ప్రచారం జోరందుకుంది. కానీ ఇప్పుడు కోచ్గా కాకుండా, సెలక్టర్గా బాధ్యతలు అందుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి!
'క్రికెట్లో ఎప్పట్నుంచో మద్యం తాగే కల్చర్ ఉంది- అది ఇంగ్లాండ్కు వ్యసనం కాదు!'- బెన్ స్టోక్స్

